భూ భారతి చట్టం..పేద రైతుల చుట్టం
-భూ భారతితో భూ వివాదాలన్నీ పరిష్కారం.
-నవాబ్ పేట్ సదస్సులో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
నవాబుపేట నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న భూభారతి చట్టం పేదల రైతులు, ప్రజల చుట్టం అనీ, దీని ద్వారా రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి మంగళవారం అన్నారు. నవాబ్ పేట్ మండల కేంద్రంలో నిర్వహించిన భూ భారతి అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలనలో అప్పటి ఎమ్మెల్యేలు నిరుపేదల భూములను కబ్జాలు చేసి వేలకోట్లు సంపాదించారని విమర్శించారు. పేద ప్రజల భూములకు పట్టా పాస్ బుక్ లు ఇవ్వకుండా ఎన్నో రకాలుగా వారిని ఇబ్బందులకు గురి చేశారని గుర్తు చేశారు. భూ భారతి చట్టం రైతుల చట్టం, భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి తెచ్చిందే భూ భారతి చట్టం అని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తికి ఆధార్ లాగా, ప్రతి భూమికి భూధార్ కార్డుని ప్రభుత్వం అందజేస్తుందన్నారు. భూమి రికార్డులను మోసపూరితంగా మార్చి ప్రభుత్వ ,భూధాన్, అసైన్డ్, దేవాదాయ, భూములను ఎవరైనా పట్టా చేసుకుంటే వాటిని రద్దు చేసేలా సీసీఎల్ఏకి అధికారాలు ఉంటాయన్నారు. కొత్త చట్టంలో అప్పీలు వ్యవస్థ తెచ్చామని, ఎవరి భూమి అయిన వేరే వాళ్ళకు తప్పుగా నమోదైతే ఎమ్మార్వో, ఆర్డీవో, జేసీ, కలెక్టర్ కు అప్పీలు చేసుకొని పరిష్కరించుకోవచ్చాన్నారు.

ప్రతి సమస్య పరిష్కారానికి నిర్ణీత గడువు ఉంటుందని, ఆ గడువులోపుగానే సమస్యలు పరిష్కారమౌతాయని, అందుకే భూ భారతి చట్టం వచ్చాక రైతులు తమ భూ సమస్యల పరిష్కారానికి అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని అభిప్రాయపడ్డారు. ప్రతి గ్రామానికి గ్రామ పరిపాలన అధికారులను నియమించడంతో రైతులకు అన్ని సమస్యలు గ్రామంలోనే పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. జూన్ నెలలో ప్రతి గ్రామంలో అధికారులు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారని అన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసి రైతులకు, ప్రజలకు అన్ని సేవలు అందించేలా ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని అనిరుధ్ రెడ్డి వివరించారు. ధరణి వల్ల రైతులు, భూ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఆర్ఓఆర్ చట్టం భూభారతితో సులభంగా పరిష్కారం అవుతుందన్నారు. ధరణి రిజిస్ట్రేషన్ లో పొరపాటు జరిగిన సరిదిద్దుకునే అవకాశం ఉండేది కాదని, పేద రైతులు కోట్ల చుట్టూ తిరగాల్సి వచ్చేదాని వ్యాఖ్యానించారు. ధరణి వల్ల అన్నదమ్ములు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు పెట్టిందని వివరించారు. ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టం మొత్తం పారదర్శకంగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు.