కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆగిన బ్రిడ్జి నిర్మాణం పనులు.
ఓడేడ్ బ్రిడ్జి ని పూర్తి చేయండి.
రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి.
పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించి దూరాన్ని తగ్గించాలని డిమాండ్.
సిపిఐ జిల్లా పూర్వ కార్యదర్శి గౌతం గోవర్ధన్.
ముత్తారం :- నేటి ధాత్రి
మంథని నియోజక వర్గ పరిధిలో ఓడేడ్ గ్రామ శివారులో మానేరు నది పై గత ప్రభుత్వ పాలన లో ప్రారంభమైన బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకుండానే కూలి పోయిందని, దానిని వెంటనే పూర్తి చేసి పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించి దూరాన్ని తగ్గించాలని సిపిఐ జిల్లా పూర్వ కార్యదర్శి గౌతం గోవర్ధన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఓడెడ్ గ్రామ శివారులో లో కూలి పోయిన బ్రిడ్జి ని పరిశీలించి అనంతరం మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణం లో లోపాలు ఉన్న మూలంగా నిర్మాణం పూర్తి కాకుండానే పిల్లర్ లు కూలిపోయాయని ఆయన ఆరోపించారు. బ్రిడ్జి నిర్మాణం లో కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించక పోవడం, ప్రభుత్వ అధికారుల అజమాయిషీ లేక పోవడం మూలంగా బ్రిడ్జి పిల్లర్లు గాలి దుమారానికి కూలీ పోయాయని ఆయన ఆరోపించారు. బ్రిడ్జి పిల్లర్లు కూలీ రెండు సంవత్సరాలు గడిచినా ఇంత వరకు రాష్ట్ర ప్రభుత్వం దీనిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన ఆరోపించారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాక పోవడం వల్ల బ్రిడ్జి పక్క నుంచి తాత్కాలికంగా మట్టి రోడ్డు మీద వాహానాల ద్వారా సమీప ప్రాంతంలో ఉన్న ప్రజలు మరియు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు కూడా చాలా మంది ఈ బ్రిడ్జి ప్రక్క నుంచి ప్రయాణం చేస్తున్నప్పటికీ ని వర్షాకాలంలో ఇబ్బందులకు గురి అవుతారని ఆయన పేర్కొన్నారు. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా మంత్రి వర్యులు శ్రీదర్ బాబు దృష్టి సారించి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు, ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి ఐతే దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరం రెండు జిల్లాల ప్రజలకు తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.