ఒకే వేదికపై రెండు వేల ఐదు వందల మంది శ్రీనివాసుల కలయిక
సేవే లక్ష్యం-ధర్మ పరిరక్షణే ధ్యేయం: శ్రీనివాసుల సేవా సమితి ఫౌండర్ వూట్కూరి శ్రీనివాస్ రెడ్డి
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్ శివారులోని ఒక ఫంక్షన్ హాల్ వేదికగా ఆదివారం తెలంగాణ శ్రీనివాసుల సమ్మేళనం ద్వితీయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈసమ్మేళనంలో జగిత్యాల వాసి శ్రీనివాసుడి వేషధారణ సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని తలపించింది. అయోధ్య రాముడి పాదుకలను శ్రీనివాసుల దర్శనార్థం వేదికపై ఉంచి, కొండగట్టు గిరి ప్రదక్షిణ నిర్వాహకులు, చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారి సురేశ్ ఆత్మారాం మహారాజ్, తాటిచర్ల హరికిషన్ శర్మలు శ్రీనివాస్ పేరు గొప్పతనాన్ని వివరించారు. కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీతో పాటు దేశవిదేశాల్లో ఉంటున్న రెండు వేల ఐదు వందల మంది శ్రీనివాస్ పేరు గల వ్యక్తులు ఒకే వేదికపై కలుసుకున్నారు. ఈసందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సహాయార్థం తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం రెండు వందల యాభై మంది శ్రీనివాసులు రక్తదానం చేశారు. శ్రీనివాస్ పేరుగల రెండు వేల ఐదు వందల మంది ఒకే వేదికగా కలవడం అరుదైనదిగా గుర్తించిన వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ తెలంగాణ డైరెక్టర్ మడుపు రాంప్రకాశ్ తమ రికార్డ్స్ లో చోటు కల్పించి
శ్రీనివాసుల సేవా సమితి ఫౌండర్ వూట్కూరి శ్రీనివాస్ రెడ్డికి అవార్డును అందజేశారు. ఈసందర్భంగా సేవా సమితి ఫౌండర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సామాజిక సేవే లక్ష్యంగా, ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్తామని, శ్రీనివాస్ అనే పేరున్న వారంతా ఒక సమూహంగా ఏర్పడాలనే లక్ష్యంతో శ్రీనివాసుల సేవాసమితి ఏర్పడిందని, నలబై ఆరు వాట్సాప్ గ్రూపులతో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇరవై ఆరు వేల మంది సభ్యులు వాట్సాప్ గ్రూపుల్లో చేరారని, టీఎస్ఎస్ఎస్ పేరుతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, శ్రీనివాస్ పేరు ఉన్నవారు పేదరికంలో ఉన్నా, అనారోగ్యంతో బాధపడుతున్నా చేయూత అందిస్తున్నామని,రోజు వారి కూలీ నుండి మొదలుకొని ఏరంగంలో ఉన్న వారినైనా, చిన్న పెద్ద అనే తారతమ్యాలు లేకుండా శ్రీనివాస్ పేరు ఉన్న వారందరనీ టీఎస్ఎస్ఎస్ లో చేర్చించేందుకు కృషి చేస్తున్నామన్నారు.
