ఎన్నికల విధులు నిర్వహించు సిబ్బందికి నియామక ఉత్తర్వులు జారీ చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

శనివారం ఐడిఓసి కార్యాలయంలో గ్రామ పంచాయతి, మండల, జిల్లా ప్రజా పరిషత్తు ఎన్నికలు నిర్వహణకు సిబ్బంది నియామకం, శిక్షణా కార్యక్రమాలు నిర్వహణ తదితర అంశాలపై రెవెన్యూ, పంచాయతి రాజ్, మాస్టర్ ట్రైనర్లుతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా సాగేందుకు అవసరమైన సిబ్బంది నియామకం చేపట్టి, వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, సజావుగా నిర్వహించుటకు సిబ్బందికి శిక్షణ అత్యంత కీలకమని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రతి ఉద్యోగి తన బాధ్యతలను సమగ్రంగా అర్థం చేసుకుని, సక్రమంగా విధులు నిర్వహించడానికి శిక్షణ కార్యక్రమాలు అత్యంత ముఖ్యమని తెలిపారు. ఎన్నికల విధులకు అవసరమైన సిబ్బందిని సకాలంలో నియమించి, వారికి విధుల నిర్వహణ ప్రక్రియపై ఎన్నికల సంఘం మార్గదర్శకాలను వివరించాలని సూచించారు. శిక్షణ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు భూపాలపల్లి, కాటారం డివిజన్లు వారిగా షెడ్యూల్ తయారు చేయాలని పేర్కొన్నారు. ఎన్నికలు నిర్వహణపై సిబ్బంది సమగ్రమైన అవగహన కలిగి ఉండాలని, అపుడే ఎన్నికలను ఎలాంటి పొరపాటుకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించడానికి అవకాశం ఉంటుందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిపిఓ నారాయణరావు, భూపాలపల్లి ఆర్డీఓ రవి, అన్ని మండలాల ఎంపీడీఓలు, మాస్టర్ ట్రైనర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!