ఓటీటీలో మాధవన్ మూవీ ఎప్పటి నుండంటే…
వైవిధ్యమైన పాత్రలు చేస్తూ నటుడిగా గుర్తింపు తెచ్చకున్న మాధవన్ చాలా కాలం తర్వాత మరోసారి రొమాంటిక్ మూవీ చేస్తున్నాడు.
ఫాతిమా సనా షేక్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ప్రముఖ నటుడు మాధవన్ (Madhava) కు గతంలో రొమాంటిక్ హీరో ఇమేజ్ ఉండేది.
కానీ కొంతకాలంగా అందుకు భిన్నమైన పాత్రలను చేస్తున్నాడు.
కొన్ని హిందీ సినిమాలలో ప్రతినాయకుడి పాత్రలు చేయడానికి కూడా మాధవన్ వెనుకాడలేదు.
తెలుగులో ఆ మధ్య వచ్చిన అనుష్క ‘నిశ్శబ్దం’ (Nishabdham) లో అలాంటి భిన్నమైన పాత్రనే మాధవన్ చేశాడు.
సైంటిస్ట్ నంబి నారాయణన్ బయోపిక్ ‘రాకెట్రీ’ (Rocketry) తో మాధవన్ దర్శకుడిగానూ మారిపోయాడు.
ఆ బయోపిక్ అతనికి నటుడిగా, దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
అలానే గత యేడాది మాధవన్ నటించిన ‘సైతాన్’ (Saitaan) కూడా కమర్షియల్ హిట్ అయ్యి, మాధవన్ లోని నటుడిని వెలికి తీసింది.
ఈ యేడాది ఇప్పటికే మాధవన్ నటించిన ‘హిసాబ్ బరాబర్,’ ‘టెస్ట్’ చిత్రాలు వచ్చాయి.
అయితే ఈ రెండు కూడా ఓటీటీలోనే విడుదల కావడం విశేషం.
ఇక అక్షయ్ కుమార్ తో కలిసి మాధవన్ నటించిన కోర్ట్ డ్రామా ‘కేసరి చాప్టర్ 2’ థియేటర్లలో సందడి చేసింది.
తాజాగా మాధవన్ నటించి మరో చిత్రం ‘ఆప్ జైసా కోయి’ మూవీ సైతం ఓటీటీలో రిలీజ్ కాబోతోంది.
ఈ సినిమాలో మాధవన్ సరసన ఫాతిమా సనా షేక్ నటిస్తోంది.
మాధవన్ ఈ రొమాంటిక్ లవ్ డ్రామాలో సంస్కృతం లెక్చరర్ గా నటిస్తుంటే, సనా ఫ్రెంచ్ టీచర్ పాత్రను పోషిస్తోంది.
రెండు భిన్న ధృవాలకు చెందిన వీరిద్దరూ కలిసి జీవితం సాగించాల్సి వచ్చినప్పుడు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయన్నదే ‘ఆప్ జైసా కోయీ’ సినిమా.
ధర్మా ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాను వివేక్ సోని డైరెక్ట్ చేశారు.
ఇది జూలై 11 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది.