తెలంగాణ ఆత్మ గౌరవమే కేసీఆర్
తెలంగాణ జీవం వున్నంత వరకు కేసీఆర్ కీర్తి అజరామరంగా వెలుగుతుంది
ఇప్పటికీ రామ రాజ్యం గురించి చెప్పుకున్నట్లే వచ్చే తరాలు కేసిఆర్ గురించి చెప్పుకుంటాయంటున్న బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్, నేటిధాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావు తో పంచుకున్న అనేక ఉద్యమ విశేషాలు ఆయన మాటల్లోనే…
`తెలంగాణ దేవుడు కేసిఆర్ అని భవిష్యత్తు తరాలు కొలుస్తారు
`తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్.
`బిడ్డ పుట్టినప్పుడు ఎలా వుందో అలాగే వుండాలనుకోరు.
`టీఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్గా మారడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు.
`ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ కావడం గిట్టని వారు చేస్తున్న అసత్య ప్రచారం.
`తెలంగాణ ఆత్మ, ఆవిష్కారం బీఆర్ఎస్
`ప్రజల గుండెల్లో వెయ్యేల్లు నిలిచిపోయే పార్టీ బీఆర్ఎస్
`కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణకు వ్యతిరేక పార్టీలు
`తెలంగాణ ఇస్తామని మాటిచ్చి పదేండ్లు దాట వేసిన పార్టీ కాంగ్రెస్
`సమైక్య వాదుల కుట్రలు నమ్మి ప్రకటించిన తెలంగాణ వెనక్కి తీసుకున్నది కాంగ్రెస్
`కేసీఆర్ ఆమరణ దీక్షకు భయపడి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది
`తప్పని పరిస్థితులలో బీజేపీ సమ్మతిచ్చింది
`ఇప్పటికీ తెలంగాణపై బీజేపీ కడుపులో కత్తులు పెట్టుకున్నది
`ఆనాడు తెలంగాణ ఎందుకని అద్వానీ అన్నాడు
`తల్లిని చంపి బిడ్డను బతికించారని ప్రధాని మోడీ పలుసార్లు అన్నారు
`తెలంగాణ ఆత్మగౌరవం రాష్ట్ర బీజేపీ నాయకులలో లేదు
`తెలంగాణపై ఆ పార్టీ పెద్దలు విషం చిమ్ముతున్నా పదవులు పట్టుకొని వేళాడుతున్నారు
`తెలంగాణ కోసం కొట్లాడితే ఆ విలువ బీజేపీ నాయకులకు తెలిసేది
`తెలంగాణ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే, కిషన్ రెడ్డి అమెరికా వెళ్లిపోయాడు
`తెలంగాణ తల్లి బిడ్డలే బీఆర్ఎస్ నాయకులు
`తెలంగాణ తల్లికి ద్రోహం చేసినవే ఆ రెండు పార్టీలు
`అందుకే బీఆర్ఎస్ రజతోత్సవ సభ అంటే ఎండాకాలంలో గజగజ వణుకుతున్నారు
`రెండు పార్టీలకు తెలంగాణ మనుగడ వుండదని భయపడుతున్నారు
అప్పటికీ, ఇప్పటికీ,ఎప్పటికీ తెలంగాణ పేగుబంధం బిఆర్ఎస్కు మాత్రమే వుంటుంది. ఎందుకంటే తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ బిఆర్ఎస్. తెలంగాణ గురించి, బిఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే నైతికత ఏ పార్టీకి లేదు. ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వున్న అన్ని పార్టీలు తెలంగాణను వ్యతిరేకించిన పార్టీలే. ఆనాడు కాంగ్రెస్ పార్టీ గెలుపుకోసం, అదికారంకోసం తప్పని పరిస్దితుల్లో తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ అన్నదే తప్ప, ఆ పార్టీకి చిత్తశుద్ది ఆనాడు లేదు. ఇప్పుడూ లేదు. ఒక ఓటు రెండు రాష్ట్రాలంటూ మాయ మాటలు చెప్పి, తెలంగాణ ఏర్పాటుకు సహకరించని పార్టీ బిజేపి. బిజేపి ఎన్టీయే హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసి, తెలంగాణకు తీరని అన్యాయం చేసిన పార్టీ బిజేపి. ఆ రెండు పార్టీలలో తెలంగాణ ఆత్మ ఇసుమంతైనా కనిపించదు. నిజంగా తెలంగాణ ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్కు వుంటే సమైక్యవాదుల కృత్రిమ ఉద్యమానికి మద్దతు పలికేదే కాదు. తెలంగాణ ఇవ్వకుండా తప్పించుకునే అవకాశం దొరికిందని తెలంగాణ ప్రకటన వెనక్కి తీసుకునేదే కాదు. తెలంగాణ ప్రకటించి పట్టుమని పది రోజులు కూడా కాకముందే తెలంగాణను వెనక్కి తీసుకుని కాంగ్రెస్ ఎప్పుడో తెలంగాణ ద్రోహం చేసింది. కేవలం అధికారం కోసం తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని కూడా లెక్కచేయని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికీ మనస్పూర్తిగా జై తెలంగాణ అనరు. అనడానికి కూడా మనసురాదు. ఇప్పుడు పాలను సాగిస్తున్న ముఖ్యులెవరైనా సరే ఏ సభలోనైనా సరే జై తెలంగాణ అనడం జరుగుతుందా? కనీసం ప్రజలు ఏమనుకుంటారో అన్న భయం కూడా వారిలో లేదు. ఎందుకంటే ఆ కాంగ్రెస్ నాయకులు జై తెలంగాణ అంటే కూడా ఎక్కడ ఆ క్రెడిట్ కేసిఆర్కు వెళ్తుందో అనే భయమే ఆవహించి వుంది. అది చాలు తెలంగాణ ఆత్మలో కేసిఆర్ మాత్రమే వున్నాడని చెప్పడానికి అంటున్న బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ , నేటి దాత్రి ఎడిటర్ కట్టా రాఘవేంద్రరావుతో కేసిఆర్ గొప్పదనం, బిఆర్ఎస్ పార్టీ ప్రస్ధానంపై చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ఆయన మాటల్లోనే…
ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ఆత్మగౌరవమే కేసిఆర్. తెలంగాణ అనే జీవం వున్నంత వరకు కేసిఆర్ కీర్తి అజరామరంగా వెలుగుతూనే వుంటుంది. యుగాలు మారినా రామ రాజ్యం గురించి ఎలా చెప్పుకుంటున్నారో, తరాలు ఎన్ని మారినా భవిష్యత్తులో కేసిఆర్ ఉద్యమం, స్వర్ణయుగ పాలన గురించి నిత్యం చెప్పుకుంటారు. అంతగా తెలంగాణను తీర్చిదిద్దిన నాయకుడు కేసిఆర్. దేశంలో కేవలం రాష్ట్ర సాధనకోసం ఏర్పాటైన పార్టీలు రెండు. జార్ఖండ్ ముక్తి మోర్చా. రెండోది బిఆర్ఎస్. అయితే జార్ఖండ్ కోసం కేసిఆర్ సాగించింతనంత ఉద్యమం సాగలేదు. పద్నాలుగేళ్ల సుదీర్ఘ కాలం జరగలేదు. తెలంగాణ ఆత్మ ఆవిష్కారం కోసం, ఆత్మగౌరవం కోసం, అస్దిత్వం కోసం, స్వయం పాలన కోసం కేసిఆర్ తెగించి, పద్నాలుగు సంవత్సరాల పాటు సాగించిన ఉద్యమం చరిత్రలో నిలిచిపోయింది. ప్రపంచ ఉద్యమ చరిత్రలకే పాఠాలు నేర్పింది. అంత