మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అఖిలపక్షం బహిరంగ లేఖ…
నేటి ధాత్రి – గార్ల :-
ప్రజా సమస్యలపై తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సోమవారం మండల కేంద్రంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో బహిరంగ లేఖను విడుదల చేశారు.
2016లో ఇల్లందు, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల సాగు, త్రాగు నీటి అవసరాల కోసం శంకుస్థాపన చేసిన సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్,రోల్లపాడు ప్రాజెక్టును 2018లో సీతారామ ప్రాజెక్టును రీ ఇంజనీరింగ్, రిడిజైన్ చేపించి సీతారామ ప్రాజెక్టును సత్తుపల్లి, అశ్వరావుపేట, వైరా, ఖమ్మం, పాలేరు ప్రాంతాలకు అక్రమంగా దారి మల్లించడం జరిగింది.
ఏజెన్సీ గిరిజన ప్రాంతంగా ఉన్న మహబూబాబాద్, ఇల్లందు, డోర్నకల్ నియోజకవర్గాల ప్రాంతాలకు తీరని అన్యాయం చేశారు.
సీతారామ ప్రాజెక్ట్ రీ డిజైన్ లో అనేక అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి.
సీతారామ ప్రాజెక్ట్ దారి మళ్లింపు పై, ఆ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి అక్రమాలపై తగు విచారణ జరిపించి మొదటి డిపిఆర్ ప్రకారం సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ఇల్లందు మహబూబాబాద్ డోర్నకల్ నియోజకవర్గాల బీడు భూములకు సాగునీరు ఇక్కడి ప్రజలకు త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.
పాఖాలేరు అలిగేరు కలిసేచోట గార్ల మండలం, ముల్కనూరు గ్రామం వద్ద మున్నేరు ప్రాజెక్ట్ నిర్మాణం కోసం గత 50 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం ఎన్నికల వాగ్దానం గానే మిగిలిపోతుంది.
ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల గార్ల, బయ్యారం, కారేపల్లి, కామేపల్లి, ఖమ్మం రూరల్, డోర్నకల్, కురవి, మహబూబాబాద్, మరిపెడ తదితర మండలాలకు సాగు, త్రాగు నీరు అందించవచ్చు.
గత ప్రభుత్వాలు అనేకసార్లు సర్వేలు, జీవోలతో కాలం వెళ్ళదీశారు.
తెలంగాణ ఉద్యమంలో సైతం మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం అనేది ప్రధాన ఏజెండాగా ఉన్నది.
తెలంగాణ ఏర్పడి 11 ½ సంవత్సరాలు అయినప్పటికీ ఈ ప్రాజెక్టు నిర్మాణం మీద ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో మున్నేరు ప్రాజెక్టు నిర్మాణం కోసం 136 కోట్ల రూపాయల వ్యయంతో మున్నూరు ప్రాజెక్టుకు అనుమతులు ఇస్తూ 1076 జీవో విడుదల చేసినప్పటికీ ఆ తర్వాత కాలంలో ఆ జీవోను పట్టించుకున్న పాపానా పోలేదు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి తెలంగాణ ప్రభుత్వం సైతం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసింది.
ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమైన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన నిధులు మంజూరీ చేస్తూ, మున్నేరు ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేపట్టేలా తగు చర్యలు తీసుకోగలరని కోరారు.కాకతీయుల కాలం నాటి గార్ల పెద్ద చెరువు ఈ ప్రాంతంలో వ్యవసాయానికి ప్రాణాధారం లాంటిది.
గార్ల పెద్ద చెరువు శిఖం భూములను ఆక్రమించుకొని కొంతమంది వ్యక్తులు అక్రమంగా పట్టా పాస్ బుక్కులు పొందడం జరిగింది.
అట్టి శిఖం భూములలో బావులు తవ్వడం, పంటలు సాగు చేయడం వలన నీటి నిల్వ సామర్థ్యం తగ్గి సుమారు రెండువేల ఎకరాల వ్యవసాయ భూములకు సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఏర్పడింది.
దీనివల్ల రైతులు అప్పులు
తెచ్చి పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోతున్నారు.
