ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు…
నేటి ధాత్రి- మహబూబాబాద్-గార్ల:-
కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని,రైతాంగాన్ని,కూలీలను ఆదుకోవడంలో పూర్తి వైఫల్యం చెందాయని అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జడ సత్యనారాయణ,జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జు దేవేందర్ అన్నారు.సోమవారం అఖిలభారత రైతుకూలీ సంఘం గార్ల మండల కమిటీ సమావేశం మండల అధ్యక్షులు సూత్రపు మనోహర్ అధ్యక్షతన మండల కేంద్రంలోని స్థానిక న్యూడెమోక్రసీ కార్యాలయంలో నిర్వహించారు.ఈ సందర్బంగా జడ సత్యనారాయణ,గుజ్జు దేవేందర్ లు ప్రసంగిస్తూ,ఆదివాసీలను, గిరిజన ప్రాంతాలను అభివృద్ధి పరుస్తామని అధికారంలోకి వచ్చిన కేంద్రం బిజెపి ప్రభుత్వం,రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆసిఫాబాద్,ములుగు,భద్రాది కొత్తగూడెం జిల్లా లో ఉన్న 339 ఆదివాసి గ్రామాలను 49వ జీవో ప్రకారం ఖాళీ చేయటం కోసం ప్రయత్నిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.అనేక దశాబ్దాలుగా ఏజెన్సీ ప్రాంతంలో జీవిస్తున్న ఆదివాసీలను చట్టాల ద్వారా బయటికి పంపడానికి పూనుకోవడం దారుణమని అన్నారు.ఈ మూడు జిల్లాల్లో ఉన్న గ్రామాలను బడా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి కోరుకుంటున్నాయని అన్నారు.ఇలాంటి తప్పుడు పద్ధతులు మానుకోకుంటే ప్రతిఘటన ఉద్యమం చేయాల్సి వస్తుందని అన్నారు.రాజ్యాంగంలో ఉన్న సెక్యులరిజాన్ని,సమానత్వాన్ని రద్దు పరచాలని చెప్పి ఆర్ఎస్ఎస్ పరివార్ ప్రయత్నిస్తుందని రాజ్యాంగాన్ని రద్దుచేసి మనువాదాన్ని తీసుకురావడం కోసం బిజెపి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కోరుకుంటున్నాయని అన్నారు.ఆదివాసీల నివసించే అడవులను అదానీ, అంబానీలకు వేదాంత కంపెనీలకు దారాదత్తం చేయడానికి బిజెపి ప్రభుత్వం పూనుకోవడం శోచనియమని అన్నారు.రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని,ఎరువులు,పురుగు మందులు కల్తీ లేకుండా నాణ్యమైనవి ఇవ్వాలని కోరారు.ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి జి. సకృ,మండల నాయకులు గౌనీ మల్లేష్,పాక వెంకన్న, మాలోతు మాన్య,శ్రీరాములు, నందగిరి శ్రీను, వి. సక్రు, జయరాం,చింతల గురవయ్య తదితరులు పాల్గొన్నారు.