
Woman Shocks Over Human Nail in Chicken Roll in NY
అమెరికా రెస్టారెంట్లో మహిళకు షాక్.. చికెన్ రోల్ రుచిలో తేడా.. లోపలేముందో చూస్తే..
రెండేళ్ల క్రితం ఓ రెస్టారెంట్లో తిన్న చికెన్ రోల్లో మనిషి వేలు రావడంతో షాక్ తిన్న ఓ కస్టమర్ తాజాగా సదరు రెస్టారెంట్పై కేసు వేశారు. అమెరికాలో ఈ ఘటన వెలుగు చూసింది.
ఇంటర్నెట్ డెస్క్: రెండేళ్ల క్రితం ఎదురైన షాకింగ్ అనుభవాన్ని ఎంతకీ మర్చిపోలేకపోతున్న ఓ అమెరికా మహిళ స్థానిక రెస్టారెంట్పై కేసు వేసింది. భారీ మొత్తాన్ని పరిహారంగా కోరింది. న్యూయార్క్లో ఈ ఘటన వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే,
2023లో బాధితురాలు అస్టోరియాలోని ఓ రెస్టారెంట్కు వెళ్లి చికెన్ రోల్ ఆర్డరిచ్చింది. ఆ తరువాత చికెన్ రోల్ను తినడం ప్రారంభించగానే రుచిలో తేడా అనిపించింది. ఈ క్రమంలో రోల్ను పరిశీలించగా అందులో మనిషి వేలు కనిపించడంతో బాధితురాలు షాకైపోయింది. ఆ తరువాత వేలిని ల్యాబ్కు పంపించి పరీక్షించగా అది మనిషిదేనని తేలింది.
దీంతో, కంగారు పడిపోయిన బాధితురాలు వైద్యులను సంప్రదించగా వారు యాంటీరెట్రోవైరల్ మందులు ఇచ్చారు. ప్రమాదకరమైన వైరల్ వ్యాధుల బారిన పడకుండా ఈ ట్రీట్మెంట్ ఇచ్చారు. అయితే, రెస్టారెంట్లో ఎదురైన అనుభవం తరువాత తన తీరు మొత్తం మారిపోయిందని మహిళ చెప్పుకొచ్చింది. బయట ఏది తినాలన్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేసింది. మనిషి మాంసం రుచి చూశానన్న భావనతో తనలో తెలీని అసహ్యం పెరిగిపోయిందని చెప్పింది. చివరకు రెస్టారెంట్పై తాజాగా కేసు వేసింది.
మహిళ ఆరోపణలను సదరు రెస్టారెంట్ వారు కొట్టిపారేశారు. అసలు ఆ రోజు తమ రెస్టారెంట్ మహిళా సిబ్బంది ఎవరూ ఆహారం విషయాల్లో జోక్యం చేసుకోలేదని అన్నారు. ఆమె చికెన్ రోల్లోని వేలికి డీఎన్ఏ టెస్టింగ్కు ఆమె ఎందుకు అంగీకరించట్లేదని ప్రశ్నించారు. ఆమె ఆరోపణలన్నీ నిరాధారంగా హాస్యాస్పదంగా ఉన్నాయని మండిపడ్డారు. తప్పుడు ఆరోపణలు చేసిందుకు మహిళపై కేసు వేస్తామని కూడా తేల్చి చెప్పారు.