జహీరాబాద్లో సీఎం భారీ బహిరంగ సభ..

Public Meeting Public Meeting

జహీరాబాద్లో సీఎం భారీ బహిరంగ సభ.. ఉపాధి అవకాశాలతో జహీరాబాద్లో కొత్త శకం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్/ఝరాసంగం: ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి శుక్రవారం జహీరాబాద్ పర్యటన ఏర్పాట్లు పూర్తయినట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ షట్కార్ , జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, శాసనసభ్యుడు సంజీవరెడ్డిలతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొనే భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్ , సీఎం చేతుల మీదుగా ప్రారంభించే బసవేశ్వర విగ్రహం, నిమ్జ్ ప్రాజెక్టు వెళ్లే రోడ్, ఝరాసంగం మండలం మార్చినూరులోని కేంద్రీయ విద్యాలయ భవనం, సభ స్థలాన్ని మంత్రి దామోదర్ రాజనర్సింహ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హెలిప్యాడ్ పనులు, ప్రజా సభ వేదిక, వీఐపీ గ్యాలరీ, మీడియా గ్యాలరీ , వాహనాల పార్కింగ్ పనులు, రూట్ల వారీగా ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రణాళిక వివరాలు, గ్రీనరీ, స్టేజి ఏర్పాట్లు, అలంకరణ, పరిశుభ్రత, మిషన్ భగీరథ తాగునీరు, టాయిలెట్స్ అన్ని పనులు పూర్తయ్యాయన్నారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రి వెంట ఎస్పీ పంకజ్ పరితోష్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, ఆర్డీవోలు, జిల్లా అధికారులు, తహశీల్దార్లు , ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సీఎం చే నిమ్జ్ రోడ్డు ప్రారంభం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి (నిమ్జ్) రహదారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం అట్టహాసంగా ప్రారంభించనున్నారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం, న్యాల్ కాల్ మండలం 17 గ్రామాలలో సుమారుగా 12,635 ఎకరాల భూమి సేకరించి 2.50 లక్షలమందికి ప్రత్యక్షంగా 5 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పన లక్ష్యంగా జాతీయ పెట్టుబడుల ఉత్పాదక మండలి 2013లో ఏర్పాటయింది. పరిశ్రమల ఏర్పాటు కోసం మౌలిక వసతుల కల్పనలో భాగంగా 2023 నుంచి 2025 వరకు రూ.100 కోట్లతో నిమ్జ్ కు ప్రత్యేక రహదారి నిర్మించారు. జహీరాబాద్ మండలం హుగ్గేల్లి నుంచి ఝరాసంగం మండలం బర్దిపూర్ శివారు వరకు 9 కిలోమీటర్లు, వంద అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మాణం పూర్తయింది. రోడ్డు మార్గంలో అక్కడక్కడ 13 చోట్ల వంతెనలు నిర్మించారు. హుగ్గేల్లి క్రాస్ రోడ్ నుంచి కృష్ణాపూర్, మాచునూర్, బర్దిపూర్ వరకు నిర్మించిన రోడ్డు మధ్యలో సుమారుగా 420 స్ట్రీట్ స్తంభాలను ఏర్పాటు చేసి 131 కేవీ విద్యుత్ సరఫరా కోసం ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. వాటికి విద్యుత్ దీపాలనుఅమర్చారు. రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సీఎం నిమ్జ్ లో పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు.

సభాస్థలి నుంచే రైల్వే ఓవర్ బ్రిడ్జి

జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్న సుమారు రూ.100 కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిని సీఎం రేవంత్ రెడ్డి సభాస్థలం నుంచే ప్రారంభించనున్నారు. మరో రూ.100 కోట్లతో నిర్మించిన నిమ్జ్ రోడ్ ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. దీంతో పాటు ఝరాసంఘం మండలం మాచ్నూర్ గ్రామంలో రూ. 26 కోట్లతో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ భవనాన్ని సీఎం ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో మరో అరుదైన విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. లింగాయత్ సమాజ్ సృష్టికర్త విశ్వ గురువుగా కీర్తి కిరీటాన్ని సంపాదించిన అశ్వరుడా బసవేశ్వరుని విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అదేవిధంగా సభ వేదిక ప్రాంగణంలో మరికొన్ని అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు అధికార వర్గాల సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!