స్థానిక సంస్థల ఎన్నికలకు ఆశావహులు..

సర్పంచ్ పదవికి పోటాపోటీగా ఆశావహులు ప్రయత్నాలు.
ఎంత ఖర్చుయినా భరిస్తూ పోటీలో నిలిచి గెలుస్తామంటు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

గొల్లపల్లి నేటి ధాత్రి:
తెలంగాణ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరిగి గత కొన్ని నెలలు గడిచిపోయిన గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఎన్నికల వేడి తగ్గలేదు. కానీ జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండల వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం ఊపందుకున్నది. ఎక్కడికక్కడ స్థానిక సంస్థల ఎన్నికల రాజకీయ సందడి నెలకొన్నది. రేపోమాపో ఎన్నికలు జరుగబోతున్నాయా అనేలా పరిస్థితులు ప్రతిబింబిస్తున్నాయి. సాధారణంగా ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి పార్టీలకు మద్దతు లభిస్తుంటుంది. కానీ ఎన్నికల ప్రక్రియ తెరమీదకు రాకముందే మండల వ్యాప్తంగా గ్రామాల్లో బరిలో ఉండే వారి మద్దతు కొసం గ్రామంలో నాయకులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.ఆశావహులు విస్తృత సమావేశాలు జరుపుతున్నారు. మరికొన్ని గ్రామాల్లో నువ్వా.? నేనా.? అనే పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు సైతం ఈసారి కచ్చితంగా గెలిచేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రజలు సైతం సానుభూతి వ్యక్తం చేస్తూ గెలిపిస్తామంటూ హామీలు ఇస్తున్నారు. పార్టీల నాయకులు పోటాపోటీగా అగ్రనేతలను కలిసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. నాయకుల మద్దతు కోసం ఆశావహులు ఎవరికివారు ప్రయత్నాలు సాగిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీల గెలుపు కోసం విశేషంగా శ్రమించిన నాయకులు పోటీకి ఆసక్తి చూపుతున్నారు.గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికల కోసం తమకు అనుకూలంగా మద్దతుగా నిలిచే వారిని ఓ చోట చేర్చి సన్నహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశాభావులందరూ ఇప్పటి నుంచే ఓటర్లను దగ్గర చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నాయకులు ఓటర్ల మంచి చెడు తో పాటు శుభకార్యాలకు నగదు రూపంలో బహుమతులు అందించి దగ్గరగా చేసుకుంటున్నారు. ఎప్పుడు ఎన్నికలు నిర్వహించిన పోటీ చేసి గెలుపొందడమే లక్ష్యంగా ఓటర్లను మచ్చిక చేసుకుంటున్నారు.గ్రామ పెద్దలు, యువకులు, యువజన సంఘాల సభ్యుల మద్దతు కూడగడుతూ తమ వైపు తిప్పుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తూ సన్నాహక సమావేశాలతో మమేకమవుతున్నారు.గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీలో నిలిచేందుకు తహతహలాడుతున్న సర్పంచ్ అభ్యర్థులు గ్రామాల్లో మందు పార్టీలు ఏర్పాటు చేస్తున్నారు. యువకులు, యువజన, కుల సంఘాల సభ్యులను ప్రలోభ పరిచేందుకు మందు పార్టీలను ఎరవేస్తున్నారు. మద్యం ప్రియులు సైతం అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ నిత్యం ముక్క, సుక్కతో ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది.గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రాకన్నాముందే ఆశావహులు ఇప్పటినుంచే తామంటే తాము బరిలో నిలుస్తున్నామంటూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటాపోటీగా ఆశావహులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఎంత ఖర్చయినా భరిస్తూ పోటీలో నిలిచి గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్వల్ప మెజారిటీతో ఓడిన అభ్యర్థులు సైతం ఈసారి కచ్చితంగా గెలిచి తీరుతామని ప్రణాళికలను సైతం రూపొందించుకుంటున్నారు. అందులో భాగంగా గ్రామ ప్రజలను దగ్గరగా చేసుకునేందుకు మాటామంతీ కలుపుతున్నారు. ఈసారైనా గెలిపించాలంటూ వేడుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాలేదు. రిజర్వేషన్లు కూడా ఖరారు కాలేదు.బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు పర్యాయాలకు పది సంవత్సరాలు ఓకే రిజర్వేషన్ ఉండే విధంగా చట్ట సభల ద్వారా జీవో జారీ చేసింది. ఆ జీవో జారీ అయిన అనంతరం ఒక్కసారి మాత్రమే ఎన్నికలు జరిగాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ఓటమి పాలుకావడంతో అధికారం చేపట్టలేకపోయింది. దీంతో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం చేసిన జీవోను అనుసరించి గత రిజర్వేషన్ల ను కొనసాగిస్తుందా.? లేదా.? అనే అంశంపై గ్రామాల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల నాయకులతోపాటు, రిజర్వేషన్లు మారుతాయని ఆశతో ఇతర కేటగిరీలకు చెందిన నాయకులు కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయా.? జరిగితే అదే రిజర్వేషన్ కొనసాగుతుందా..? లేదా..? అనే విషయం మాత్రం ఎదురు చూడక తప్పదు.ఇప్పటి నుంచే గ్రామపంచాయతీ ఎన్నికల సందడి గ్రామాల్లో నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *