ధనిక రాష్ట్రమా? అప్పుల భారమా!!

`నిజంగానే తెలంగాణ అప్పులలో కూరుకుపోయిందా?

`కొత్త అప్పులు పుట్టే పరిస్థితి లేకుండా పోయిందా?

`తెలంగాణ ఆదాయం తరిగిపోయిందా?

`అప్పులతో సంపాదన తరిగిపోతోందా?

`సంక్షేమ కార్యక్రమాలకు కటకట తప్పదా!

`కేసీఆర్‌ ధనిక రాష్ట్రమని పదే పదే చెప్పారు!

`ఎన్నికల ముందు కాంగ్రెస్‌ నేతలు కూడా అదే చెప్పారు.

`ఇప్పుడు ప్రభుత్వ పథకాల అమలు కష్టమంటున్నారు!

`లోపం ఎక్కడ జరుగుతోంది?

`ఏడాదిన్నరలోనే ఎందుకు తారుమారైంది?

`కొత్తగా ఇరిగేషన్‌ ప్రాజెక్టులు ఎలా మొదలుపెడుతున్నారు?

`సన్న బియ్యం ఎలా ఇస్తున్నారు!

`రాజీవ్‌ యువ వికాసం ఎలా అమలు చేస్తారు!

`ఇందిరమ్మ ఇండ్లు ఎలా నిర్మిస్తారు!

`ఆదాయంలో సగం అప్పులకే పోతే పథకాల అమలు ఎలా సాధ్యమౌతుంది!

`కడుపు కట్టుకొని పని చేయడం అంటే అర్థమేమిటి!

`దుబారా లేకుండానే ఏడాదిన్నరలో లక్షన్నర కోట్లు అప్పు చేయడమేమిటి!

`అంతా గందరగోళం… ఆగమాగం!

ఏం మాట్లాడినా ఎదుటి వాళ్లు మెచ్చాలని అనేది ఒక సామెత. ఎందుకంటే నోటి నుంచి ఏ మాట వచ్చినా అది అందరూ వినడానికే..ఆ మాట అందంగా వుండాలి. అర్దమయ్యేలా వుండాలి. అర్ధం చేసుకునేలా వుండాలి. అంతే కాని అవతలి వారు ఆశ్చర్యపోయేలా వుండొద్దు. ఆందోళన చెందేలా వుండొద్దు. ఇది మనకు పెద్దలు నేర్పిన పాఠం. కాని రాను రాను రాజకీయాల్లో మాటల హద్దులు లేనట్లే పాలకుల మాటలకు కూడా హద్దులుండాలి. అప్పుడే సమాజం బాగుంటుంది. నాయకులు అదర్శంగా వుండాలి. పాలకులకు ఇంకా ఆదర్శంగా వుండాలి. అయితే ఇక్కడ తెలంగాణ విషయంలో మాత్రం ఎవరు ఏం చెబుతున్నారో ఎవరికీ అర్దం కావడం లేదు. గతంలో పదేళ్లపాటు పాలించిన కేసిఆర్‌ తెలంగాణ సంపన్న రాష్ట్రం. దేశంలోనే అత్యధిక దనిక రాష్ట్రం అంటూ లెక్కలు చెప్పేవారు. తాను ఎక్కడో వున్న రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లానని లెక్కలు చేప్పేవారు. 90వేల ఆదాయం వున్న రాష్ట్రాన్ని రెండున్నర లక్షల కోట్లక పెంచానని అంటూ వుండేవారు. దేశ జాతీయ వృద్ది రేటుకన్నా, రాష్ట్ర వృద్ది రేటు ఎక్కువ అంటూ లెక్కలు ప్రజల ముందు పెట్టేవారు. ఇక అప్పుల విషయంలో దేశంలో తెలంగాణ కన్నా ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రాలు ఎన్నో వున్నాయంటుండేవారు. అప్పుల్లో 24 స్దానంలో మాత్రమే వుందనే వారు. ఉత్తరప్రదేశ్‌ లాంటి రాష్ట్రం తెలంగాణకంటే నాలుగు రెట్లు ఎక్కువ అప్పులున్నట్లు ఆర్ధిక సూచీలు ప్రజల ముందు వుంచేవారు. దానికి తోడు తెలంగాణలో పెరిగిన సాగు స్ధిరీకరణ వల్ల తెలంగాణ రైతాంగం ఆదాయం గణనీయంగా పెరిగిందని అంటుండేవారు. ఒకప్పుడు ముప్పై లక్షల ఎకరాల్లో సాగు సాగితే ఇప్పుడు కోటిన్నర ఎకరాల్లో సాగు సాగుతోందని అందరూ ఒప్పుకుంటున్నారు. ఇక పారిశ్రామిక రంగం విషయానికి వస్తే ఐటి రంగంలో ఎంతో పురోగతి సాధించామన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఐటి ఎగుమతులు రూ.30వేల కోట్లు మాత్రమే వుంటే, పదేళ్ల కాలంలో 2లక్షల కోట్లకు పెరిగిందని నిపుణలు కూడా చెబుతున్నారు. మరి ఎక్కడ లోపం జరుగుతోంది. ఏ రంగంలో పురోభివృద్ది జరగక్కపోయినా తెలంగాణలో వ్యవసాయం రంగంలో మాత్రం విప్లవాత్మకమైన మార్పులు వచ్చిన మాట వాస్తవం. అందరూ అంగీకరించాల్సిన సత్యం. తెలంగాణ రాకముందు ఎంత సాగు జరిగేది? తెలంగాణ వచ్చిన రెండు మూడు సంవత్సరాలలోనే ఎంత విస్తీర్ణం పెరిగింది అనేది కూడా స్పష్టమైన లెక్కలున్నాయి. సాగుతో రైతులు సంతోషంగానే వున్నారు. పదేళ్ల కాలంలో ఒక్క ఏడాదిలో కూడా కరువు అనే మాట వినిపడలేదు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఏ పార్టీ వరి కొయ్యలు పట్టుకొచ్చింది లేదు. పైగా తెలంగాణ సాగు మొత్తం కరంటు మీదనే ఆదారపడి సాగుతుంది. రైతులకు ఉచితకరంటు ఇరవై నాలుగు గంటలు ఉచితంగానే ఇస్తున్నారు. కరంటు లేదన్న మాట ఏ రైతు పదేళ్లలో అడిగింది లేదు. ధర్నాలు, నిరసనలు చేసింది లేదు. అంటే రాష్ట్రంలో ఆర్ధిక పరిపుష్టి అనేది ఏర్పడిరదని చెప్పడానికి ఇదే సంకేతం. కాకపోతే ఆ సమయంలో కాంగ్రెస్‌ పార్టీ పదే పదే తెలంగాణ దనిక రాష్ట్రం కాదు. అంటూనే వుండేది. ఊపర్‌ షేర్వానీ..అందర్‌ పరేషాని అని ప్రచారం సాగిస్తూనే వుండేది. కేసిఆర్‌ చెప్పేవన్నీ అబద్దాలే అంటూ ప్రజలకు చెబుతుండేవారు. కాని తీరా ఎన్నికల సమయం దగ్గరకు వచ్చే సరికి కాంగ్రెస్‌ పార్టీ కూడా తెలంగాణ ధనిక రాష్ట్రమే అని చెప్పడం మొదలు పెట్టింది. ఎందుకంటే అప్పుల పాలైన రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రకటిస్తున్న సంక్షేమ పథకాలు ఎలా అమలు చేస్తారంటూ ప్రజలు కూడా ప్రశ్నించారు. దాంతో కాంగ్రెస్‌ తన వాయిస్‌ మార్చేసింది. తెలంగాణ కర్నాటక కంటే ధనిక రాష్ట్రమే అంటూ చెప్పడం మొదలు పెట్టింది. కాని అధికారం చేపట్టిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లంకెబిందెలున్నాయనుకుంటే, మట్టి కుండలు కూడా లేవంటూ చెప్పడం మొదలు పెట్టారు. అంటే ప్రజలను ఆయన తొలి రోజు నుంచే ప్రభుత్వ పధకాల విషయంలో సంసిద్దులను చేసే ప్రయత్నం చేశారు. కాని ప్రతిపక్ష బిఆర్‌ఎస్‌ ఊరుకోలేదు. తరుముతూ వచ్చింది. అయినా పరిగెత్తేందుకు అక్కడ మైదానం లేదు. ఎదురుతిరిగి సమాదానం చెప్పాల్సిన అసవరం లేదు. అందుకే