ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్

ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్

 

బీఆర్ఎస్ పాలనపై తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం ప్రాజెక్టలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు.

 

ఖమ్మం, ఆగస్ట్ 10: గత ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్వీర్యం చేసిందంటూ బీఆర్ఎస్ పార్టీపై రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. కమీషన్ల కోసమే ప్రాజెక్టు మధ్యలో పనులను అర్ధాంతరంగా ముగించేసిందని విమర్శించారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధిర మండలం వంగవీడులో రూ. 630 కోట్లతో నిర్మించ తలపెట్టిన జవహర్ ఎత్తిపోతల పథకానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క‌తో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఇందిరమ్మ అంటేనే పేదల ప్రభుత్వమని ఆయన ఆభివర్ణించారు.

10 ఏళ్లలో కేసీఆర్ ఒక్క ఇల్లు అయినా నిర్మించాడా? అని ప్రజలను ఈ సందర్భంగా ఆయన సూటిగా ప్రశ్నించారు. అలాగే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సన్న బియ్యం పంపిణి చేశాడా? అంటూ ప్రజలను అడిగారు. రూ. 12 వేల కోట్లతో ఆర్ అండ్ బి రోడ్లు నిర్మాణం చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన ప్రజా సంక్షేమంపై మాత్రమే ఉంటుందని.. అంతే కానీ ఓట్లపై ఉండదంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. అపర భగీరథుడని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ చివరి ఆయకట్టు రైతులకు తొలిసారి నీరు ఇచ్చేందుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కంకణం కట్టుకున్నారని తెలిపారు. దశబ్ద కాలంగా జవహార్ ఎత్తిపోతల పథకాన్ని నిర్విరం చేసిన ఘనత గత ప్రభుత్వానికే దక్కుతోందని మండిపడ్డారు. నాగార్జునసాగర్ నీరు పాలేరు రిజర్వాయర్ ద్వారా వైరాకు అక్కడి నుంచి మధిర, ఎర్రిపాలెం మండలాలకు సాగునీరు.. తాగునీరు అందించేందుకు డిప్యూటీ సీఎం భట్టి ప్రణాళికలు రచించారని వివరించారు. అందుకు రూ.630. 30 కోట్లతో ఈ రోజు శంకుస్థాపనకు శ్రీకారం చుట్టారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

ఒక వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధి పనులతో రాష్ట్రాన్ని రేవంత్ సర్కార్ పరుగులు పెట్టిస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లు మంజూరు చేశామని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. మాట ఇచ్చాం ఇల్లు పూర్తి చేస్తున్నాం.. అర్హులైన పేద ప్రజలు ఎవరూ కూడా ఇందిరమ్మ ఇళ్లు రాదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన సూచించారు. తమ ప్రభుత్వంలో రైతులకు టింగు టింగు మంటూ వారి ఖాతాలో రైతు భరోసా పథకం కింద నగదు పంపిణీ జరిగిందన్నారు. భూ భారతితో రైతులకు అనుకూలమైన చట్టం చేశామని మంత్రి పొంగులేటి వివరించారు. ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి పేదవానికి సేవ చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భరోసా ఇచ్చారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version