https://epaper.netidhatri.com/
ప్రచారంలో ప్రజలే స్వయంగా చెబుతున్న మాట. కేసిఆర్ సార్ పాలనే చల్లని దీవెన. అలాంటి సర్కారు మళ్ళీ, మళ్లీ కావాలని కోరుకుంటున్నారంటూ మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు తో ప్రజల నాడి గురించి చెప్పిన విషయాలు… ఆయన మాటల్లోనే…
`కాంగ్రెస్ పెట్టిన కష్టాలు చాలు.
`కరంటు కోతలు , బిల్లుల వాతలు వద్దు.
`కాంగ్రెస్ రైతులకు చేసిన మేలేమీ లేదు.
`కర్ణాటకలోనే సక్కగ కరంటు ఇస్తలేరు.
`ఈడెట్లిస్తరు…అంత ఒట్టి ముచ్చట.
`కారుతో తెలంగాణ వచ్చింది.
`సారుతోనే తెలంగాణ బాగుపడింది
`మళ్ల బీఆర్ఎస్ సర్కారే వస్తది.
`కాంగ్రెస్ వస్తే చెరువెండిపోతది.
`చేను చెదిరిపోతది…మళ్ల పల్లేర్లు మొలుస్తయ్..
`పొలం మాడిపోతది.. బీడువారిపోతది.
`అప్పులు నెత్తిమీదికొస్తయ్.
`అవసరమా!! కాంగ్రెస్ మనకు!!!
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణ ప్రజలు ఎంతో గొప్ప వాళ్లు. ఆత్మాభిమానం అందరికన్నా ఎక్కువ వున్నవాళ్లు. ఆత్మగౌరవం కోసం ఆరాటపడేవాళ్లు. అందుకే పద్నాలుగేళ్లపాటు నిరంతరం ముఖ్యమంత్రి కేసిఆర్తో కలిసి తెలంగాణ కోసం కొట్లాడారు. అలాంటి ప్రజలకు కాంగ్రెస్పార్టీ మాయ మాటలు చెప్పి నమ్మించాలని చూడడం వృధా ప్రయాస. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు మంచి ఏమిటో, చెడేమిటోతెలుసు. కాంగ్రెస్, బిఆర్ఎస్లలో వున్న ఏది మంచిదో తెలుసు. అసలు కాంగ్రెస్ను ఇంకా నమ్మడం అన్నది చరిత్రలో జరిగే పని కాదు. కాంగ్రెస్పెట్టిన గోసలు తెలంగాణ ప్రజలు ఎప్పుడూ మర్చిపోరు. అందుకే తెలంగాణ ప్రజలు కేసిఆర్ నాయకత్వాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేదు. సహజంగా ప్రజలు అభివృద్ధిని కాంక్షిస్తారు. తెలంగాన ప్రజలు అభివృద్ది, సంక్షేమంతోపాటు, ఆత్మగౌరవం కూడా కోరుకుంటారు. అది కాంగ్రెస్ చరిత్రలోనే లేదు. బిఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలే ప్రభువులు. కాని కాంగ్రెస్కు బాస్లు డిల్లీ పెద్దలు. వారి ఆదేశాల మేరకు మాత్రమే పనిచేస్తారు. డిల్లి పెద్దలకు ఊడిగం చేస్తారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెడతారు. అలా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని డిల్లీ పెద్దల ముందుకు తాకట్టు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ, సీమాంధ్ర నాయకులకు అడుగులకు మడుగులొత్తిందే కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ను పొరపాటున నమ్మితే ఏం జరుగుతుందో ప్రజలకు బాగా తెలుసు. నిజాం కాలంలో రాజరిక వ్యవస్ధకు వ్యతిరేకంగా, భూస్వాములను ఎదిరించి తెలంగాణ సాధించుకుంటే, భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో ఆంధ్రలో కలిపి తీరని ద్రోహం చేసిందే కాంగ్రెస్పార్టీ. ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదు. భూస్వాములను ఎదిరించింది కాంగ్రెస్ కాదు. కాని హైదరాబాద్ రాష్ట్రం ఏర్పాటు కాగానే పెత్తనం చేసింది మాత్రం కాంగ్రెస్. తెలంగాణను వంచించింది కాంగ్రెస్. తెలంగాణకు ఇష్టం లేకున్నా ఆంధ్రాతో కలిపింది కాంగ్రెస్. అలా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆదిలోనే దెబ్బతీసిన పార్టీ అది. ఆ తర్వాత ఎప్పుడూ తెలంగాణ ప్రజల మనోభావాలను పట్టించుకోలేదు. కనీసం విలువ ఇవ్వలేదు. 