పూలే,అంబేద్కర్ స్పూర్తితో కులవివక్షపై ప్రతిఘటన పోరాటాలు
కేవీపీఎస్ వరంగల్ జిల్లా కార్యదర్శి అరూరి కుమార్
నర్సంపేట,నేటిధాత్రి:
నేటి ఆధునిక యుగంలో గ్రామల్లో కులవివక్ష అంటరానితనం ప్రత్యక్షంగా, పట్టణాల్లో పరోక్షంగా కొనసాగుతుందని కులవివక్ష పై ఏప్రిల్ నెలలో జరుగు ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని కేవీపీఎస్ వరంగల్ జిల్లా కార్యదర్శి అరురి కుమార్ పిలుపునిచ్చారు.శనివారం కెవిపిఎస్ పట్టణస్థాయి సమావేశం డివిజన్ అధ్యక్షుడు హనుమకొండ సంజీవ అధ్యక్షత జరిగింది.ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కార్యదర్శి అరూరి కుమార్ మాట్లాడుతూ నేటికి దళితులకు గుడి ప్రవేశం లేని గ్రామాలు, బతుకమ్మ ఆడనీయని గ్రామాలు,క్షవరం చేయకపోవడం,దసరా పండుగ సందర్భంగా జమ్మి ఆకు తెంపారని దాడి,హోటళ్ళలో రెండు గ్లాసుల పద్ధతి,పాఠశాలల్లో దళితులు మధ్యాహ్న భోజనం వంట చేస్తే విద్యార్థులు తినకపోవడం రచ్చబండ మీద కూర్చొనియ్యకపోవడం వంటి కులవివక్ష రూపాలు కొనసాగున్నాయని చెప్పారు.కులవివక్ష పారద్రోలటానికి ఉన్న చట్టాలు జీవోలు రాజ్యాంగబద్ధమైన హక్కులను పాలకవర్గాలు అమలు చేయడంలేదన్నారు.ఈ వివక్ష రూపాలపై ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలు నిర్మించాలని కోరుతూ ఏప్రిల్ నెల మహనీయుల మాసంగా కేవీపీఎస్ ప్రకటించి పూలే అంబేద్కర్ జన జాతరలు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని వివరించారు. క్షేత్రస్థాయిలో గ్రామీణ కుల వివక్షతపై సర్వే నిర్వహిస్తామని అంబేద్కర్ జయంతి సభలు నిర్వహించి ఏప్రిల్ 15 నుండి 30 వరకు ప్రత్యక్ష ప్రతిఘటన పోరాటాలు నిర్మిస్తామన్నామని ఆయన తెలియజేశారు.ఈ సమావేశంలో పట్టణ కార్యదర్శి మొలుగూరి రాజు , అధ్యక్షులు సింగారపు బాబు, కమిటీ సభ్యులు జన్ను రమేష్,ధార మహేందర్,మహేష్,ప్రశాంత్,మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.