కరీంనగర్ నగరంలో గాడి తప్పిన ప్రభుత్వపాలన
నేటికీ ఇందిరమ్మ కమిటీలు లేకపోవడం సిగ్గుచేటు
సమస్య చెప్పుకుందాం అంటే అధికార పార్టీ నాయకుడే లేడు
ఇంచార్జ్ మంత్రి ఉన్నా లేనట్టే-సిపిఐ
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ నగర ప్రజలకు తమ సమస్యలు వెల్లవించుకుందామంటే దిక్కులేని దుస్థితి ఉందని అధికార పార్టీ ప్రజాప్రతినిధి కరీంనగర్లో లేకపోవడం వల్ల ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని దుస్థితి ప్రజలు ఎదుర్కొంటున్నారని కసిరెడ్డి సురేందర్ రెడ్డి, పైడిపల్లి రాజు ఒక సంయుక్త ప్రకటనలో అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇందిరమ్మ కమిటీలు, ఇందిరమ్మ ఇండ్లు, రాజివ్ యువ వికాస్ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంటే కరీంనగర్ నగరంలో మాత్రం మొద్దు నిద్రలో అధికార పార్టీ ఉందని వారు విమర్శించారు.
ప్రజలు సమస్యలు చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని దుస్థితి కరీంనగర్ నగరంలో నెలకొందని వారు ఆరోపించారు.
సంక్షేమ పథకాలు ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక, రాజీవ్ యువ వికాస్ ఎంపిక ఏమాత్రం జరగడంలేదని ఇది చాలా దుర్మార్గమని అన్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ నగరంలో మాత్రం దశ దిశ లేకుండా పోయిందని ప్రజా సమస్యలు పట్టించుకునే నాధుడే కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లాకు ఇన్చార్జి మంత్రిగా ఉన్న ఉత్తమ కుమార్ రెడ్డి ఏదో తూతూ మంత్రంగా వచ్చి అధికారుల సమావేశాలు ఏర్పాటు చేసి వెళ్లిపోతున్నాడు తప్ప ప్రజా సమస్యలు ఫిర్యాదులను ఏమాత్రం పట్టించుకోవడంలేదని కరీంనగర్ నగరాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని ఆక్రోషం వ్యక్తం చేశారు.
గతంలో స్మార్ట్ సిటీ పనుల్లో జరిగిన అవినీతిపై అధికార పార్టీ నేతలు విచారణ జరిపించడంలో విఫలం చెందారని వెంటనే గత మేయర్ సునీల్ రావు, పాలకవర్గం చేసిన స్మార్ట్ సిటీ అవినీతిపై విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హాయములో రోడ్లను తవ్వి రోడ్డు వేస్తామని చెప్పి మధ్యలోనే వదిలేసారని మురుగు కాలువలు కూడా అలాగే వదిలేసారని వాటి పనులను చేపించడంలో అధికార పార్టీ పూర్తిగా విఫలం చెందినని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మున్సిపల్ యంత్రాంగం పూర్తిగా తమ ఇష్టారాజ్యం వచ్చినట్లు పనులు చేస్తున్నారని వీధి దీపాలు సరిగా వెలగడం లేదని, పారిశుద్ధం పడకేసిందని ప్రశ్నించే వారు లేకపోవడం వల్ల నగర కమీషనర్ ఇష్ట రాజ్యాంగ వ్యవహరిస్తున్నా పట్టించుకునే నాధుడు లేడని అన్నారు.
కోట్ల రూపాయలతో నిర్మించిన తీగల వంతెన పూర్తిగా దెబ్బతింటున్న అటువైపు కన్నెత్తి చూసే వారు లేరని రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిందని పేర్కొన్నారు.
ప్రతి ఆదివారం తీగల వంతెనపై ప్రజలు ఆహ్లాదకరంగా వినోదం పంచుకోవడం కోసం సాంస్కృతిక కార్యక్రమాలు చేపడతామని, చెప్పిమాట తప్పారన్నారు.
వర్షాకాలం సమీపిస్తున్న ప్రత్యామ్నాయ చర్యలు కరీంనగర్ నగరంలో నేటికీ కమిషనర్ చేపట్టకపోవడం చూస్తుంటే ప్రజల పట్ల అధికారులకు, ప్రభుత్వానికి ఎంత చిత్త శుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు.
ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతున్న ఒక్క ఇల్లు కూడా ఇప్పటికీ కరీంనగర్ నగరంలో ఇవ్వకపోవడం సిగ్గుచేటు అన్నారు.
నగరంలోచాలామందికి రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు బిల్లు అమలు కావడం లేదని,గ్యాస్ డబ్బులు బ్యాంకులో పడడం లేదని ఇది చాలా దుర్మార్గమని వెంటనే కరీంనగర్ నగరంలో ఇందిరమ్మ కమిటీలు వేసి ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇండ్లు ఇవ్వాలని లేకుంటే ప్రజాగ్రహానికి కాంగ్రెస్ పార్టీ గురకక తప్పదని కసిరెడ్డి సురేందర్ రెడ్డి,పైడిపల్లి రాజు విమర్శించారు.