*మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో
నేత కార్మికులకు,అవగాహన కార్యక్రమం*
సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):
సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలోనీ మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రభుత్వ సాధారణ వైద్యశాల ద్వారా ఈ రోజు ప్రగతి నగర్ లోని కార్మికులకు ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నం చందర్ కార్మికులకు కౌన్సిలింగ్ నిర్వహించినారు. ఈ సందర్భంగా పున్నంచందర్ మాటడుతూ మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దని అన్నారు. కార్మికులలో నిద్ర సమస్యలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. నిద్రలేమి వల్ల అనేక మానసిక సమస్యలు, శారీరక అనారోగ్యాలు వస్తాయని అన్నారు.జీవన శైలి వ్యాధులు బ్లడ్ ప్రెషర్, డయాబెటిస్, క్యాన్సర్స్ , ఆత్మహత్య ఆలోచనలు ఎక్కుగా ఉంటున్నాయని అన్నారు. ప్రతికూల ఆలోచనల్ని విడనాడి అనుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడం ద్వారా, చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా అనేక జీవన శైలి వ్యాధుల బారి నుండి బయట పడవచ్చని అన్నారు.కార్మికుల కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య వివాదాలు ఎక్కువగా ఉన్నాయని మైండ్ కేర్ సెంటర్ ద్వారా ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉండటం సహజమని తెలుపుతూ సమస్యపై కాకుండా వాటి పరిష్కారమార్గాల మీద దృష్టి నిలిపి ఓపికతో పరిష్కరించుకోవాలని అన్నారు.కార్మికుల్లో పొదుపు ప్రవృత్తి తక్కువగా ఉందని, తమ ఆదాయంలోంచి ఎంతో కొంత పొదుపు చేయడం అలవర్చుకోవాలని అన్నారు.సిరిసిల్ల ప్రభుత్వ వైద్యశాలలో శారీరక, మానసిక ఆరోగ్య వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎటువంటి మానసిక సమస్యలు ఎదురైనా వాయిదా వేయకుండా వెను వెంటనే పరిష్కరించుకోవాలని అన్నారు.
మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ పవర్ లూమ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందని, ఎటువంటి మానసిక సమస్య ఎదురైనా తమను సంప్రదించాలని కార్మికులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ సిబ్బంది కొండ ఉమ, రాపెల్లి లత, బూర శ్రీమతి, కార్మికులు పాల్గొన్నారు.