అనేక సంవత్సరాలుగా వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ప్రజలు ఉద్యమాలు చేయడంతో చెరువు భూములను కొలతలు వేస్తూ వదిలేస్తున్నారు తప్ప, అక్రమ పట్టాలు తీసుకున్న వ్యక్తులపై చర్య తీసుకోవడం గానీ చెరువు శిఖం భూములకు రక్షణ వలయాలను ఏర్పాటు చేయడం గానీ చేయకుండా ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
గార్ల పెద్ద చెరువు భూములను పరిరక్షించే విధంగా నీటి నిల్వ సామర్థ్యం పెరిగే విధంగా తగిన చర్యలకు ఆదేశించగలరని కోరారు.
పాఖాలేటిపై హై లెవెల్ బ్రిడ్జి లేకపోవడం వల్ల రాంపురం మద్దివంచ గ్రామపంచాయతీలో ఉన్నటువంటి సుమారు 15 తండాల, గ్రామాల ప్రజలు గార్ల మండల కేంద్రానికి చేరుకోవడానికి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో పాఖాలేరు ఉదృతంగా ప్రవహిస్తున్న సమయంలో సుమారు నాలుగు నెలల పాటు రహదారి బంద్ అవుతుంది.
ఆ ప్రాంత ప్రజలు విద్య, వైద్యం ఇతర పనుల నిమిత్తం గార్ల మండల కేంద్రానికి రావడానికి బ్రిడ్జి సౌకర్యం లేదు.
అనేక మంది పాఖాలేరులో పడి కొట్టుకుపోయి చని పోయినారు.
పాఖాలేటిపై గార్ల రాంపురం హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం కోసం గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు, రాజకీయ పార్టీలు అనేక ఉద్యమాలను నిర్వహించాయి.
ఫలితంగా గత ప్రభుత్వం 15 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది.
అయినప్పటికీ బ్రిడ్జి నిర్మాణం కాలేదు.
ప్రస్తుత ప్రభుత్వం ఏడాదిన్నర కాలం గడుస్తున్నప్పటికీ బ్రిడ్జి నిర్మాణంపై ఒక అడుగు కూడా ముందుకు వయలేదు.
ఈ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేసి బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టి గార్ల రాంపురం మద్దివంచ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ ప్రజల రహదారి సౌకర్యాన్ని కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
మున్నేరు నీటిని సీతారామ ప్రాజెక్టు కాలువ ద్వారా పాలేరు తరలించేందుకు ప్రస్తుత ప్రభుత్వం 2025, మే 17 తారీఖున జీవో నెంబర్ 98 విడుదల చేస్తూ కాలువ నిర్మాణ పనులకు 162 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది.
దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం.
మున్నేరు నీటిని మున్నేరు పరివాహక ప్రాంత రైతులకు సాగు తాగునీరు ఇచ్చిన తర్వాతే మిగతా ప్రాంతాలకు తీసుకుపోవాలి తప్ప ఇక్కడ ప్రాంతాలను ఎండబెట్టి వేరొక ప్రాంతాలకు నీరు ఇవ్వడం దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మున్నేరు నీటిని పాలేరుకు తరలించే జీవో నెంబర్ 98 ను తక్షణమే రద్దు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతులు వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు విశ్వ జంపాల, సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కట్టెబోయిన శ్రీనివాస్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కందునూరి శ్రీనివాస్, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గుగులోత్ సక్రు, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు గంగావత్ లక్ష్మణ్ నాయక్, సిపిఐ మండల కార్యదర్శి జంపాల వెంకన్న, టీజేఎస్ రాష్ట్ర నాయకులు గిన్నారపు మురళి తారక రామారావు, బీఎస్పీ మండల అధ్యక్షులు బాదావత్ వెంకన్న, టిడిపి మండల కార్యదర్శి కత్తి సత్యం, బిజెపి మండల నాయకులు తోడేటి నాగరాజు, వివిధ పార్టీల నాయకులు పోతుల నరసింహారావు మొదలాకర్ శివాజీ, శంకర్, బాలాజీ, కేలోత్ బాల, గుండేటి వీరభద్రం, తెల్ల గర్ల నాగేశ్వరరావు, ప్రవీణ్,అశోక్ తదితరులు పాల్గొన్నారు.