అమాయక గిరిజనులపై నిషేధిత సీపిఐ మావోయిస్టు పార్టీ దాడులు హేయమైన చర్య : ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్

మావోయిస్టుల దుశ్చర్య వలన ఆవును కోల్పోయిన గిరిజనుడిని పరామర్శించిన ఎస్పీ
భద్రాచలం నేటి ధాత్రి;
తెలంగాణ-చత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో నివసించే ఆదివాసీ ప్రజలను నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ నాయకులు మీటింగుల పేరుతో బెదిరిస్తూ,వారి వద్ద నుండి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని ఈ రోజు జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ ఒక ప్రకటనలో వెల్లడించారు.మావోయిస్టు పార్టీ నిర్వహించే మీటింగులకు హాజరు కాకపోతే ఆదీవాసిలపై దాడులకు పాల్పడుతూ,వారిని హింసించే చర్యలకు పాల్పడటం అమానుషమని అన్నారు.నిషేధిత మావోయిస్టు పార్టీ పోలీసు బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడటమే కాకుండా అడవినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఆదీవాసిలపై కూడా దాడులు చేస్తున్నారని తెలిపారు.రాంపురం-పూసుగుప్ప అటవీ ప్రాంతంలో నిత్యం గిరిజనులు సంచరించే ప్రదేశాలలో ప్రెజర్ మైన్స్ ను అమర్చడం ద్వారా ఒక గిరిజనుడికి చెందిన గర్భస్థ ఆవు ప్రాణాలను కోల్పోవడం జరిగింది.మావోయిస్టుల వలన నష్టపోయిన గిరిజనుడిని నిన్న జిల్లా ఎస్పీ స్వయంగా పరామర్శించారు.ఆదివాసి ప్రజలకు అండగా ఉంటామని చెబుతూ వారిపైనే దాడులు చేస్తున్న మావోయిస్టు పార్టీ చర్యల పట్ల ఆదీవాసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

జల్,జంగిల్,జమీన్ కోసం ఆదీవాసి ప్రజల తరపున పోరాడుతున్నామని మాయమాటలు చెబుతూ తమ స్వప్రయోజనాల కోసం ఆదీవాసిలపైనే దాడులు చేస్తున్న మావోయిస్టులను తమ గ్రామాల్లోకి రానివ్వకుండా బహిష్కరించాలని ఆదీవాసి ప్రజలకు ఈ సందర్బంగా ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *