పశువులను సంరక్షించేందుకే గోశాలకు తరలింపు…
పశువులు వాహనదారుల ప్రమాదాలకు కారణమైతే యజమానులపై చర్యలు..
మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, పట్టణ ఎస్ఐ రాజశేఖర్
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలోని పలు ఏరియాలలో రోడ్లపై సంచరిస్తున్న పశువులను మున్సిపల్ శాఖ,పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో గోశాలలకు తరలించారు.రోడ్లపై సంచరించే పశువులను పశు యజమానులు వాటిని తమ ఇంటికి తీసుకువెళ్లాలని గత ఐదు నెలలుగా పత్రిక ప్రకటనలు ఇచ్చినప్పటికీ కొందరు యజమానులు పశువులను రోడ్లపై వదలడంతో గోశాలలకు తరలిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు, ఆర్ కె పి ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మానవాళినీ ఇబ్బందులకు గురి చేసే ఏ జీవులైనా సరే కుక్క, గోవు, పశువు ఏదైనా తరలించే హక్కులు మునిసిపాలిటీ అధికారులకు ఉంటాయని కమీషనర్ గద్దె రాజు తెలిపారు .

పశువులను సంరక్షించేందుకే వాటిని గోశాలలకు తరలిస్తున్నామని వారు అన్నారు. పశువులు రోడ్లపై సంచరిస్తూ పాదాచారులకు, వాహనదారులకు, వ్యాపారస్తులకు, కాలనీవాసులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న నేపథ్యంలో పశువులను గోశాలలకు తరలించడం జరిగిందని పేర్కొన్నారు.

పశువులను ఇలాగే రోడ్లపైకి వదిలేస్తే వాహనదారులు ప్రమాదానికి గురైనట్లయితే పశు యజమానులపై తగు చర్యలు తీసుకోబడతాయని ఎస్ఐ హెచ్చరించారు. సరైన ఆధారాలతో ఎవరైనా పశువుల యజమానులు వచ్చి మమ్మల్ని సంప్రదిస్తే పశువులను వాటి యజమానులకు అప్పగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మందమర్రి వెటర్నరీ డాక్టర్ తిరుపతి, మూగజీవుల సేవా సంఘం సభ్యులు, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.