దేశ రక్షణలో సైనికులది వెలకట్టలేని పాత్ర
భారత సాయుధ దళాల పనితీరును చూస్తుంటే గర్వంగా ఉంది
-పహల్గాం ఉగ్రదాడితో దేశం మొత్తం కన్నీళ్లు కార్చింది
-నేడు సాయుధ దళాల పోరాటపటిమను చూస్తూ దేశం మొత్తం గర్విస్తుంది
-సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి
మొగుళ్లపల్లి నేటి ధాత్రి
ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద నిర్మూలనే లక్ష్యంగా భారత సాయుధ దళాలు పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలపై జరుపుతున్న దాడులను చూస్తుంటే చాలా గర్వంగా ఉందని సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడితో అమాయక దేశ ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, ఆ బాధతో దేశ మొత్తం కన్నీరు పెట్టిందని గుర్తుచేశారు. ఆ దాడికి ప్రతీకారంగా దేశ సాయుధ దళాలు ఉగ్రవాదుల స్థావరాల నిర్మూలనకు ఆపరేషన్ సింధూర్ పేరుతో తమదైన శైలిలో దాడులకు పాల్పడడాన్ని చూసి దేశ ప్రజలు సంతోషిస్తున్నారని చెప్పారు. నాటి నుంచి నేటి వరకు దేశ రక్షణలో సైనికుల పాత్ర వెలకట్టలేనిదని, సాయుధ దళాల పోరాటపటిమ దేశ ప్రజలకు గర్వకారణమన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన దాడులతో ఉగ్రవాదం పూర్తిస్థాయిలో కనుమరుగు కావాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.