అఖండ భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర :
కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి కి నిరసనగా న్యాయవాదుల ర్యాలీకి మద్దతు.
కేంద్ర ప్రభుత్వం , సైన్యం తీసుకునే ఏ నిర్ణయానికైనా మనం అండగా ఉందాం.
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.
మహబూబ్ నగర్/నేటి ధాత్రి
అఖండ భారతదేశాన్ని విచ్చిన్నం చేయడానికి పాకిస్థాన్ ఉగ్రవాదులు కుట్ర చేస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో న్యాయవాదులు చేపట్టిన ర్యాలీ కి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భారతదేశంలో కులమతాలకు అతీతంగా కలిసిమెలిసి సోదర భావంతో జీవిస్తున్నామని, పాకిస్థాన్ ఉగ్రవాదులు, భారతదేశంలో కులమతాల మధ్యన చిచ్చు పెట్టి దేశంలో అల్లర్లు సృష్టించేందుకు పన్నాగం పన్నారన్నారు. భారత ప్రభుత్వం, దేశ సైనికులు ఏ నిర్ణయం తీసుకున్నా దేశం మొత్తం రాజకీయాలకు అతీతంగా, పార్టీ భావ జాలాలకు అతీతంగా ఏకతాటి మీద ఉండి, అండగా ఉండాల్సిన సమయం అని ఆయన చెప్పారు. ఇప్పుడిప్పుడే కాశ్మీర్ లో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతూ కళకళలాడుతూ.. ఉందని, టూరిస్టులు పెరగడంతో కాశ్మీర్ ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని, అక్కడ వారి జీవన ప్రమాణాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయని, పాఠశాలలు కూడా అభివృద్ధి చేసుకుంటూ కులమతాలకు అతీతంగా వారు సంతోషంగా మంచి జీవనాన్ని సాగిస్తున్నారన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు పాక్ ఉగ్రవాదులు పన్నాగం పన్నారని ఆయన అన్నారు. ఈ దేశం నాది, ఈ దేశం మనది అనే భావన మనకందరికి ఉండాలని, ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టి.పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్.పి వెంకటేష్, గుండా మనోహర్, వీరబ్రహ్మచారి, రమాకాంత్ గౌడ్, మురళి కృష్ణ, లక్ష్మయ్య, కృష్ణయ్య, అనంతచారి, శ్రీపాదరావు, విక్రం గౌడ్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.