Chilli Theft Shocks Farmers in MallakkapetChilli Theft Shocks Farmers in Mallakkapet
మల్లక్కపేటలో మిర్చి దొంగతనం
దాదాపు 6బస్తాల వరకు మిర్చిని ఎత్తుకెళ్లిన దొంగలు
తీవ్ర నష్టం కలిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతు
మిర్చి ఎత్తుకెళ్లడంతో కుటుంబం పై ఆర్థిక ప్రభావం పడుతుంది-రైతు దొమ్మటి బాబు
పరకాల,నేటిధాత్రి
మండలంలోని మల్లక్కపేట గ్రామంలో మిర్చి దొంగతనం కలకలం రేపింది. గ్రామానికి చెందిన రైతు దొమ్మటి బాబు పండించిన మిర్చిని గుర్తు తెలియని దొంగలు దోచుకెళ్లిన ఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.రైతులు రాత్రింబవళ్లు కష్టపడి పండించిన పంటను ఇలా దొంగలు ఎత్తుకెళ్లడం పట్ల గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.వివరాల్లోకి వెళ్తే, మల్లక్కపేట గ్రామానికి చెందిన దొమ్మటి బాబు తన వ్యవసాయ భూమిలో పండించిన మిర్చిని కోసి పొలంవద్ద నిల్వ ఉంచాడు.మార్కెట్ కు తరలించేందుకు సిద్ధంచేసుకునే క్రమంలో మిర్చీని బావి వద్దనే ఎందబోసిన క్రమంలో రాత్రికి రాత్రే మాయం కావడంతో రైతు తీవ్రంగా కలత చెందాడు.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దాదాపు 6బస్తాల వరకు మిర్చిని దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది.రోజులాగానే తెల్లవారుజామున పొలానికి వెళ్లిన రైతు మిర్చి కుప్ప అనుమానస్పదంగా చిందర మందరగా కనిపించకపోవడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యాడు.వెంటనే గ్రామస్థులకు విషయం తెలియజేశాడు.రైతులు తమ పంటలను రాత్రి వేళల్లో కాపలా కాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామంలోని ఇతర రైతులు కూడా ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి దొంగతనాలు కొనసాగితే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పంటలపై ఆధారపడి జీవించే రైతులకు ఇది పెద్ద దెబ్బ అని అభిప్రాయపడుతున్నారు.
దొంగతనానికి గురైన మిర్చి పంట రైతు-దొమ్మటి బాబు
ఈ సందర్భంగా రైతు దొమ్మటి బాబు మాట్లాడుతూ ఎంతో కష్టపడి పండించిన పంటను ఇలా దొంగలు దోచుకెళ్లడం తనకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు.నెలల తరబడి శ్రమించి పండించిన మిర్చిని మార్కెట్కు తరలించేందుకు సిద్ధం చేసిన సమయంలో ఈ దొంగతనం జరగడం చాలా బాధ కలిగించిందని పేర్కొన్నాడు.రాత్రికి రాత్రే దాదాపు పది బస్తాల మిర్చి మాయం కావడంతో తనకు గణనీయమైన ఆర్థిక నష్టం వాటిల్లిందని తెలిపాడు.మార్కెట్లో మిర్చి ధరలు కొంత మెరుగ్గా ఉన్న సమయంలో అమ్మేందుకు సిద్ధం చేసిన పంట ఇలా పోవడం వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడుతుందని వాపోయాడు. రైతులు ఎంతో కష్టపడి పండించే పంటలను కాపాడుకునేందుకు కూడా ఇప్పుడు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
