మోదీ పర్యటనపై అక్కసు..! ట్రెండింగ్ లో బాయ్ కాట్ మాల్దీవ్స్! #BoycottMaldives

సోషల్‌ మీడియాలో బాయ్‌కాట్‌ మాల్దీవులు హ్యాష్‌ట్యాగ్‌ ట్విట్టర్‌లో విపరీతంగా ట్రెండ్‌ అవుతున్నది. ఇండియాలో ఇప్పుడిదే ట్రెండింగ్ ఇష్యూ.!! లక్షద్వీప్‌లో మోదీ పర్యటిస్తే.. మాల్దీవులు ఎందుకు ఉలిక్కిపడుతోంది..? భారత పర్యాటకాన్ని ప్రచారం చేస్తే.. మాల్దీవ్స్‌కు వచ్చిన నష్టమేంటి..?

గత కొంతకాలంగా బలహీనపడుతూ వస్తున్న భారత్​- మాల్దీవుల బంధం తాజాగా మరో కీలక మలుపు తీసుకుంది. గతేడాది నవంబర్ దాకా భారత్, మాల్దీవుల మధ్య సత్సంబంధాలు ఉండేవి. అక్కడి అందాలను వీక్షించడం కోసం మన ఇండియా నుంచి లక్షల మంది పర్యాటకులు వెళ్లేవాళ్లు. సాధారణ ప్రజల దగ్గర నుంచి సెలెబ్రిటీల వరకు ఈ మాల్దీవులను సందర్శనకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ.. ఇప్పుడు పరిస్థితులు అందుకు భిన్నంగా మారిపోయాయి. ఎవరైతే నిన్నటిదాకా మాల్దీవుల్ని నెత్తిమీద పెట్టుకున్నారో ఇప్పుడు వాళ్లే దీనిని బాయ్‌కాట్ చేయాలని ట్వీట్ చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది తమ మాల్దీవుల ట్రిప్‌ని రద్దు చేసుకున్నారు. సెలెబ్రిటీలు సైతం ఈ ట్రెండ్‌లోకి చేరిపోయి భారత్‌కి మద్దతు ఇస్తున్నారు. దీంతో.. #BoycottMaldives అనే హ్యాష్‌ట్యాగ్ నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. అసలు ఎందుకు ఇది ట్రెండింగ్‌గా మారింది, ఈ వివాదం ఏంటో ఒకసారి చూద్దాం.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర పాలిత ప్రాంతం లక్షద్వీప్‌‌లో పర్యటించారు. అక్కడ సముద్రం ఒడ్డున కాసేపు సేద తీరడంతో పాటు సముద్రంలో స్నార్కెలింగ్‌ చేసిన మోదీ.. సాహసాలు చేయాలనుకునే వారు తమ లిస్ట్‌లో లక్షద్వీప్‌ను కూడా చేర్చుకోవాలని సూచించారు. దీనిపై మాల్దీవులు ఎంపీలు అక్కసు వెళ్లగక్కారు. పర్యాటక రంగంలో మాల్దీవులతో పోటీ పడలేరని, లక్షద్వీప్‌ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని ట్వీట్ చేశారు. తమ దేశం అందించే సర్వీసుల్ని అక్కడ అందించలేరని, అక్కడి గదుల్లో వచ్చే వాసన అతిపెద్ద సమస్య అని జహీద్ తన ట్వీట్‌లో వెల్లడించారు. దీంతో మండిపడ్డ భారతీయులు… పర్యాటకంగా మాల్దీవుల్ని బహిష్కరించాలని కామెంట్లు చేస్తున్నారు.

#BoycottMaldives ట్రెండ్‌కి మద్దతు ఇస్తూ కొందరు సెలెబ్రిటీలు రంగంలోకి దిగారు. మాల్దీవులకు చెందిన ప్రముఖ ప్రజాప్రతినిధులు భారతీయులపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని.. అత్యధిక సంఖ్యలో పర్యాటకులను పంపే దేశం పట్ల వాళ్లు ఇలా ప్రవర్తించడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు. నటి శ్రద్ధా కపూర్ సైతం.. లక్షద్వీప్‌లో అందమైన బీచ్‌లు, తీరప్రాంతాలు ఉన్నాయని, సెలవుల్లో తాను అక్కడికే వెళ్లాలని కోరుకుంటున్నానని తెలిపింది. సచిన్ టెండూల్కర్ అయితే.. లక్షద్వీప్ బీచ్ వద్ద క్రికెట్ ఆడుతున్న వీడియోని షేర్ చేస్తూ, అక్కడి అనుభవాల్ని పంచుకున్నారు. ఇలా ఇతర సెలెబ్రిటీలు లక్షద్వీప్‌కి మద్దతుగా ట్వీట్ చేస్తూ.. మాల్దీవులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు.

అయితే ఇది కేవలం పర్యాటకానికి సంబంధించిన అంశం కాదు.. రెండు దేశాల దౌత్యానికి సంబంధించింది. భారత్‌తో సంబంధాల విషయంలో మాల్దీవులు దుందుడుకు వైఖరిని అవలంబిస్తోంది. ఈ ఐల్యాండ్‌పై చైనా, టర్కీ, పాకిస్తాన్‌ తమ ఆధిపత్యాన్ని చెలాయించాలనుకుంటున్నాయి. ప్రధానంగా చైనా మాల్దీవుల రాజకీయాల్లో జోక్యంతో భారత్‌పై విషం చిమ్మే చర్యలకు, రెచ్చగొట్టే ధోరణికి దిగుతూ వస్తోంది. అయితే భారత్‌పై అక్కసు వెళ్లగక్కితే ఎలా ఉంటుందో మాల్దీవులకు అర్థం అయింది. ఆ దేశ మంత్రులు, ఎంపీ భారత్‌పై, ప్రధాని మోదీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు వారు భారీగానే మూల్యం చెల్లించుకుంటున్నారు. భారత్ నుంచి ఎదురైన వ్యతిరేకతతో మాల్దీవులు ప్రభుత్వం.. చర్యలు చేపట్టింది. ముగ్గురు మంత్రులను వారి పదవుల నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *