వరంగల్:
భారతీయ మజ్దూర్ సంఘ్ కు అనుబంధంగా ఏర్పడి పాత్రికేయుల సంక్షేమం కోసం జాతీయ స్థాయిలో కృషి చేస్తున్న వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) వరంగల్ జిల్లాలో ఆవిర్భవించింది. . స్థానిక బాల సముద్రంలో శనివారం జరిగిన సన్నాహక సమావేశానికి జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
డబ్ల్యూజేఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరి కరుణాకర్, రాష్ట్ర కార్యదర్శి శివనాద్రి ప్రమోద్ కుమార్,రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అయోధ్య రామయ్యలు ఈ సమావేశంలో ప్రసంగించారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ఇతర యూనియన్లు విఫలమయ్యాయని వారు ఆరోపించారు. అరవయ్యేళ్లుగా జర్నలిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకుంటున్న సంఘాల వైఫల్యమే నేటి పాత్రికేయుల దుస్థితికి కారణమని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో నిఖార్సయిన సంఘంగా డబ్ల్యూజేఐ జాతీయ స్థాయిలో ఆవిర్భవించిందని పేర్కొన్నారు. 17 రాష్ట్రాలలో కార్యకలాపాలు నిర్వర్తిస్తూ పాత్రికేయుల సమస్యలపై పోరాడుతోందని తెలిపారు. క్షేత్ర స్థాయిలో పనిచేసే విలేకరులకు ఏ ఆపద వచ్చినా డబ్ల్యూజేఐ అండగా ఉంటుందని తెలిపారు.
జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నిరంతరం పనిచేసే డబ్ల్యూజేఐలో వరంగల్ జిల్లా జర్నలిస్టులు పెద్ద ఎత్తున చేరాలని కోరారు. కొద్ది రోజుల్లోనే తెలంగాణలో తాము అతి పెద్ద జర్నలిస్టు సంఘంగా ఆవిర్భవించగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
పాత్రికేయులకు పురస్కారాలు
పాత్రికేయులను ప్రోత్సహించేందుకు జనవరిలో రాష్ట్ర స్థాయిలో పురస్కారాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. జనవరి పదో తేదీలోగా ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ఈ సందర్భంగా పురస్కారాలకు సంబంధించిన బ్రోచర్ ను విడుదల చేశారు.