సోయి లేకుండా వ్యవహరిస్తున్న సంభందిత అధికారులు.
టాప్ లేపిన టెంకాయ ధర..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
అయ్యో.. మెసమ్మ .. మీ మొక్కుబడి తీర్చుకోవడానికి మేము వస్తే.. ఇక్కడ టెంకాయల విక్రయదారులు ధరకు మించి వసూళ్లు చేస్తూ మా చేతికి కుళ్లిన టెంకాయలు ఇస్తున్నారమ్మ అంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్వతాపూర్ మైసమ్మ ఆలయనికి ప్రతి ఆది మంగళ గురువారాలలో అమ్మవారిని దర్శించుకునేందుకు జిల్లా నలుమూలల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. భక్తుల అవసరాలను సొమ్ము చేసుకునేందుకు ఒకవైపు వ్యాపారులు, మరోవైపు దళారులు మోసానికి పాల్పడుతున్నారు. భక్తులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. ఆలయానికి వచ్చే ప్రతి ఒక్క భక్తులు అమ్మవారి కి కొబ్బరికాయ కొట్టి మొక్కలు చెల్లించుకోవడం ఆనవాయితీ. జాతరలో టెంకాయల విక్రయ టెండర్లను దక్కించుకున్న కాంట్రాక్టర్ తన కడుపు చల్లగుండ టెంకాయలతో పాటు కుళ్లిపోయిన టెంకాయలను సైతం భక్తులకు అంటగడుతున్నాడు.
ఒక టెంకాయ 25 రూపాయలకు విక్రయించాల్సి ఉండగా 30 రూపాయలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. కానీ టెండర్ దారులు ఒక్క టెంకాయ ఇవ్వకుండా రెండు టెంకాయలు కట్టబెట్టి 60 రూపాయలు వసూలు చేస్తున్నారు.దుకాణదారులు విక్రయించే టెంకాయలలో రెండు మూడింటిలో ఒకటి కుళ్లిపోయి ఉంటున్నట్లుగా భక్తులు గుర్తించారు. ఈ విషయాన్ని ఆలయ కమిటీ సభ్యులు, అధికారులకు భక్తులు ఫిర్యాదు చేశారు. మంచి టెంకాయలే అమ్ముతానని హామీ ఇచ్చి మళ్లీ కుళ్లిపోయిన టెంకాయలే విక్రయిస్తున్నాడు. అధికారుల ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా కుళ్లిన టెంకాయలను అధిక ధరలకు విక్రయిస్తున్నా ఆలయ సీఈవో అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఏమిటనీ భక్తులు మండిపడుతున్నారు. ఆలయ పరిసరాల్లో అక్కడక్కడ కుళ్లిపోయిన టెంకాయలు కుప్పలు తిప్పలుగా పడి ఉంటున్నాయి. అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి నాణ్యతతో కూడిన టెంకాయల విక్రయాలు అధిక ధరలు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.