ప్రచారం శూన్యం.. పదవుల ఆరాటం ఘనం.

`కాంగ్రెస్‌ నాయకుల తీరు పార్టీకి ఇబ్బందికరం.

`పథకాల ప్రచారంలో వెనుక..వివాదాలలో ముందంజ.

`కాంగ్రెస్‌ నాయకుల తీరుపై కార్తకర్తల ఆవేదన.
……………………

`పార్టీ పరంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డే మాట్లాడాలి.

`ప్రభుత్వ పథకాలపై సిఎం. రేవంత్‌ రెడ్డే వివరించాలి.

`ప్రతిపక్షాలను సిఎం రేవంత్‌ మాత్రమే ఎదుర్కోవాలి.
…………………………

`మంత్రి పొంగులేటి లాగా మిగతా మంత్రులు మాట్లాడలేరా.

`ప్రతిపక్షాల మీద మంత్రి పొంగులేటి విరుచుకపడే విధానం కనిపించడం లేదా.

`మంత్రి పొంగులేటి లాగా ప్రభుత్వ పథకాలు ప్రచారం చేయరా.
……………….

`ఇతర మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు బాధ్యత లేదా!

`ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్షాలకు మంత్రులు సమాధానం చెప్పరా!

`ప్రతిపక్షాల నోరు మూయించే ధైర్యం మీకు లేదా!

`ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పోకుండా చూసుకోరా?

`ప్రభుత్వానికి రక్షణగా ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేయలేరా!
……………………..

`ఓ నలుగురు మంత్రులు తప్ప ఎవ్వరూ మాట్లాడరు.

`ప్రభుత్వ పథకాలు ప్రచారం చేయరు.

`మిగతా మంత్రులు ఎక్కడా నోరుమెదపరు.

`ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో అర్థం కాదు.

`సిఎం రేవంత్‌ రెడ్డి ఎన్ని సార్లు హెచ్చరించినా మారరు.
……………..

ఉచిత బస్సు గురించి ఎమ్మెల్యేల ప్రచారమేది.
……………..
`దేశమంతా మూడు నెలలు దొడ్డు బియ్యం పంపిణీ చేస్తున్నారు

`ఒక్క తెలంగాణలోనే పేదలకు సన్న బియ్యం అందిస్తున్నారు.

`ఇది ప్రభుత్వం క్రెడిట్‌ కాదా..గొప్ప కార్యక్రమం అనుకోవడం లేదా!

`ఇంత గొప్ప కార్యక్రమం ప్రచారం చేయడానికి ఎవరూ ముందుకు రారు.
…………………
`ఏక కాలంలో రైతు రుణమాఫీ చేసిన సంగతి నాయకులు చెప్పలేరా!

`పదేళ్లుగా ఇవ్వని ఇండ్లు, ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇస్తున్నా చెప్పుకోరా!

`రైతు భరోసాపై సంబరాలు గొప్పగా చేయరా!
…………………

`పనికి రాని పత్రికలకు కోట్ల రూపాయల ప్రకటనలు ఇస్తున్నారు.

`ప్రభుత్వ పథకాలపై ఏ ఒక్క పత్రికైనా, వార్తలు రాస్తున్నాయా? విశ్లేషణలు చేస్తున్నాయా?

`ప్రభుత్వానికి పత్రికలు అండగా నిలుస్తున్నాయా!

`సోషల్‌ మీడియా లో ప్రభుత్వంపై జరుగుతున్న విష ప్రచారం కనిపించడం లేదా!

`ప్రభుత్వాన్ని డ్యేమేజ్‌ చేస్తున్న వార్తలు కనిపించడం లేదు.
…………………………..
`రేషన్‌ కార్డులిచ్చినా ఒక్కరైనా స్పందించరా?

`పదవులపై వున్న మక్కువ నాయకులకు ప్రచారంలో ఎందుకు లేదు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
ప్రచారం శూన్యం. పదవుల కోసం మాత్రం ఆరాటం. కాంగ్రెస్‌ పార్టీ నాయకుల తీరు అభ్యంతరకం. ఒక రకంగా చెప్పాలంటే పార్టీకి ఇబ్బందికరం. పధకాల ప్రచారంలో మాత్రంవెనుక వుంటున్నారు. వివాదాలలో మాత్రం ముందుంటున్నారు. దాంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. ఏది మాట్లాడాల్సి వచ్చినా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రమే మాట్లాడాల్సి వస్తోంది. ప్రతిపక్షాలను ఎదుర్కొవాలన్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే నోరు తెరవాల్సి వస్తుంది. ఆది నుంచి పార్టీ నాయకులది ఇదే తీరు. ప్రభుత్వ పధకాలు వివరించాలన్నా సిఎం. రేవంత్‌రెడ్డే. పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్న సిఎం. రేవంత్‌రెడ్డే. మరి మంత్రులు ఏం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు. ప్రతిపక్షాలను ఏ రకంగా ఎదుర్కొవాలన్నా ఒక్క ముఖ్యమంత్రి మాత్రమే ఎదుర్కొవాలా? ప్రతిపక్షాలకు దీటైన సమాదానం ఒక్క సిఎం. రేవంత్‌రెడ్డి మాత్రమే ఇవ్వాలా? మంత్రులకు భాద్యత లేదా? సమయం లేదా? ఎమ్మెల్యేలకు ప్రభుత్వ పథకాల మీద అవగాహన లేదా? మాకెందుకు ఆ తలకాయ నొప్పి అనుకుంటున్నారా? మంత్రుల్లో ఒక్క పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాత్రమే ఆది నుంచి దూకుడుగా వుంటున్నారు. సిఎం. రేవంత్‌ రెడ్డి తర్వాత ప్రతి విషయంలోనూ ఆయన స్పందిస్తున్నారు. ప్రభుత్వ పథకాలను విసృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. భవిష్యత్తుపై ఆశాజనకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజల్లో నమ్మకం కల్గిస్తున్నారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అంశాన్ని ఆయన సృషిస్తూ పార్టీకి అండగా నిలుస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడినట్లు ఇతర మంత్రులు నిత్యం కొంత సమయం కేటాయించుకోలేరా? అవకాశం వచ్చినప్పుడైనా ప్రబుత్వ పనితీరును గొప్పగాచెప్పుకోలేరా? ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై ఇతర మంత్రులు నోరు విప్పరా? ప్రతిపక్షాలు, ముఖ్యంగా బిఆర్‌ఎస్‌ను పొంగులేటి చీల్చి చెండాడినట్లు ఇతర మంత్రులకు ధైర్యం చాలడం లేదా? మంత్రి పదవుల్లో వున్నప్పటికీ ఎందుకు మౌనంగావుంటున్నారు. రాజ్యాంగ పరంగా రాష్ట్రంలో అంతకన్నా పెద్ద పదవి వుంటుందా? క్యాబినేట్‌ అంటేనే సమిష్టి బాధ్యత. ఆ విషయాన్ని మంత్రులు మర్చిపోతున్నారా? అంతా సిఎం చూసుకుంటారు లే..