వీగిన అవిశ్వాసం…

మళ్ళీ జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు

జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :

జమ్మికుంట మున్సిపాలిటీ చైర్మన్ తక్కెళ్ళపల్లి రాజేశ్వర్ రావు పై పెట్టిన అవిశ్వాసం తీర్మానం వీగిపోయింది. గురువారం ఉదయం 10 గంటలకు జమ్మికుంట మున్సిపాలిటీ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానానికి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు గురువారం 10 గంటలకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాల మేరకు మున్సిపల్ కౌన్సిల్ సభ్యులకు నోటీసులు జారీ చేశారు. కానీ.. 10 గంటల వరకు 10వ వార్డ్ కౌన్సిలర్ పొనగంటి విజయలక్ష్మి ఒక్క కౌన్సిల్ సభ్యురాలు మాత్రమే హాజరయ్యారు. తిరిగి మళ్లీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు సమయాన్ని అధికారులు పొడిగించారు. అయినా కౌన్సిల్ సభ్యులు అవిశ్వాసం ప్రవేశ పెట్టేందుకు కోరంకు తగినంత మంది సభ్యులు సమావేశానికి హాజరు కాకపోవడంతో పొనగంటి మల్లయ్య (కౌన్సిలర్) పెట్టిన అవిశ్వాసం వీగిపోయినట్లుగా ప్రత్యేక అధికారి మహేశ్వర్ తెలిపారు. మున్సిపల్ చైర్మన్ గా తక్కళ్ళపల్లి రాజేశ్వరరావు కొనసాగనున్నారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగకుండా ముందు జాగ్రత్తగా హుజురాబాద్ ఏసిపి ఎల్ జీవన్ రెడ్డి నేతృత్వంలో జమ్మికుంట సిఐ బర్పటి రమేష్ ఆధ్వర్యంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బిర్రు శ్రీనివాస్, హుజురాబాద్ సిఐ బొల్లం రమేష్, జమ్మికుంట ఎస్సై రాజేష్, ఇల్లందకుంట ఎస్సై రాజ్ కుమార్, ఏఎస్ఐ రాధాకృష్ణ, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *