కేటీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గుజ్జుల శ్రీనివాస్ రెడ్డి
నేటిధాత్రి, హైదరాబాద్
హైదరాబాద్ లోని గాంధీభవన్ లో, కేటీఆర్ వ్యాఖ్యల పట్ల తీవ్రంగా ఖండిస్తూ టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గుజ్జుల శ్రీనివాస్ రెడ్డి మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలను వదిలేసి, బంధువులకు దోచిపెట్టిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని, కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ టెండర్లలో అక్రమాలు జరిగాయని మాజీ మంత్రి కేటీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని అన్నారు. కట్టు కథను సృష్టించి బద్మాష్ నాటకాలు ఆడుతున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని, బామ్మర్దులను, బంధువులను బాగు చేసుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీదే, కేసీఆర్, కేటీఆర్ దే అని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అని అన్నారు. గెలిపించిన ప్రజలను వదిలేసి, బంధువులకు దోచిపెట్టిన బీఆర్ఎస్ ను మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనే ప్రజలు తిరస్కరించారు. పార్లమెంట్ ఎన్నికల్లోనైతే ఒక్క సీటు కూడా ఇవ్వకుండా అడ్రస్ గల్లంతు చేశారు. ఇక ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు భవిష్యత్తులేదని తేలిపోవడంతో, కేటీఆర్ నోటికొచ్చిన అబద్ధాలాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. బీఆర్ఎస్ ప్రజలకు దూరమైన ప్రభుత్వమైతే.., కాంగ్రెస్ ప్రజలకు దగ్గరైన ప్రభుత్వం అని గుర్తుంచుకో కేటీఆర్ అని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో పరిష్కరిస్తూ ప్రజలకు దగ్గరవుతున్నది. దీంతో ప్రజల్లో రేవంత్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కేటీఆర్ చవకబారు ప్రకటనలు చేస్తున్నారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరినందుకు నజరానాగా పాలమూరు రంగారెడ్డి వర్కులు ఇస్తే అవి ఆయన అల్లుడు సృజన్ రెడ్డి చేసింది వాస్తవం కాదా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందే సృజన్ రెడ్డికి – కేటీఆర్ కు మధ్య వ్యాపార సంబంధాలు ఉన్న విషయం వాస్తవం కాదా?
కేటీఆర్ కు ఉన్న బినామీల్లో సృజన్ రెడ్డి ఒకరన్న సంగతి తెలంగాణ ప్రజలందరికీ తెలుసు అని, అమృత్ టెండర్లలో సృజన్ రెడ్డి కంపెనీకి టెండర్ వచ్చిందని కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారు. అయితే టెండర్లు పిలిచినప్పుడు ఆర్థికంగా సాంకేతికంగా అనుభవం ఉన్న కంపెనీలు టెండర్లలో పాల్గొంటాయి కదా. స్టార్ టాప్ కంపెనీలు ఆర్థికంగా ఉండి సాంకేతిక అనుభవము లేని కారణంగా సాంకేతికంగా అనుభవం కలిగిన కంపెనీలతో జాయింట్ వెంచర్ పెట్టుకొని టెండర్ల లో పాల్గొంటారు అనే సంగతి కేటీఆర్ కు తెలియదా? కేవలం రాజకీయ దురుద్దేశంతోనే రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని కేటీఆర్ ను హెచ్చరిస్తున్నాం. కేటీఆర్ గుర్తుంచుకో.., అవినీతి నిరోధక చట్టం, సెక్షన్లు అని పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నావు… ఆ సెక్షన్లన్నీ మీకు మీ కుటుంబానికి వర్తిస్తాయి. మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేసే రోజు దగ్గర్లోనే ఉంది. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కాలంలో హెచ్ఎండిఏ పరిధిలో ఎన్ని భూములను కన్వర్షన్ చేశారు? ఎన్ని బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులు ఇచ్చారో అందరికీ తెలుసు. ఈ అనుమతుల్లో జరిగిన అక్రమాలపై సీబీసీఐడీ విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నాం. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎన్ని అక్రమాలు జరిగాయో, మీ కుటుంబం ఎంత అవినీతికి పాల్పడిందో చెప్పాలంటే.. రాస్తే రామాయణం వింటే మహాభారతం అంత కథ ఉంది. బీఆర్ఎస్ పాలనలో మీరు దేవుళ్లను కూడా వదిలిపెట్టలేదు కదా.., వెయ్యి కోట్ల రూపాయల యాదాద్రి పునర్నిర్మాణ పనులను ఏఅనుభవం లేని సినిమా ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో జరిపించింది మీరే కదా? మల్టీ నేషనల్ కంపెనీ ఆర్కిటెక్ట్ నిపుణులతో యాదాద్రి పనులు చేయాల్సి ఉండగా… చిన జీయర్ స్వామి కళ్లల్లో ఆనందం కోసమే ఆనందసాయికి అప్పజెప్పారు కదా..? అందులో మీరెంత తిన్నారు? పైగా, అతనికి మీరు 30 కోట్ల రూపాయలు ఎందుకు చెల్లించారని మేం ప్రశ్నిస్తున్నాం.
యాదాద్రి దేవాలయ పనుల్లో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని మేం కోరుతున్నాం. యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణ పనుల్లో ఎటువంటి అనుభవం లేని వ్యక్తి చేత ఆర్కిటెక్ట్ పనులు చేయించడం ఎంతవరకు సమంజసం అని కేటీఆర్ ని అడుగుచున్నాము. కేవలం జీయర్ స్వామి మెప్పుకోసం ఆనంద సాయి అనే సినిమా సెట్టింగులు వేసే వ్యక్తికి పనులు అప్పజెప్పి దాదాపు 30 కోట్ల రూపాయలు చెల్లించడం అవినీతి కాదా అని అడుగుతున్నాం యాదాద్రి దేవాలయ పనుల్లో జరిగిన అవకతవలపై దేవాదాయ శాఖ ఉన్నత స్థాయి విచారణ జరపాలని కోరుచున్నాము. మీ పాలనలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టే అవినీతి నిరోధక చట్టం కింద మీ చెల్లెలు ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లింది నిజం కాదా? బీజేపీ బిఆర్ఎస్ రహస్య మిత్రులు అనడానికి కవితకు బెయిల్ రావడమే నిదర్శనం. గతంలో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి రాజ్యసభలో అవసరమున్న బిల్లులకు మద్దతు ఇచ్చింది మీరు కాదా? అని అడుగుతున్నాం.
రాజకీయ లబ్ధి కోసం ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే ఊరుకోం. మీకు చేతనైతే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పాలుపంచుకోవాలే తప్ప.. సీఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు విమర్శలతో రాజకీయ పబ్బం గడుపుతామంటే ఇకపై నడవదని హెచ్చరిస్తున్నాం అని అన్నారు. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన పనులపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే సమగ్ర విచారణ జరిపి ప్రజల ముందు వాస్తవాలను ఉంచాలని టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గుజ్జుల శ్రీనివాస్ రెడ్డి కోరారు.