ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి రూ.50 వేల ఆర్థిక సహాయం.
బాలిక కుటుంబానికి అండగా ఉంటాం.
మహబూబ్ నగర్/ నేటి ధాత్రి.
ఉరేసుకొని బాలిక మృతి చెందిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో గురువారం ఉదయం జరిగింది. వివరాల ప్రకారం.. జనరల్ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలలో.. విద్యార్థులు ప్రార్థన కోసం సిద్ధమవుతున్న సందర్భంలో.. విద్యార్థి పాఠశాలలో ఎవరూ లేని సమయంలో ఏడవ తరగతిలో పదవ తరగతి బాలిక ఆరాధ్య (15) ఉరేసుకోగా.. తోటి విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన ఉపాధ్యాయులు విద్యార్థిని బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం షాద్ నగర్ తరలించగా.. అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. బాలిక స్వగ్రామం నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చొక్కన్నపల్లి గ్రామానికి చెందిన కొమ్ము రమేష్, రజిత కూతురు. ఈ సంఘటన తెలుసుకున్న విద్యార్థి సంఘాలు పాఠశాల ఎదుట ధర్నా చేపట్టారు. పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జడ్చర్ల సిఐ ఆదిరెడ్డి ఆధ్వర్యంలో.. పోలీసులు పాఠశాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ విజయేందిర బోయి పాఠశాలకు సందర్శించి విద్యార్థి మృతికి గల కారణాలు పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోధిస్తున్న తల్లిదండ్రులను ఓదార్చారు. విద్యార్థి కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఇవ్వాలని కోరగా.. పరిశీలిస్తామని, విద్యార్థి మృతికి కారణమైన వ్యక్తులపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా.. రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి.జానకి, జనరల్ గురుకుల పాఠశాల, కళాశాల డిప్యూటీ సెక్రటరీ ప్రసాద్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ నాగార్జున గౌడ్, రాజాపూర్ ఎస్సై రవి నాయక్, బాలానగర్ ఎస్సై లెనిన్ గౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.