1969 ఉద్యమంలో 350 మంది తెలంగాణ యువతను కాల్చి చంపిన దుర్మార్గపు పార్టీ అది. 2004లో కూడా తెలంగాణ ప్రజలు నమ్మితే ఏం చేసింది. పదేళ్లపాటు తెలంగాణ ఇవ్వడానికి కాలయాపన చేసింది. తెలంగాణను మరింత గోస పెట్టింది. 2009లో ఇక తప్పని పరిస్ధితులు ముఖ్యమంత్రి కేసిఆర్ ఉద్యమ నాయకుడిగా సృష్టించారు. తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేపట్టారు. తెలంగాణ ప్రకటన వచ్చేలా చేశారు. అయినా కనికరం లేని, తెలంగాణ పట్ల సానుకూలం కాని కాంగ్రెస్ పార్టీ పక్షం రోజుల్లోనే తెలంగాణ ప్రకటన వెనక్కి తీసుకున్నది. తెలంగాణ ఇచ్చినట్లే ఇచ్చి కేవలం రాజకీయ స్వార్ధం కోసం వెనక్కి తీసుకున్నది. ఇలా 1971లో జరిగిన ఎన్నికల్లో తెలంగాన ప్రజా సమితి 11 ఎంపి సీట్లు గెలిచినా, ఆనాడు అలాగే ఇందిరాగాంధీ రూపంలో అన్యాయం చేసింది. నెహ్రూ తెలంగాణను, ఆంద్రాను కలిపి అన్యాయానికి భీజం వేశాడు. ఇలా కాంగ్రెస్ అడుగడునా అన్యాయం చేసింది. కాంగ్రెస్ చేసిన ఘోరాలు రాస్తే రామాయణం కన్నా పెద్దగా అవుతుంది. అలా రాజకీయంగా దుర్మారంగా వ్యవహరించి, పాలన విషయంలో కూడా వివక్ష చూపించి, తెలంగాణను అరిగోస పెట్టిన పార్టీ అది. అందువల్ల కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రజలు ఎప్పుడూ మర్చిపోలేదు. తాను ఎన్నికల ప్రచారం కోసం పల్లెల్లో తిరుగుతుంటే ప్రజలే వచ్చి నాటి పరిస్ధితులు గుర్తు చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఎంత అందంగా, ఆనందంగా, సంతోషంగా వుందో చెబుతున్నారు. తెలంగాణ ప్రజల జీవితాల్లో ఎన్ని వెలుగులు నిండుతున్నాయో వివరిస్తున్నారు. నన్ను ఆశీర్వదించి పంపుతున్నారు. తెలంగాణకు ముఖ్యమంత్రి కేసిఆర్ సారే శ్రీరామ రక్ష అని అంటున్నారు. మళ్లీ మళ్లీ కారు,సారు,సర్కారే రావాలని చెబుతున్నారు. తెలంగాణ ప్రజల నాడి ఇక్కడే తెలిసిపోతుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్, నేటి ధాత్రి ఎడిటర్ కట్టారాఘవేంద్రరావుతో పంచుకున్న ప్రచార విశేషాలు..ఆయన మాటల్లోనే…
ప్రచారం సమయంలో ప్రజలు చెబుతున్న విషయాలు వింటుంటే ఆశ్చర్యమేస్తోంది.
నిజంగా తెలంగాణ ప్రజల గుండెల్లో బిఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కేసిఆర్ ఎంతలా గూడు కట్టుకొని వున్నాడో అర్దమౌతోంది. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత వుందో తెలుస్తోంది. తెలంగాణ సమాజం కాంగ్రెస్ అంటేనే ఉలిక్కిపడినంత పనౌతుంది. ఆ రోజలు గుర్తు చేసుకొని కళ్లకు నీళ్లు తీసుకుంటున్నారు. ఈ రోజులను తల్చుకుంటూ మమ్మల్ని దీవిస్తున్నారు. పదేళ్ల క్రితం తెలంగాణ ఒక ఎడారి. ఇప్పుడు ఒయాసిస్సు. తాగడానికి చుక్క నీరుదొరకని నాటి నుంచి నేడు తెలంగాణ జలమే జగమైనంత సంతోషం కనిపిస్తోంది. బిందెడు మంచి నీటి కోసం మైళ్ల దూరం నడిచిన ఆడబిడ్డలకు ఇంటిలోకే సురక్షితమైన మిషన్ భగీరధ మంచినీళ్లు అందుతున్నాయి. ఇలా ఏనాడైనా గత పాలకులు చేశారా? ప్రజల కష్టం పట్టించుకున్నారా? ప్రజల