ఆదివాసి కుటుంబాలకు అండగా ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్..
*యువతకు వాలీబాల్ కిట్లు అందజేత *
నేటిధాత్రి చర్ల:
ఆదివాసి కుటుంబాలకు ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ అండగా నిలిచారు.భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు చర్ల పోలీసుల ఆధ్వర్యంలో చర్ల మండలం లోని చత్తీస్గడ్ రాష్ట్ర సరిహద్దు గ్రామమైన చెన్నాపురంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాంను నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పి విక్రాంత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు.మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఈ గ్రామంలో ప్రతి ఇంటిని పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.అనంతరం గ్రామస్తులందరితో సమావేశమై అక్కడ నివసించే మహిళలకు,చిన్న పిల్లలకు దుస్తులతో పాటు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అదేవిధంగా గ్రామంలోని యువతకు వాలీబాల్ కిట్లను కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసి ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సారధ్యంలో ఆదివాసీ ప్రజలకు విద్య వైద్యం రవాణా వంటి కనీస సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని అన్నారు. అదేవిధంగా నిషేధిత మావోయిస్టులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించవద్దని గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేశారు.ఈ కార్యక్రమంలో చర్ల పోలీస్ శాఖ ఉన్నతాధికారి సీఐ రాజువర్మ,ఎస్సై నర్సిరెడ్డి,ఎస్సై కేశవ్,సిఆర్పిఎఫ్ బలగాలు మరియు స్పెషల్ పార్టీ సిబ్బందితో పాటు చెన్నాపురం గ్రామంలోని 90 కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.