Heavy Rain Alert for Next 48 Hours
భారీ వర్షాలు పట్ల అప్రమత్తంగా ఉండాలి
రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు
గీసుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్
నర్సంపేట/గీసుకొండ,నేటిధాత్రి:
వరంగల్ జిల్లా గీసుకొండ మండల పరిధిలో రానున్న 48 గంటలలో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
గీసుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్ కోరారు.వ్యవసాయ అధికారుల సూచనల నేపథ్యంలో ప్రజలు తమ ప్రాణాలు, ఆస్తులను రక్షించుకునేందుకు జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలన్నారు.వర్షాల సమయంలో కరెంట్ స్తంభాలు, వైర్లు, ట్రాన్స్ఫార్మర్లు వంటి విద్యుత్ పరికరాల పరిసర ప్రాంతాల్లోకి వెళ్లకూడదని హెచ్చరించారు. పాత, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించకుండా, అవసరమైతే సురక్షిత ప్రదేశాలకు తరలించుకోవాలని సూచించారు.చెరువులు, వాగులు, కాలువలు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున చేపల వేట లేదా ఈతకు వెళ్లరాదని తెలిపారు. రైతులు తమ పంటలను రక్షించుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.పిల్లలను వర్షంలో బయటకు పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లరాదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వాహనదారులు రోడ్లపై ప్రయాణించే సమయంలో వాహన లైట్లు, ఇండికేటర్లు ఆన్ చేసి జాగ్రత్తగా ప్రయాణించాలి.రోడ్డుపై నీరు నిలిచిన ప్రాంతాల్లో దాటేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, వేగంగా వీచే గాలుల వల్ల చెట్లు విరిగిపడే ప్రమాదం ఉన్నందున మరింత జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు.ఏవైనా అత్యవసర పరిస్థితులు తలెత్తిన వెంటనే డయల్ 100 కు కాల్ చేయాలని తెలిపారు. ఎటువంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ ఇతర శాఖలతో కలిసి సిద్ధంగా ఉందని సర్కిల్ ఇన్స్పెక్టర్ విశ్వేశ్వర్ పేర్కొన్నారు.
