
District Collector Rahul Sharma
ఆజంనగర్ గ్రామంలో ఆకస్మికంగా పర్యటించిన జిల్లా కలెక్టర్
భూపాలపల్లి నేటిధాత్రి
విద్యార్థులకు హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.
గురువారం భూపాలపల్లి మండలంలోని ఆజంనగర్ గ్రామంలో ఆకస్మికంగా పర్యటించారు.
ఈసందర్భంగా గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.
ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ ఆసుపత్రికి వచ్చే రోజుల సంఖ్యతో పాటు, ఆసుపత్రి పరిసరాలు, ల్యాబ్, ఫార్మసీలను పరిశీలించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే సమావేశం నిర్వహించి ఏఎన్ఎంలు ,ఆశా వర్కర్లతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ఆస్పత్రి లో సరిపడా మందులు నిల్వ ఉంచుకోవాలని సూచించారు. వైద్య సిబ్బంది సక్రమంగా విధులకు హాజరు కావాలని, సమయ పాలన పాటించాలని సూచించారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి ప్రాణాంతకమైన వ్యాధులపై అప్రమత్తంగా ఉంటూ వైద్య సేవలు అందించాలని తెలిపారు. జ్వరం ప్రబలిన ప్రాంతాలల్లో వైద్య క్యాంపు లు నిర్వహిస్తూ వ్యాధుల ను అరికట్టాలని తెలిపారు. ప్రబలిన వ్యాధులపై అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు.
ముఖ్యంగా వివిధ గ్రామాలలోని పాఠశాలలు, గురుకుల పాఠశాలలో విద్యార్థులను పరీక్షించి ప్రతి విద్యార్థి ఆధార్ కార్డు నెంబర్ ఆధారంగా విద్యార్థి యొక్క హెల్త్ ప్రొఫైల్ ను తయారు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
అనంతరం జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నత పాఠశాలను పరిశీలించి పాఠశాల ఆవరణ మొత్తం పరిశీలించారు. పాఠశాలలో బోధనా విధానాన్ని, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్ పాఠశాల ఆవరణలోనే అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడి కేంద్రానికి విద్యుత్ సదుపాయం లేదని వారు తెలుపగా వెంటనే జిల్లా విద్యుత్ శాఖ అధికారి కి ఫోన్ చేసి అంగన్వాడి కేంద్రానికి విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అనంతరం నిర్మాణంలో ఉన్న గాజుల స్వాతికి చెందిన ఇందిరమ్మ ఇల్లు ను పరిశీలించి త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుకను అందించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, డా. ప్రమోద్ కుమార్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎం.పి.ఓ నాగరాజు
ప్రధానోపాధ్యాయులు మంజుల, రాజు,
పంచాయతీ సెక్రెటరీ శశిధర్ తదితరులు పాల్గొన్నారు.