అనుకుంటున్నారా? చీటికి మాటికి ప్రతిపక్షాలు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తుంటే మంత్రుఉల, ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించడం లేదు. ప్రతిపక్షాల నోరు మూయించే ధైర్యం మంత్రులకు లేకపోతోందా? ప్రతిపక్షాలను ఎదుర్కొలేకపోతే పార్టీలో తప్పుడు సంకేతాలు వెళ్లవా? ప్రజలు ప్రతిపక్షాల అసత్యాలను నిజమని నమ్మరా? నిజం చెప్పాలంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాదిన్న కాలంలో ఎక్కడా పెద్దగా ప్రజా ఉద్యమం జరగలేదు. ప్రజల్లో నుంచి వ్యతిరేకత రాలేదు. నిరసనలు ఎక్కడా జనం చేపట్టలేదు. ఆఖరుకు రైతులు కూడా ఏనాడు రోడ్డెక్కలేదు. అంటే ప్రభుత్వ పనితీరు మీద రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా సంతృప్తిగా వున్నట్లే లెక్క. ఈ మాత్రం కూడా మంత్రులకు, ఎమ్మెల్యేలకు అవగాహన లేకుండాపోయిందా? ఈ ఏడాదిన్న కాలంలో ఏనాడైన రైతులు కరంటు లేదని రోడ్డెక్కారా? కనీసం మాకు కరంటు సరిపోవడం లేదని చెప్పడం విన్నారా? ఇండ్లకు కూడా కరంటు కోతలు విన్నామా? ఈ సారి వేసవిలో గత పదేళ్లకన్నా ఎక్కువ విద్యుత్‌ వినియోగం జరిగింది. అయినా కరంటు కోతలు చూశామా? పత్రికల్లో వార్తలు చదివామా? లేదు. రైతులు తమకు విత్తనాలు అందలేదని ధర్నాచేశారా? ఎరువుల చాలడం లేదని నాయకులను ఘెరావ్‌ చేశారా? ఆఖరకు పండిన పంటలను గిట్టుబాటు ధర రాలేదన్నారా? వడ్లు కొనుగోలు చేయడం లేదన్నమాట విన్నామా? పైగా వడ్లకు బోసన్‌ కూడా ఇస్తున్నారు. దానిని కూడా ప్రజలకు వివరించడంలో ఎందుకు విఫలమౌతున్నారు. ఎందుకు చొరవ తీసుకోలేకపోతున్నారు. ప్రభుత్వానికి రక్షణగా, పార్టీకి అండగా ప్రతిపక్షాల నోరు మూయించలేరా? ఓ నలుగురు మంత్రులు తప్ప మరెవరికీ సమయం చాలడం లేదు. మాటలు రావడం లేదు. అంతో ఇంతో మాట్లాడితే సిఎం. తర్వాత పొంగులేటి ఎక్కవగా స్పందిస్తుంటారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మంత్రి కొండా సురేఖలు స్పందించినంతగానైనా ఇతర మంత్రులు నోరు మెదపలేరా? ఈ మధ్య మంత్రి సీతక్క కూడా ఎక్కడా పెద్దగా బిఆర్‌ఎస్‌ మీద విరుచుకుపడుతున్నట్లు లేదు. ఎందుకు సైలెంట్‌గా వుంటున్నారు. అసలే వర్షాకాలం వచ్చింది. వైరల్‌ ఫీవర్లు వస్తున్నాయి. వాటిపై కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే మాట్లాడాలా? వైద్యారోగ్య శాఖ మంత్రి రివ్యూ మీటింగ్‌ కూడా పెట్టడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ప్రతిపక్షాల మీద ఆయన స్పందించినట్లు ఒక్క వార్తకూడా వస్తున్న దాఖలాలు లేవు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లండి. ప్రజల మధ్యలో వుండండి. ప్రజలకు అందుబాటులో వుండంది. వారి సమస్యలు తీర్చండి. అంటూ ఎన్ని సార్లు సిఎం. రేవంత్‌రెడ్డి చెబుతున్నా పట్టించుకోవడంలేదు. వినిపించుకోవడంలేదు. తెలంగానలోఉచిత బస్సు వల్ల ఎంతోమంది లబ్ధి చేకూరుతోంది. గతంలో కేసిఆర్‌ పదేళ్ల కాలంలో మూడు సార్లు బస్సు చార్జీలు విపరీతంగా పెంచారు. కొత్తగా బస్సు డిపోలు నిర్మాణం చేసింది లేదు. కొత్త బస్సులు కొన్నది లేదు. పైగా ఆర్టీసి ఆస్ధులు , భూములు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలుఎదుర్కొన్నారు. ఆర్టీసి బస్సులను ప్రజలకు దూరం చేశారు. కాని ప్రజా ప్రభుత్వం ఆర్టీసిని ప్రజలకు మరింత చేరువ చేసింది.ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. అయిన చార్జీలు పెంచలేదు. వేలాది కొత్త బస్సులు కొనుగోలు చేశారు. ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఇంత గొప్ప విషయాన్ని ప్రచారం చేసుకోవడానికి కాంగ్రెస్‌ నాయకులకు ఎందుకు నోరురావడం లేదు. దేశమంతటా మూడు నెలల పాటు ఉచిత రేషన్‌లో భాగంగా దొడ్డు బియ్యం సరఫరాచేస్తున్నారు. కాని ఒక్క తెలంగాణలో మాత్రమే ప్రజలకు మూడు నెలలకు అవసరమైన సన్న బియ్యం అందజేస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోఅమలు కాని ఇంతటి గొప్ప కార్యక్రమం కాంగ్రెస్‌ నాయకులకు కనిపించడం లేదా? సన్నబియ్యం పథకం ప్రారంభించినప్పుడు కొంత హడావుడి ఒకటిరెండు రోజులు చేశారు. తర్వాత మర్చిపోయారు. ఇప్పుడు మూడు నెలల సన్నబియ్యం ఇస్తున్నా ఎక్కడా కాంగ్రెస్‌ నాయకులు కనిపించడం లేదు. మంత్రుల కూడా ఆ పంపిణీలో పాలు పంచుకోవడం లేదు. గతంలో సామాన్యులు సన్న బియ్యం కొనుగోలు చేసుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకునేవారు. కాని ఇప్పుడు ఉచితంగా మూడు నెలల బియ్యం తీసుకుపోతున్న సంతోషంలోవున్నారు. సంబరపడుతున్నారు. అయినా కాంగ్రెస్‌ నాయకులు చూడరు. ఇదేనా పార్టీమీద నాయకులకు వున్న మమకారం. పదువుల మీదవున్న శ్రద్ద ప్రభుత్వకార్యక్రమాలు ప్రచారంచేయడంలో లేదు. ఇక ప్రభుత్వం నుంచి పత్రికలకు కోట్లాది రూపాయల ప్రకటనలు జారీ చేస్తున్నారు. కాని ఆ పత్రికలు ఎక్కడైనా ప్రభుత్వ పధకాల వార్తలు రాస్తున్నాయా? ప్రభుత్వ పధకాల గొప్పదనం గూర్తి వ్యాసాలు రాస్తున్నాయా? విశ్లేషనలు చేస్తున్నాయా? ఏ పత్రిక ప్రభుత్వానికి అనుకూలంగా వుందో..ఏపత్రిక లేదో కూడా చూసుకునే తీరిక ఓపిక కాంగ్రెస్‌ నాయకులకు లేకుండాపోయంది. ప్రభుత్వానికి, పార్టీకి అండగా నిలుస్తున్న పత్రికలను గుర్తించడం లేదు. ఆ పత్రికలకు ప్రోత్సహం లేదు. కాని ప్రజల్లో కనిపించని పత్రికలకు మాత్రం కోట్లు గుమ్మరిస్తున్నారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియా కూడా అలాగే తగలబడిరది. ప్రతిపక్షాన్ని ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నమే చేయడం లేదు. ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు డ్యామేజ్‌ చేసే వార్తలు రాస్తున్న పత్రికలను కాంగ్రెస్‌ పార్టీ నెత్తిన పెట్టుకుంటోంది. సోషల్‌ మీడియాలో ప్రభుత్వంపై జరుగుతున్న అసత్య విష ప్రచారాలను కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా కూడా తిప్పి కొట్టడంలేదు. గత బిఆర్‌ఎస్‌ పాపాలను ఎండగట్టడంలేదు. కనీసం ప్రభుత్వ పథకాలను కూడా కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా ప్రచారం చేయడంలేదు. పదవులపై వున్న మక్కువ కాంగ్రెస్‌లో మెజార్టీ నాయకులకు ప్రభుత్వ పథకాల ప్రచారంలో లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!