
వయోవృద్ధులకు మెరుగైన వైద్యసేవలందించాలి:-
వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి నిర్మలా గీతాంబ :-
వరంగల్/హన్మకొండ, నేటిధాత్రి :-
తెలంగాణా లోనే రెండవ అతిపెద్ద ప్రభుత్వ వైద్యశాలయైన మహాత్మాగాంధీ స్మారక వైద్యశాలతో పాటు అన్నీ ప్రభుత్వ వైద్యశాలలలో వయోవృద్ధులకు మెరుగైన వైద్యసేవలందించాలని శ్రీమతి నిర్మలా గీతాంబ అన్నారు. శనివారం రోజున మహాత్మాగాంధీ స్మారక వైద్యశాలలో ‘సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్’ హనుమకొండ వారి అధ్వర్యంలో వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం-2007 పై ఏర్పాటుచేసిన శిక్షణ సదస్సులో వారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వయోవృద్ధులకు ప్రత్యేక వార్డులను ఇతర సౌకర్యాలను ఏర్పాటుచేసి వారికి మర్యాదపూర్వకమైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ప్రతి కుటుంబంలో కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు.. ఇంటిలోని పెద్దవారిపట్ల ప్రేమ గౌరవ మర్యాదలతో మెలగాలని, వీరిని చూసి ఇంట్లోని పిల్లలుకూడా పెద్దవారితో సన్నిహితంగా ప్రేమగా మెలుగుతారని, అప్పుడు కుటుంబంలో చక్కని వాతావరణం నెలకొంటుందని అన్నారు. వారు ఇచ్చిన ఆస్తులను అనుభవిస్తూ వారిని వృద్ధాశ్రమాలలో వేయడం తగదని అన్నారు. ప్రజలకు వైద్యశాలలపై విశ్వాసం పెరిగేవిధంగా వైద్యులు, ఇతర సిబ్బంది సేవలందించాలని అన్నారు.
ఈ సందర్భంగా వారు తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఎం.జి.ఎం. సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ కుమార్ గారు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ మాట్లాడుతూ ఎం.జి.ఎం. లో సీనియర్ సిటిజన్స్ కి మంచి వైద్య సేవలు అందిస్తున్నామని, వారికి ప్రత్యేక ఓ.పి. విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని త్వరలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేస్తామనీ అన్నారు. కార్యక్రమంలో ‘హెల్పేజ్ ఇండియా’ సంస్థ రాష్ట్ర కో ఆర్డినేటర్ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ.. సీనియర్ సిటిజన్స్ సమస్యలపై హెల్పేజ్ ఇండియా సర్వే లోని ప్రధానాంశాలను తెలుపుతూ ‘2007 తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం’ సీనియర్ సిటిజన్స్ కోసం చేసిన ముఖ్యమైన చట్టాలను, మరియు వైద్య సేవలకు సంబంధించిన చట్టాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు..
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కార్యదర్శి-సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీ ఎం. సాయికుమార్, సమన్వయకర్త డా. మమత, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి తేరాల యుగంధర్, సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు, రిటైర్డ్ డి.ఎస్.పి దామెర నర్సయ్యగారు, ఓరుగల్లు వినియోగదారుల రక్షణ సమితి అధ్యక్షులు, హనుమకొండ సి.డభ్ల్యు.సి సభ్యులు కజాంపురం దామోదర్, కార్యవర్గ సభ్యులు నాగులగాం నర్సయ్య, మార్క రవీందర్ గౌడ్, సత్యనారాయణ, గంటి సాంబయ్య, గంగారపు యాదగిరి, వైద్య సిబ్బంది, నర్సులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.