
ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు డిమాండ్.
ఈనెల 16న జరగనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలని స్కీం వర్కర్స్ కు పిలుపునిచ్చారు.
కారేపల్లి నేటి ధాత్రి
దేశంలో వివిధ కేంద్ర స్కీములలో పనిచేస్తున్న సుమారు కోటి మంది పనిచేస్తున్న స్కీము వర్కర్లను ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వం వెంటనే రెగ్యురేషన్ చేయాలని ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా అధ్యక్షులు గాదె లక్ష్మి నారాయణతో కలిసి కారేపల్లి మండల వ్యాప్తంగా వారు పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర స్కీం లకు కేంద్ర ప్రభుత్వం నిధుల్లో కోత పెట్టిందని,ఐఎస్ఓ తీర్మానం ప్రకారం వీరిని కార్మికులుగా గుర్తించడం, కనీస వేతనాలు చెల్లించడం, పిఎఫ్, ఈఎస్ఐలు అమలు చేయడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతేనన్నారు. వీటిని అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నదని ఆయన తెలియజేశారు. ప్రభుత్వరంగ సంస్థలు, సహజ వనరులను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల పరం చేస్తున్నదన్నారు. వ్యూహాత్మక అమ్మకాల పేరుతో ప్రభుత్వరంగ సంస్థల్లో 100 శాతం వాటాలు తెగనమ్ముతున్నదని,నేషనల్ మానిటైజేషన్ పైడ్లైన్ (ఎన్ఎంపి) పాలసీ ద్వారా మౌలిక వసతులను లీజు పేరుతో ప్రైవేటీకరిస్తున్నదన్నారు. ఉద్యోగుల కష్టార్జితమైన పిఎఫ్, పెన్షన్ నిధులను ప్రైవేట్ ఇన్ఫూరెన్స్, మ్యూచువల్ ఫండ్ సంస్థలకు కట్టబెడుతున్నదని, సింగరేణిలోని 4 బొగ్గు గనులను వేలం వేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నదన్నారు. కార్మికులు, మధ్యతరగతి ప్రజల్లో అత్యధికులు పాలసీదార్లుగా వున్న ఎలసి వాటాలను అమ్మేందుకు తెగబడిందఙ్, కార్పొరేట్లు ఎగ్గొట్టిన రుణాలతో ప్రభుత్వరంగ బ్యాంకులను నిర్వీర్యం చేస్తున్నదన్నారు. ఈ విధానాలు ఉద్యోగుల భద్రతతో పాటు దేశ ఆర్థిక స్వావలంబనకే ముప్పు తెస్తున్నాయన్నారు. అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4. లేబర్ కోడ్లను తెచ్చిందని,కనీస వేతనాలు నిర్ణయించే విధానానికి స్వస్తి వలికి, సమ్మె హక్కును కాలరాస్తున్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పిఎఫ్, ఇఎస్ఐ, వెల్ఫేర్ బోర్డులను నిర్వీర్యం చేస్తూ,తిరిగి 12 గంటల పని విధానం అమల్లోకి తేవడానికి, కాంట్రాక్టు లేబర్ విధానం అన్ని రంగాల్లో మరింత పెంచి శ్రమ దోపిడీకి గురి చేస్తున్నదన్నారు. కనీస వేతనం నెలకు రూ.26,000/-లు నిర్ణయించేందుకు బిజెపి ప్రభుత్వం అంగీకరించటం లేదని,కోట్లాది మంది కార్మికులకు వర్తించే ఇసిఎస్ పెన్షన్ నెలకు రూ.10,000/-లకు పెంపు, సిపిఎన్ను రద్దు చేసి, పాత పెన్షన్ (ఓపిఎస్)ను పునరుద్ధరణను వ్యతిరేకిస్తున్నదని ఆయన తెలిపారు. నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న ఆల్ క్యాడర్స్ తో పాటు రెండవ ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అంగనవాడి ఉద్యోగులకు 18 వేల కనీస వేతనాన్ని అమలు చేయాలని ఆయన ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నేషనల్ హెల్త్ మిషన్ కు తెలంగాణ రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసి ఉద్యోగుల సంక్షేమం కోసం ఉపయోగించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఉంగరాల సుధాకర్ ధనరాజ్,భాగం వెంకటేశ్వర్లు అంగనవాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ జిల్లా నాయకురాలు బేబీ, రజిత, మేరీ తదితరులు పాల్గొన్నారు.