గొప్పది కేసిఆర్ సాగించిన ఉద్యమం. చైనా లాంటి దేశాలలో తెలంగాణ ఉద్యమం గురించి పాఠాలుగా చెప్పుకుంటున్నారంటే అది కేసిఆర్ గొప్పదనం. ఆయన త్యాగం. భవిష్యత్తు తరాలు ఖచ్చితంగా కేసిఆర్ను దేవుడుగా కొలుస్తారు. ఒక్క రాజమండ్రి బ్రిడ్జిని కట్టిన కాటన్ దొరనే కోనసీమలో దేవుడు అని కొలుస్తున్నారంటే ఎడారి లాంటి తెలంగాణను బంగారు మాగాణ చేసి, సిరుల పంటలు పండేలా చేసిన కేసిఆర్ను ఇంకెంత గొప్పగా కీర్తించాలి. ఇంకెంత భక్తితో కొలువాలి. అందుకే భవిష్యత్తు కాలంలో కేసిఆర్ను స్మరించకుండా సాగు కూడా చేయరు. అంతగా కేసిఆర్ రైతు బాంధవుడయ్యారు. రైతును రాజును చేసిన కీర్తిని సంపాదించుకున్నారు. అలాంటి కేసిఆర్ కేవలం తెలంగాణ ఉద్యమం కోసం బిఆర్ఎస్ ఏర్పాటుచేసి ఇప్పటికీ 25 సంవత్సరాలు పూర్తవుతోంది. ఇంత కాలం ఒక పార్టీ మనుగడ సాగించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ప్రజల గుండెల్లో కేసిఆర్ కొలువై వుండడం వల్లనే సాధ్యమౌతోంది. బిఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకున్న నుంచి చిదిమేయాలని సమైక్యవాదులు అనేక సార్లు చూశారు. పార్టీని పలుసార్లు చీల్చే ప్రయత్నం చేశారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కున్నారు. తెలంగాణ ఉద్యమం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. బిఆర్ఎస్ను లేకుండా చేయాలని కుట్రలు చేశారు. ఏకంగా కేసిఆర్ను కూడా భౌతికంగా లేకుండా చేయాలని అనేక సార్లు రెక్కిలు కూడా నిర్వహించారు. కేసిఆర్ పుట్టిందే తెలంగాణకోసం. కేసిఆర్ రాజకీయం చేసిందే తెలంగాణ కోసం. కేసిఆర్ ఉద్యమ జెండా ఎత్తిందే తెలంగాణ కోసం..అలాంటి గొప్ప త్యాగధనుడిపై కుట్రలు చేసిన వారు కాలగర్భంలో కలిసిపోయారు. రాజకీయంగా కనుమరుగైపోయారు. కేసిఆర్ మాత్రం పద్నాలుగేళ్లపాటు కొట్లాడి తెలంగాణ తెచ్చారు. డిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించారు. అలాంటి బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటుంటే ఎండా కాలంలో కూడా కాంగ్రెస్, బిజేపిలు గజగజ వనుకుతున్నాయి. తెలంగాణ ప్రజలు అంతా రజతోత్సవ సభ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారని తెలిసి, ఆ పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తెలంగాణ తల్లి నిజమైన బిడ్డలే బిఆర్ఎస్ నాయకులు. తెలంగాణకు తీరని ద్రోహంచేసిన పార్టీలే కాంగ్రెస్,బిజేపిలు. అందుకే ఆ పార్టీలను నమ్మడానికి కూడా తెలంగాణ ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. కాని గత ఎన్నికల్లో ప్రజలకు లేనిపోనివి చెప్పి, చెప్పి, అబద్దాలు ఆడి, ఆడి గెలిచారు. అదికారంలోకి వచ్చిన వెంటనే నయ వంచన మొదలు పెట్టారు. అందుకే వంద రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పివన్నీ అబద్దాలని, మోసాలని ప్రజలకు తెలిసిపోయింది. ఆరు నెలల్లోనే ఎంతో వ్యతిరేకత మూటగట్టుకున్నది. అందుకే బిఆర్ఎస్ రజతోత్సవ సభ అంటే కాంగ్రెస్కు వణుకు పుడుతోంది. పైగా బిఆర్ఎస్ సభలంటే ఎలా వుంటాయో ప్రపంచానికి మొత్తం తెలుసు. పోరుగర్జన, సంహిగర్జన, మహాసింహగర్జన, కొంగర కలాన్ సభలు ఇప్పటికే చరిత్రోలో నిలిచిపోయాయి. ఇప్పుడు ఒక్క అడుగు వెనక్కి వేసిన పులి వేటకు వెళ్తే ఎలా ముందుకు దూకుతుందో అలా బిఆర్ఎస్ రజతోత్సవ సభ వుంటుందని ముందే కాంగ్రెస్, బిఆర్ఎస్పార్టీలు ఊహిస్తున్నాయి. అందుకు ఆ పార్టీ నాయకులకు నిద్రలు కూడా వుండడం లేదు. ప్రజలు పుట్టల నుంచి చీమలు బైటకు వచ్చినట్లు పల్లెల నుంచి లక్షలాదిగా వరంగల్ రజతోత్సవ సభకు వస్తారని తెలుసు. బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వచ్చే సభ రాజకీయ సభల చరిత్రలోనే సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే తెలంగాణ తెచ్చింది కేసిఆర్. బిఆర్ఎస్. తెలంగాణ కోసం కొట్లాడిరది బిఆర్ఎస్. తెలంగాణ కోసమే పుట్టింది బిఆర్ఎస్. కాంగ్రెస్,బిజేపిలు పక్తు తెలంగాణ వ్యతిరేక పార్టీలు. తెలంగాణ ఇస్తామని చెప్పి పదేళ్లు కాలయాపన చేసి, నమ్మక ద్రోహం చేద్దామనే చూసింది. అది పసిగట్టిన కేసిఆర్ ఆమరణ నిరసన దీక్ష చేపట్టారు. కాంగ్రెస్కు దిగిరాక తప్పలేదు. లేకుంటే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చేదే కాదు. బిజేపి తప్పని పరిస్దితుల్లో సమ్మతిచ్చిందే. ఎందుకంటే తెలంగాణ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేసినప్పుడు కాంగ్రెస్,బిజేపి ఎమ్మెల్యేలు ఎవరూ రాజీనామా చేయలేదు. బిజేపి ఏకైక శాసన సభ్యుడుగా వున్న కిషన్ రెడ్డి తెలంగాణ ప్రజలు ఒత్తిడి చేస్తారని గ్రహించి అమెరికా వెళ్లిపోయారు. ఇప్పటికీ బిజేపి తెలంగాణపై కడుపులో కత్తులు పెట్టుకొన్నట్లే మాట్లాడుతుంది. 1999 నుంచి 2004 వరకు కేంద్రంలో అదికారంలో వున్న బిజేపి కేంద్ర ప్రేభుత్వంలో ఉప ప్రదానిగా వున్న అద్వానీ తెలంగాణ ఎందుకు అని వెటకారం చేశాడు. తెలంగాణ వచ్చి ఇంతకాలమైనా ప్రధాని మోడీ అవకాశం దొరికినప్పుడుల్లా విషం చిమ్ముతూనే వుంటాడు. పార్లమెంటులో తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారంటాడు. తల్లిని చంపి బిడ్డను బ్రతికించారని తెలంగాణ అసి ్దత్వాన్ని అవమాన పర్చుతూనే వుంటాడు. ఎందుకంటే తెలంగాణ బిజేపి నాయకుల్లోనే ఆత్మగౌరవం లేదు. అందుకే కేంద్ర పెద్దలు తెలంగాణను కించపర్చుతుంటారు. తెలంగాణపై ఆ పార్టీ పెద్దలు విషం చిమ్ముతున్నా పదవులు పట్టుకొని వేళాడుతుంటారు. కాని తెలంగాణ కోసం కేసిఆర్ పదవులను గడ్డిపోచల్లా వదులుకున్నారు. తెలంగాణ సాధించారు. అందుకే తెలంగాణ జాతి పిత అని కేసిఆర్ కొనియాడబడతున్నారు.