బడ్జెట్లో మంథనికి మొండిచేయి చూపిన మంత్రి…
– చేసిన వాగ్దానాల నెరవేర్చేందుకు పైసా కేటాయించలే
– అప్పు పుట్టట్లేదని పరువు తీస్తున్న సీఎం రేవంత్రెడ్డి
– 15నెలలైనా కాళేశ్వరం నిర్వాసితులకు పరిహరమేది
– ఇసుక దందా కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును ఆగం చేసిండ్లు
– ఎన్ని ఆటంకాలు ఎదురైన పేదోళ్ల కోసమే మా పోరాటం
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్
మంథని:- నేటి ధాత్రి
అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం మంత్రి శ్రీధర్బాబుకు కల్పించిన మంథని ప్రజలకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఆయన మొండి చేయి చూపించారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు.
శుక్రవారం మంథని పట్టణంలోని రాజగృహాలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంథని నియోజకవర్గంలో కుటుంబం, బంధువులు లేని మూడు ఓట్లు ఉన్న దుద్దిళ్ల కుటుంబానికి 40ఏండ్లు అవకాశం కల్పించారని,
ఈనాటి మంత్రికి ఐదుసార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన మంథని నియోజకవర్గానికి బడ్జెట్లో ఒక్కరూపాయి కేటాయించకపోగా ఈప్రాంత ప్రజలకు మంత్రిగా చేసిందేమీ లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహరం ఇప్పిస్తామని మాట ఇచ్చారని, కానీ బడ్జెట్లో మాత్రం కేటాయింపులు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
నియోజకవర్గంలో ప్రసిద్దిగాంచిన పుణ్యక్షేత్రం, అనేక ఔషదమూలికలు లభించే రామగిరి ఖిల్లాను అభివృధ్ది చేస్తానని, ఈ ప్రాంతంలో విద్యాభివృధ్దికి ప్రాధాన్యత ఇస్తానని మెడికల్ కళాశాల తీసుకువస్తానని హమీ ఇచ్చారన్నారు.
ప్రభుత్వం రాగా సీఎం రేవంత్రెడ్డి తన నియోకవర్గానికి మెడికల్కళాశాల తీసుకువెళ్లాడే కానీ ఆయన పక్కనే కూర్చుండే మంత్రి మాత్రం తన నియోజకవర్గానికి మెడికల్కళాశాలను మంజూరీచేయించలేక పోయారని ఎద్దేవా చేశారు.
పోతారం లిఫ్ట్ అయితే ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు అందుతుందనే ఆలోచనతో ఆనాడు సింగరేణి అధికారులతో మాట్లాడటం జరిగిందని, ఆనాడు ప్రతిపాదనలు కూడా చేశామని ఆయనగుర్తు చేశారు.
కానీ మంత్రిగా పోతారం లిఫ్ట్ గురించి ఊసే ఎత్తకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. చిన్న కాళేశ్వరంను ఏడాదిలోగా పూర్తి చేస్తామని మంత్రి హోదాలో మాట్లాడి ఇప్పటి వరకు ప్రతిపాదనలు చేయకపోగా ఒక్క ఎకరం భూమి కూడా సేకరణ చేయలేదన్నారు.
ఎమ్మెల్యేగా మంత్రిగా పదవులను వాడుకుంటున్నాడే తప్ప ఈ నియోజకవర్గంలో 80శాతం ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేదల గురించి ఆలోచన చేయడం లేదని, వారి సంక్షేమానికి బడ్జెట్లో రూపాయి కేటాయించలేదని విమర్శించారు.
బీడు భూములను సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టును కావాలనే బదనాం చేసి నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేశారన్నారు.
సీఎం రేవంత్రెడ్డి పక్కనే ఉండే మంత్రి వంత పాడకుండా ఈ ప్రాంత రైతుల గురించి ఆలోచన చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ఎడారిగా మారేది కాదన్నారు.
కేవలం ఇసుక దందాను కొనసాగించుకోవడానికే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని అన్నారు.
అయితే ఇటీవల నీటి పారుదల శాఖ మంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు సేఫ్ అని ప్రకటించారని, అయితే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎవరి మాటలు నమ్మాలో అర్థం కావడం లేదన్నారు.
ఒకవైపు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృధ్ది చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి స్వయంగా తమకు అప్పు పుట్టడం లేదని, తమను ఎవరూ నమ్మడం లేదంటూ మాట్లాడిన తీరు రాష్ట్ర పరువు పోయిందని ఆయన అన్నారు.
అంతేకాకుండా అసెంబ్లీ సాక్షిగా మీడియాపై అక్కసు వెల్లబోసుకున్న ముఖ్యమంత్రి బట్టలూడదీసి కొడుతానని మాట్లాడుతుంటే మంథనిలోమాత్రం మంత్రి ప్రెస్క్లబ్లను ఏర్పాటు చేయిస్తున్నాడని, దేశంలో ప్రెస్క్లబ్లకు పార్టీలను అంటగట్టిన చరిత్ర మంత్రికే దక్కిందన్నారు.
మంథని ఎమ్మెల్యే ఎప్పుడు అదికారంలో ఉంటే అప్పుడు కొత్త పద్దతులను చూపించే అలవాటు నాటి నుంచే ఉందన్నారు.
ఆనాడు మంత్రి తండ్రి సైతం ప్రజలను హింస ఏవిధంగా పెట్టాలే, నక్సల్స్ పేరుమీద ఎలా మట్టుబెట్టాలనే కొత్త పద్దతులు అవలంబిస్తే ఈనాడు మంత్రి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిపై దేశ ద్రోహం కేసులు ఎలా పెట్టాలని చూశాడన్నారు.
మనలోమనకు వైషమ్యాలు పెంచి దాన్ని వాడుకుని గొప్పగా వర్థల్లాలనే చూస్తున్నారన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఐటీ మంత్రిగా పది మందికైనా ఉద్యోగాలు ఇప్పించాలని అడుగుతూనే ఉన్నామన్నారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా ఒక్క కుటుంబానికి ఇన్నేండ్ల అవకాశం కల్పిస్తే కనీసం ప్రజల కోసం ఏదైనా చేయాలనే ఆలోచన చేయకపోవడం బాధాకరమన్నారు.
రెండుసార్లు మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో మంథని ప్రాంత అబివృద్దికి ఒక్కరూపాయి కేటాయించకపోవడం ఈ ప్రాంత ప్రజలపై ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆనాలోచిత విధానాలతో గోదావరి, మానేరు తీర ప్రాంతాల్లోని పంటలకు నీళ్లు లేక ఎండిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు.బీద ప్రజల అభ్యున్నతి కోసం ఎన్ని ఆటంకాలు సృష్టించినా ప్రజల పక్షానే ఉంటూ పోరాటం చేస్తామన్నారు.
అనంతరం మంథని పట్టణంలోని రాజాగృహ లో మంథని నియోజకవర్గంలోని అన్ని మండల నాయకులతో 23న కరీంనగర్ లో జరిగే భీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సమావేశం గురించి నాయకులకు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ దిశా నిర్దేశం చేశారు