లేదన్న మాట చెబితే చాలు.. రాష్ట్రాన్ని బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పుల పాలు చేసిందని చెప్పుకుంటూ పోతే చాలు అనుకున్నారు. ఏడాదిన్న కాలంగా అదే చెబుతున్నారు. ఇక్కడొక విషయాన్ని మెచ్చుకోవాల్సిన విషయం ఏమిటంటే గత బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పధకాలలో ప్రదానమైన పించన్లు అందిస్తున్నారు. అదే రెండు వేలతో సరిపుచ్చుతున్నారు. ఎన్నికల మందు ఇచ్చిన వాగ్ధానం అటకెక్కించారు. రెండు వేలు మాత్రం టంచన్‌గా ఇస్తున్నారు. ఎన్నికల్లో చెప్పినట్లు 4వేల రూపాయలు ఇవ్వమని చెప్పడం లేదు. ఇంకా తమకు సమయం వుందని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఇప్పుడు మాట మార్చేశారు. ఆరు గ్యారెంటీలలో కేవలం పించన్లు, కళ్యాణ లక్ష్మి చెక్కులు మాత్రం ఎక్కడా ఆపడం లేదు. పించన్లలో 4వేలు మర్చిపొమ్మని చెప్పినట్లే..కళ్యాణ లక్ష్మిలో తులం అడగొద్దన్నట్లు పరోక్షంగా స్పష్టత ఇస్తూ వస్తున్నారు. ఎందుకంటే బంగారం తులం లక్ష దాటిపోయింది. ఇక ఇవ్వడం సాధ్యం కాకుండాపోతోంది. ఇంతకీ తెలంగాణ ధనిక రాష్ట్రమా? అప్పుల భారం మోయలేకుండా వుందా?అన్నది తేలాలి. రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక ప్రవాహం. పార్టీలు మారినా, కొత్త పాలకులు విచ్చినప్పుడు దానిని కొనసాగించడమే ఆనవాయితీ. అంతే గాని, గత పాలకులు అప్పుల కుప్ప చేసిపెట్టారని గెలిచిన తర్వాత చెప్పడం అనేది సరైంది కాదు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇస్తున్న హమీల అమలుకు ఎలాంటి కసరత్తు చేస్తున్నారని మీడియా ప్రశ్నిస్తే, రాష్ట్ర బడ్జెట్‌పై పూర్తి అవగాహన వుందన్నారు. మరి ఇప్పుడు ఆదాయం లేదంటున్నారు. తాజాగా ఉద్యోగులు తమ సమస్యల సాధన కోసం సమ్మెకు దిగుతామంటున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు కూడా అదే బాటలో నడుస్తామంటున్నారు. ఈ సమయంలో ఉద్యోగులతో సిఎం. రేవంత్‌రెడ్డి సంక్షేమ పధకాలు ఆపమంటారా? వచ్చే రూపాయిని ఉద్యోగ సంఘాల చేతుల్లో పెట్టేస్తా..ఎలా పంచుతారో పంచండి అని బంతిని వారి కోర్టులోకి నెట్టేశారు. పరోక్షంగా తెలంగాణ ఉద్యోగులకు ఇప్పటికే ఎక్కువ జీతాలున్నాయి. ఇంకా గొంతెమ్మ కోరికలు తీర్చే ప్రసక్తి లేదని ఒక రకంగా తేల్చి చెప్పారు. కాని ఎన్నికల ముందు ఉద్యోగుల సమస్యలన్నీ తీర్చేస్తామన్నారు. అమాయకులైన ప్రజలకు ఏం చెప్పినా వింటారు గాని, ఉద్యోగులు ప్రభుత్వాలు చెప్పినట్లు విన్న సందర్బాలు ఎప్పుడూ లేదు. కొంత కాలం ఓపిక పట్టినా, ఎప్పుడో అప్పుడు మళ్లీ నిరసనల రాగం అందుకుంటారు. పెన్‌ డౌన్‌ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు. ఇక్కడే సిఎం. రేవంత్‌రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పించన్లు ఆపమంటారా? ధరలు పెంచమంటారా? అని కూడా ఉద్యోగులను ప్రశ్నించారు. అంటే పరోక్షంగా దరల పెంపునకు ప్రభుత్వం తయారుగా వుందన్న విషయం చెప్పకనే చెప్పేశారు. అటు కరంటు, ఇటు బస్సు చార్జీలు, రిజిస్ట్రేషన్‌ చార్జీలు బారీగా పెంచే యోచన చేసేలా వున్నారు. కాకపోతే స్దానిక సంస్దల ఎన్నికల దాకా ఆగుతున్నారు. నిజంగానే తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందా? అంటే తెలంగాణకంటే ఎక్కువ అప్పులున్న రాష్ట్రాలు దేశంలో మరో 24వున్నాయి. వాటికి లేని ఇబ్బందులు తెలంగాణకే వస్తున్నాయా? కొత్త అప్పులు పుట్టడం లేదా? ఈ మాటను జనం నిజమే అని నమ్ముతారా? ఎందుకంటే మన దేశం రాష్ట్రాల సమాఖ్య. అంటే కేంద్రంతో సమానమైన అదికారాలు రాజ్యాంగం కల్పించబడిరది. కాకపోతే చేసే అప్పుల విషయంలో కేంద్రం కొంత కనికరం చూపాల్సిన అవసరం వుంటుంది. కేంద్ర రాష్ట్రాల మద్య సఖ్యత వున్నా, లేకున్నా తెలంగాణకు రావాల్సిన అప్పులు ఎలాగూ వస్తూనే వుంటాయి. ఒకరిని బ్రతిమిలాడి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. కేసిఆర్‌ ఈ విషయంలో ఎన్నడూ అప్పు పట్టుడం లేదన్న మాట చెప్పింది లేదు. కాని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పదేపదే ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నారు. అన్నదే ఇప్పుడు రకరకాల వాదనలకు దారి తీసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!