*-PRGI కఠిన ఆదేశాలు – ఊహాజనిత వార్తలపై చర్యలు తప్పవు…*
నేటిధాత్రి : న్యూఢిల్లీ, జూన్ 28
* దేశవ్యాప్తంగా ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో RNI (రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్పేపర్స్ ఫర్ ఇండియా) నమోదు లేకుండా నడుస్తున్న పత్రికలపై కేంద్ర ప్రభుత్వం గట్టి వేటు వేయనుంది. ఆధారాలు లేని, ఊహాజనిత వార్తలు ప్రచురిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న పత్రికలపై చర్యలు తీసుకోవాలని ప్రెస్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (PRGI) రాష్ట్రాల సమాచార పౌర సంబంధాల శాఖలకు కఠిన ఆదేశాలు జారీ చేసింది.
* TEL నెంబర్ లేకుండా, నిర్ధారణలేని కథనాలు ప్రచురిస్తే చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని, ఇకపై RNI లేని పత్రికల వార్తలను అధికారికంగా పరిగణించకూడదని స్పష్టం చేశారు. ఎలాంటి పత్రిక భాషను ఉపయోగించాలో, ఎలా వ్యవహరించాలో స్పష్టమైన మార్గదర్శకాలను కూడా PRGI విడుదల చేసింది.
* ఈ చర్యల వెనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కృష్ణా జిల్లా సీనియర్ పాత్రికేయులు ఎస్. నరహరి నాగేశ్వర ప్రసాద్ చేసిన ఫిర్యాదు కీలకంగా మారింది. సోషల్ మీడియాలో అనధికారికంగా ప్రచారం అవుతున్న PDF పత్రికలు ఫేక్ న్యూస్కు కేంద్రబిందువుగా మారాయని ఆయన పేర్కొన్నారు.
* దీనిపై లోతుగా పరిశీలించిన PRGI, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లింది. త్వరలో జిల్లావారీగా పత్రికలపై సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని, జిల్లా పౌర సంబంధాల అధికారి (DPRO) లకు అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం.
* అక్రమంగా నడుస్తున్న పత్రికల జాబితాను సేకరించి రాష్ట్ర సమాచార శాఖకు అందించాలనే ఆదేశాలు జిల్లాల DPRO లకు త్వరలో చేరనున్నాయి. భావప్రకటన స్వేచ్ఛను కాపాడడంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది.