సోషల్ మీడియా, ఏఐ పై అప్రమత్తంగా ఉండాలి…
త్వరలో హైదరాబాదులో జాతీయ సదస్సు….
అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్ కార్డులు జారీ…
– తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి..
–
రామాయంపేట ఏప్రిల్ 22
నేటిధాత్రి (మెదక్)
మీడియా భవిష్యత్ కు ప్రశ్నార్థకంగా సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ పట్ల అప్రమత్తంగా ఉండాలని, దీనిపై త్వరలో హైదరాబాదులో జాతీయస్థాయి వర్క్ షాప్ ను నిర్వహిస్తామని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం నాగర్ కర్నూలు జిల్లా సోమశిలలో రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ అధ్యక్షతన జరిగిన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ మూలంగా భవిష్యత్తులో మీడియా రంగంలో మ్యాన్ పవర్ లేకుండా చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కల్పితాలతో ఏఐ సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రమాదం పొంచి ఉందని, దీనిపై జర్నలిస్టులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. సోషల్ మీడియా విప్లవం భావ ప్రకటన స్వేచ్ఛకు మంచి వేదిక అయినప్పటికీ దానిని అడ్డుపెట్టుకొని కొన్ని శక్తులు అలజడి సృష్టించడం సహించరానిది అన్నారు. రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించిందే కానీ ఇతరుల స్వేచ్ఛను హరించే హక్కు ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వం రూపొందించిన అక్రిడిటేషన్ జీవో అప్రజాస్వామికంగా ఉందని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆ జీవను రద్దు చేస్తూ గదా అక్టోబర్ మాసంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. దీంతో కొత్త మార్గదర్శకాలు రూపొందించేందుకు కమిటీ వేశామని , అంతేకాకుండా ఆ కమిటీ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిందన్నారు. త్వరలో దీనికి సంబంధించిన జీవో విడుదల కాను ఉందని ఆయన స్పష్టం చేశారు. అక్రిడిటేషన్ కార్డుల విషయంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని, ఈ విషయమై ఎవరు ఆందోళన చెందవద్దని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు అవుతాయని ఆయన తెలిపారు. అక్రిడిటేషన్ కమిటీలను కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారం
ఉద్యమాలతోనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఐజేయు స్టీరింగ్ కమిటీ మెంబర్ దేవులపల్లి అమర్ అన్నారు. ప్రభుత్వాలు ఏవైనా జర్నలిస్టుల పక్షపాతిగా, జర్నలిస్టుల సంక్షేమం కోసం గత 65 ఏళ్లుగా పోరాడుతున్న చరిత్ర తమ సంఘానికే ఉందని అన్నారు. సంఘ నాయకులకు ప్రభుత్వ పదవులు వచ్చినంత మాత్రాన, సంఘ ప్రయోజనాల కోసం కాదని ఆ పదవుల బాధ్యతలు వేరుగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
టీయూడబ్ల్యూజే ఐజేయు ఏ ప్రభుత్వానికి, ఏ పార్టీకి అనుకూలం కాదు
టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఏ ప్రభుత్వానికి, ఏ పార్టీకి అనుకూలం కాదని, జర్నలిస్టుల సంక్షేమమే ఏకైక లక్ష్యమని రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ స్పష్టం చేశారు. జర్నలిస్టుల ప్రధాన సమస్యలైన ఇండ్లు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, అక్రిడిటేషన్ కార్డులు, ఉచిత విద్య తదితర సమస్యలపై ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. తమ సంఘం వినతి మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మెడికవర్ ఆసుపత్రుల్లో ఉండే ఆర్థోపెడిక్, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులకు హెల్త్ కార్డులపై చికిత్స చేసేందుకు ఆసుపత్రి యాజమాన్యం నిర్ణయించడం అభినందనీయమని అన్నారు. గత కార్యవర్గ సమావేశం అనంతరం చేపట్టిన కార్యకలాపాలపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే రామనారాయణ నివేదిక సమర్పించారు. ఈ సమావేశంలో ఐజేయూ కార్యదర్శి వై నరేందర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు నగునూరి శేఖర్, టీయూడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి కే రాములు, ఉపాధ్యక్షులు బుర్ర సంపత్ కుమార్ గౌడ్, గాడిపల్లి మధు గౌడ్, పైసల్ అహ్మద్, రాష్ట్ర కార్యదర్శులు గుండ్రాతి మధుగౌడ్, వరకాల యాదగిరి, కే శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి మోతే వెంకటరెడ్డి తో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూతురు రాజిరెడ్డి, డి.జి.శ్రీనివాస శర్మ రవీందర్, సురేందర్ తో పాటు ప్రత్యేక ఆహ్వానితులు హాజరయ్యారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించిన నాగర్ కర్నూల్ జిల్లా శాఖను రాష్ట్ర కార్యవర్గం అభినందించింది.
తీర్మానాలు
——————
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర మంత్రులందరికీ యుద్ధ ప్రాతిపదికన వినతి పత్రాలు అందించాలని సమావేశం తీర్మానించింది.
సంఘ సంస్థాగత కార్యకలాపాలను మరింత పటిష్టం చేయడానికి రాష్ట్ర బాధ్యులను జిల్లా ఇన్చార్జిలుగా నియమించాలని కార్యవర్గం నిర్ణయించింది.
టీయూడబ్ల్యూజే (ఐజేయు)కు అనుబంధంగా ఉన్న ప్రెస్ క్లబ్ ల కార్యకలాపాలను పరిశీలించేందుకు గాను ఆరుగురు సీనియర్లతో కమిటీ ఏర్పాటు చేయాలని కార్యవర్గం నిర్ణయించింది.
ఆర్టీసీ బస్సుల్లో జర్నలిస్టులకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేసింది.