# మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ డిమాండ్
నర్సంపేట,నేటిధాత్రి :
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం ఆత్మనగర్, ఆత్మకూర్ గ్రామాలకు చెందిన గౌడ కులస్థులను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ మంగళవారం ఒక ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు. సుమారు 20 ఏళ్ల క్రితం గీత కార్మికులు తమ వృత్తి నిర్వహణ కోసం 22 ఎకరాల భూమిని కొనుగోలు చేయగా అట్టి భూమిని వారు పట్టా చేసుకకోవడం జరిగిందన్నారు.ప్రస్తుతం భూమి రేటు పెరగడంతో వీడీసీ సభ్యులు కబ్జా చేయాలనే ఉద్దేశ్యంతో గౌడ కులస్థులను గ్రామ బహిష్కరణ చేశారని పేర్కొన్నారు.గ్రామంలో గీత కార్మికుల వద్ద కల్లు తాగొద్దని, కిరాణా దుకాణంలో సరుకులు ఇవ్వొద్దని, శుభ కార్యాలకు పిలువొద్దని, బీడీ కార్మికులకు ఆకు వేయొద్దని గ్రామ అభివృద్ది కమిటీ తీర్మానం చేశారని ఆరోపించారు. ఎవరైనా ఉల్లంగిస్తే 50 వేల జరిమానా విధిస్తామని కట్టుబాటు విధించారని పేర్కొన్నారు.ఇప్పటికైనా గౌడ కులస్థులను గ్రామ బహిష్కరణ చేసిన వీడీసీ సభ్యులపై కేసులు నమోదు చేసి, చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని రమేష్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.