Cleanliness Drive at Kommala Jathara
పరిశుభ్రంగా కొమ్మాల జాతర..
ఎప్పటికప్పుడు పరిసరాల పరిశుభ్రత..
అంటువ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్ చల్లుతూ..
నిత్యం జాతరలోనే ఉంటూ..శభాష్ శంకర్ రావు సాబ్ అనిపించుకుంటూ..
*రథోత్సవం కోసం ముందస్తు చర్యలు..ఉత్సవ కమిటీ చైర్మన్ వీరాటి రవీందర్ రెడ్డి..
నర్సంపేట/గీసుకొండ,నేటిధాత్రి:
వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం జాతర ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి.జాతర ఉత్సవాలు శుక్రవారం నాటికి నాల్గవ రోజుకు చేరుకున్న నేపథ్యంలో జాతర ప్రాంతంలో వచ్చే భక్తులకు ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామ పంచాయతీ కార్యదర్శి శంకర్ రావు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చకచక సాగుతున్నాయి.భక్తుల రాకపోకలు అధికంగా ఉండటంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ పంచాయతీ శాఖ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపడు తున్నారు.

జాతర ప్రాంగణం, పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమలు పెరగకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు.మంచినీటి ట్యాంకులు, త్రాగునీటి సరఫరా కేంద్రాల వద్ద అపరిశుభ్రత లేకుండా పనులు నిర్వహిస్తున్నారు.చికెన్ సెంటర్స్,మాంసం విక్రయశాలల వద్ద వ్యర్థాల ఎప్పటికప్పుడు తరలిస్తూ ఆయా ప్రాంతాల్లో దుర్వాసన రాకుండా, అంటువ్యాధులు వ్యాప్తి చెందకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లిస్తూ కార్యదర్శి శుభ్రపరిచే పనులు చేపడుతున్నారు.

నిత్యం జాతరలోనే ఉంటూ..పరిశుభ్రమైన వాతావరణంలో జాతర కొనసాగేందుకు చర్యలు తీసుకుంటున్న కార్యదర్శి శభాష్ శంకర్ రావు సాబ్ అనిపించుకుంటూ… ప్రశంశలు పొందుతున్నారు.ఈ నేపద్యంలో దేవాలయం ఉత్సవ కమిటీ చైర్మన్ వీరాటి రవీందర్ రెడ్డి భక్తుల సౌకర్యాలు ఎప్పటికప్పుడుడు పర్యవేక్షణ చేస్తున్నారు.జాతరలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా సంబంధిత పోలీస్ శాఖ అధికారులు సంప్రదిస్తున్నారు.ఐతే జాతరలో ప్రత్యేకంగా నిలిచే శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం తిరిగే కార్యక్రమం ఏర్పాట్ల పట్ల తగిన చర్యలకు జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ వీరాటి రవీందర్ రెడ్డి తెలిపారు.కాగా శనివారం,ఆదివారం రోజుల్లో జాతరకు భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున జాతర పరిసర ప్రాంతాల్లో పారిశుధ్యం లోపించకుండా ముందస్తు జాగ్రత్తలుగా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి శంకర్ రావు తెలిపారు.పలువురు పంచాయతీ కార్యదర్శులు ప్రశాంత్,మహేష్ పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్నట్లు కార్యదర్శి శంకర్ రావు పేర్కొన్నారు.