దాహం తీర్చాలని చూశారా? ప్రజలు ఎంత మొత్తుకున్నా గుక్కెడు మంచినీళ్లు ఇచ్చేందుకు కూడా నాటి పాలకులకు చేతులు రాలేదు. ఫ్లోరైడ్ రక్కసి మూలంగా తెలంగాణలో ప్రజల కాళ్లూ చేతులు వంకర్లుపోయి, చిన్న తనంలోనే ముసలి తనం వచ్చి, అవిటి తనం వెక్కిరించి, కట్టెపుల్లల్లా కాళ్లూ చేతులు విరిపోయే జీవితాలు ఒక తరం అనుభవించింది. ఇప్పుడు తెలంగాణలో ఫ్లోరైడ్ అన్న మాట కూడ వినపడకుండా చేశాం. ఒకప్పుడు పండే పంటలోనూ కూడా ఫ్లోరైడే వుండేది. ముఖ్యంగా సగం తెలంగాణలోనూ ఫ్లోరైడ్ తో కూడిన బియ్యం తినాల్సిన పరిస్ధితులు వుండేవి. ఇప్పుడు సురక్షితమైన మంచినీరుతో పంటలు పండుతున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్నాయి. పదేళ్ల క్రితం తినే తిండి కూడా మన జీవితాలను ఆగం చేసేలా పాలన చేసింది దుర్మార్గులు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇక కరంటు కష్టాలు చెప్పనలవి కాదు. ఒకప్పుడు తెలంగాణలో ఎలాంటి పరిస్దితులు వున్నాయో, ఇప్పుడు సాక్ష్యాత్తు కర్నాకటలో అవే పరిస్ధితులు వున్నాయి. తాజా సమాచారం ఏమిటంటే కర్నాటకలో రైతులకు మూడు గంటల కరంటు కూడా అందడం లేదు. అక్కడి మంత్రులే ఐదు గంటలు ఇస్తున్నామంటూ చెప్పారు. ప్రజలు మాత్రం కనీసం మూడు గంటలు కూడా రావడం లేదంటున్నారు. మరి మన తెలంగాణలో రెప్పపాటు కరంటు కోత కూడా లేదు. అందులోనూ రైతులకు నిరంతరం విద్యుత్ అందుతోంది. ఇళ్లల్లో ముఖ్యంగా పల్లెల్లో అవరైఏళ్ల ఉమ్మడి పాలనలో ఏ ఒక్క నాడు 24 గంటల కరంటు రాలేదు. తెలంగాణలో అన్ని కాలాల్లో రెప్పపాటు కూడా కరంటు పోవడం లేదు. గత పాలకులు చెరువులను ద్వంసం చేశారు. అభివృద్ది పట్టించుకోలేదు. సంక్షేమం అమలు చేయలేదు. ప్రజలంటే కనికరం చూపలేదు. ఎంత సేపు రాజకీయం.. తప్ప మరొక విధానం వారిలో లేదు.
దేశంలోనే తెలంగాణ అంటేనే ఒక సంక్షేమ పాలన.
తెలంగాణ అంటే ఒక గొప్ప అనుభూతి. ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వమంటేనే గొప్ప భావన. పదేళ్ల క్రితం వున్న తెలంగాణను చూసిన వాళ్లు, ఇప్పుడు చూసి అబ్బురపడుతున్నారు. తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో జీవితం గడుపుతున్నారు. ఒకప్పుడు సాగు వాటు రోజే కన్నీళ్లు పెట్టుకునే రైతన్న, దాన్యం చేతికొచ్చే దాక కన్నీళ్ల వ్యవసాయం చేసేవాడు. కాని నేడు సాగు వాటు రోజే సంతోషంగా విత్తనాలు చల్లుతున్నారు. కాలు మీద కాలేసుకొని వ్యవసాయం చేస్తున్నారు. రైతు బంధుతో అందుతున్న పెట్టుబడి సాయంతో సాగుకు శ్రీకారం చుడుతున్నారు. నిరంతరం నీటి చెలుమలుగా మారిన బావులు, బోర్లతో పుష్కలమైన నీటితో గుంట కూడా వృధా చేయకుండా సాగు చేస్తున్నాడు. ఇరవై నాలుగు గంటల కరంటుతో పంట ఎండిపోవడం అంటే ఏమిటో మర్చిపోయాడు. పండిన పంటను ప్రభుత్వమే కొని, కళ్లంలోనే డబ్బులు ఇస్తుంటే కళ్లారా చూసుకొని మురుస్తున్నడు. అలాంటి రైతు మద్దతు కేసిఆర్కే…వారి ఆశీర్వాదం బిఆర్ఎస్కే.. మా ప్రభుత్వమే మళ్లీ వచ్చేది. హాట్రిక్ విజయం నమోదు చేసేది…ప్రజలు మా గుండెల్లో వున్నారు…మేం వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాం…అందుకే విజయం మాదే..సర్కారు కారుదే…