CITU Submits Petition on Mine Issues
గని సమస్యలపై సిఐటియు వినతి పత్రం
మంచిర్యాల,నేటి ధాత్రి:
సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా గనిలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కార్మికుల అందరి చేత మూడు షిఫ్ట్ లలో సంతకాల సేకరణ చేసి శనివారం సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర జనరల్ సెక్రెటరీ తుమ్మల రాజారెడ్డి కార్మికుల సహకారంతో ఐకే వన్ ఎ ఓసిపి మేనేజర్ కోటయ్యకి వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోల్ కట్టర్ సపోర్ట్ మెన్ లకు నాణ్యమైన బిట్లు ఇప్పించాలని రీకండేషన్ డ్రిల్ రాడ్స్ రాకుండా చూడాలని, షార్ట్ ఫైర్ కు రెగ్యులేషన్ ప్రకారము మూడు నెలలకు ఒకసారి కేబుల్ ను అందించాలన్నారు.మైన్ ఆవరణలో గల చర్మ రోగాలతో ఉన్న కుక్కలను వెంటనే ఇక్కడ నుండి తరలించాలని కోరారు.ఆర్ ఎల్ సి నిర్వహించిన రెండు సంవత్సరాల ఎన్నికల కాల పరిమితి ముగిసినందున అన్ని కార్మిక సంఘాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది.కార్మికులు ఏ యాక్టింగ్ చేసినా కూడా వారి యొక్క జీతం చిట్టి లలో సి4 అని రావడం వలన కార్మికులకు ప్రమోషన్ రావడంలో గందరగోళం ఏర్పడే పరిస్థితి ఉందని ఏ యాక్టింగ్ అయితే ఆ యాక్టింగ్ కు సంబంధించిన క్యాటగిరిని మాత్రమే పొందుపరచాలని,కాలం చెల్లిన ఎస్ డి ఎల్ యంత్రాలను తొలగించి వాటి స్థానంలో కొత్త మెషిన్లను ఏర్పాటు చేసి కార్మికుల పని భారాన్ని తగ్గించాలని,సులబ్ కాంప్లెక్స్ కు వెళ్లడానికి కూడా సరియైన దారి ఏర్పాటు చేయాలని,మైన్ ఆవరణలో లైటింగ్ సౌకర్యం కల్పించాలని, షార్ట్ ఫైర్ కు కేబుల్ ను రెగ్యులేషన్ ప్రకారం ఇప్పించాలని, ట్రామర్లకు సరైన రెస్ట్ రూమ్ కల్పించి అందులో లాకర్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. యజమాన్యం మౌలిక సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నాయని గెలిచిన సంఘాల అసమర్ధతను యజమాన్యం అలుసుగా తీసుకొని ఉత్పత్తిపై దృష్టి పెట్టి కనీస సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు.ఈ కార్యక్రమంలో ఫిట్ సెక్రటరీ ఎన్. వెంకట్రెడ్డి,బ్రాంచ్ నాయకులు కిషన్ రెడ్డి,నవీన్,ప్రశాంత్,కృష్ణ, అనిల్ ఇతర నాయకులు పాల్గొన్నారు.
