ఇండస్ట్రీలో పనిగంటలపై చర్చ.. రానా దగ్గుబాటి కీలకవ్యాఖ్యలు
నేటిధాత్రి:
ఇటీవల పని గంటలపై జరుగుతున్న చర్చలు చిత్ర పరిశ్రమకు కూడా వ్యాపించాయి. ‘స్పిరిట్’ (Spirit) సినిమా నుంచి దీపికా పదుకొణె (Deepika Padukone) వైదొలగడంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati) తనదైన శైలిలో స్పందించారు. పని సంస్కృతి, ఆర్థిక పరిస్థితులపై చర్చలు అనవసరమని, నిరంతర సాధన, కృషే పని జీవితానికి నిజమైన విలువని అన్నారు. భారత్ ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశమని, అధిక సామర్థ్యం, ఎక్కువ పని గంటలు దేశ అభివృద్ధికి అవసరమని పేర్కొన్నారు.
సినీ పరిశ్రమలో పని గంటలు ప్రాజెక్ట్ను బట్టి మారతాయని రానా వివరించారు. “భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం. తలసరి ఆదాయంలో మన ఆర్థిక వ్యవస్థ 186వ స్థానంలో ఉంది. తెలుగు సినీ పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్కు మారినప్పుడు వందలమంది కుటుంబాలతో వలస వచ్చారు. నా దృష్టిలో అది కేవలం పని కాదు, జీవనశైలి. ప్రతి ప్రాజెక్టు, దానిలో పనిచేసే వ్యక్తులను బట్టి పని గంటలు మారతాయి” అని అన్నారు.
మహారాష్ట్రలో 12 గంటల షిఫ్ట్ విధానం, తెలుగు పరిశ్రమలో 8 గంటల షిఫ్ట్ సాధారణమన్నారు. అయితే షూటింగ్ షెడ్యూల్లు లొకేషన్, సెట్, స్టూడియో వంటి అంశాలపై ఆధారపడతాయని రానా వివరించారు. “మహారాష్ట్రలో ఉదయం 9 గంటలకు షూటింగ్ మొదలవగా, తెలుగులో 7 గంటలకే ప్రారంభమవుతుంది. సెట్ సన్నద్ధత, లొకేషన్ ఎంపిక వంటివి సులభమైనవి కావు. దేశంలో 70-80% మంది రోజువారీ సంపాదన వంద రూపాయలే. ఈ విషయాలను సూక్ష్మంగా చూడాలి” అని ఆయన అన్నారు.
నటులు సెట్ లో ఎక్కువ సమయం గడపడానికి బలవంతంగా ఒత్తిడి ఉంటుందనే వాదనపై రానా స్పందిస్తూ.. “ఎవరూ బలవంతంగా ఉండమని చెప్పరు. సినిమా ఒక వృత్తి. ఒత్తిడి చేయడం జరగదు. ఇందులో పనిచేయాలనుకుంటే చేయొచ్చు. అది వ్యక్తిగత ఎంపిక. కొంతమంది నటులు 4 గంటలు మాత్రమే పనిచేస్తారు, అది వారి విధానం” అని పేర్కొన్నారు.