ప్రజా సమస్యలపై నిరంతరం ఉద్యమించాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి
జమ్మికుంట:నేటిధాత్రి
స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసి వాటి పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమించాలని సిపిఎం పార్టీ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవ రెడ్డి పిలుపునిచ్చారు.
మంగళవారం రోజున జమ్మికుంట మండల కమిటీ సమావేశం కామ్రేడ్ జక్కుల రమేష్ యాదవ్ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ,పట్టణ కేంద్రంలో ప్రజలు అనేక రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.
సమస్యలను అధ్యయనం చేసి ఎక్కడికక్కడ నిర్దిష్ట కార్యాచరణతో ఆందోళన, పోరాటాలు నిర్వహించాలన్నారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసేవరకు నిరంతర పోరాటాలు చేయాలన్నారు.
భూ సమస్యలు పరిష్కరించాలన్నారునిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి ఉద్యోగాలు లేని యువతకు నిరుద్యోగ భృతి కేటాయించాలని డిమాండ్ చేశారు.
యాసంగి రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులకు పంపిణీ చేయాలన్నారు.
అర్హులైన పేదలందరికీ ఇండ్లు ఇండ్ల స్థలాలు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని అన్నారు.
ఇందిరమ్మ ఇళ్లలో రాజకీయ జోక్యం లేకుండా అధికారులు చొరవ తీసుకోవాలన్నారు.
కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలకు రేషన్ కార్డు అనుసంధానం చేస్తున్నారు కాబట్టి రేషన్ కార్డు లేనటువంటి అర్హులకు వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రజా అనుకూల నిర్ణయాలను స్వాగతిస్తూనే ప్రజా వ్యతిరేక విధానాలపై జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు ఉదృతం చేస్తామన్నారు.
పంటల బీమా పథకాన్ని అమలు చేయాలన్నారు.
మహిళలకు నెలకు 2500 రూపాయలు వెంటనే ప్రకటించి అమలు చేయాలన్నారు.
హుజురాబాద్ నియోజకవర్గం లో పెండింగ్లో ఉన్న రెండవ దఫా దళిత బంధు నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ కార్పొరేట్లకు అనుకూలంగా చట్టాలు తయారు చేస్తుందన్నారు.
29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కూల్ గా గా చేసిందని, కార్మికుల శ్రమను పెట్టుబడుదారులు దోచుకునేందుకు అవకాశం కల్పిస్తుందన్నారు.
ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ సామాజిక, ఆర్థిక భద్రతకు విఘాతం కలిగిస్తుందన్నారు.
రైతు వ్యతిరేక చట్టాలు తెస్తూ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టి వేసిందన్నారు.
ఎమ్మెస్పీకి చట్టబద్ధత కల్పించకుండా దళారుల దోపిడీకి ఊతమిస్తుందన్నారు.
దేశంలో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోయాయి అన్నారు.
జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటం నిర్వహించాలని సిపిఎం శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో జమ్మికుంట మండల కార్యదర్శి శీలం అశోక్, మండల కమిటీ సభ్యులు కన్నం సదానందం, వడ్లూరి కిషోర్, దండి గారి సతీష్, చల్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు.