* సర్వే ప్రకారమే పట్టాలి ఇవ్వండి సారూ….!
నారాయణపురం గ్రామ రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని రైతుల ఆద్వర్యంలో తహశీల్దారు కార్యాలయం ఎదుట వంటావార్పు…
ఎంజాయ్ మెంట్ సర్వే ప్రకారం పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని రైతుల డిమాండ్..
తహసిల్దార్ జి.వివేక్ కి వినతి పత్రం అందజేత.
కేసముద్రం/ నేటి ధాత్రి
మా భూములకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వండి సారు అంటూ కేసముద్రం మండలంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట నారాయణ పురం గ్రామ రైతులకు పట్టాలు ఇవ్వాలని రైతుల ఆద్వర్యంలో తహశీల్దారు కార్యాలయం ఎదుట వంటావార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ ధరావత్ రవి నాయక్ మాట్లాడుతూ తాము గత 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 1827 ఎకరాల భూములను 2017లో గత ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా అటవీ భూములుగా పేర్కొంటూ పట్టాలు రద్దు చేసిందని 1959 సంవత్సరంలోని 2384 జీవో నెంబర్ ప్రకారం నారాయణపురం గ్రామంలోని భూములను 2021 ,ఫిబ్రవరిలో రెవెన్యూ పట్టా భూములుగా తేల్చింది.
గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో జూన్ 2021 లో ఎంజాయ్మెంట్ సర్వే చేసి 1827 ఎకరాల్లో 1633 ఎకరాలు సాగుభూమిగా తెల్చి ఇందులో 633 ఎకరాలకు పట్టాలు ఇచ్చిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జీవో 94 జారీ చేసి రైతు పేరు తండ్రి పేరు అనే చోట వస్తున్న అడవి అనే పదం తొలగించారని కానీ గ్రామంలో ఎంజాయ్మెంట్ సర్వే నిర్వహించి ఆరు నెలలు గడుస్తున్న అధికారులు కాలయాపన చేస్తూ పాస్ పుస్తకాల జారీ విషయాన్ని పట్టించుకోవడం లేదన్నారు. తహసిల్దార్ కార్యాలయంలో ఉన్న పెండింగ్ దరఖాస్తులను తక్షణమే పరిశీలించి మా గ్రామ భూ సమస్యను పరిష్కరించాలన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వీడి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చేలా కృషి చేయాలని తహసిల్దార్
జి. వివేక్ కుమార్ కి వినతి పత్రం అందజేసి తక్షణమే మా గ్రామ సమస్యను పరిష్కరించాలని కోరారు. లేనిచో రైతులందరం తహసిల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. నూతన భూభారతి చట్టంలో తమ భూముల సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని..దేశానికి అన్నం పెట్టే రైతన్న అనాధగా మారే పరిస్థితి ఎదుర్కొంటుందని మా గ్రామ రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు లేక దాదాపు 700 మంది రైతులకు పంట రుణాలు రుణమాఫీ రైతు భరోసా రైతు భీమా ఇతర ప్రభుత్వం పథకాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సుంకి రెడ్డి వెంకట్ రెడ్డి, మిరియాల యాకుబ్ రెడ్డి, కొయ్యగూరి రాంరెడ్డి ,జాటోత్ వెంకన్న, బానోత్ భాష గుగులోత్ లక్ పతి, బానోత్ శంకర్ , ధరంసోత్ శ్రీను , దారావత్ వీరన్న, ధరావత్ మాతృ, జాటోత్ రమేష్, గుగులోత్ శంకర్,ఇస్లావత్ సురేష్, గుగులోతు వెంకన్న, ధారావత్ బీమా, ధారావత్ దేవా ,ధారావత్ రమేష్, జాటోత్ సరిత, బానోతు రంగమ్మ, బానోత్ కమల, ధరావత్ కాంసల్య, ధరావత్ కమలమ్మ రైతులు తదితరులు పాల్గొన్నారు.