మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
2025 జనవరి 1 నుండి 31 వరకు నిర్వహించబడుతున్న ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని,శనివారం మహబూబ్ నగర్ జిల్లా పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించరు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యురాలు శ్రీమతి ఇందిరా దేవి హాజరయ్యారు.
ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా తప్పిపోయిన పిల్లలను గుర్తించడం, బాల కార్మికులుగా పని చేస్తున్న చిన్నారుల సమస్యలను పరిష్కరించడం, అక్రమ రవాణాకు గురైన చిన్నారులను రక్షించడం, వారికి పునరావాసం కల్పించి, చట్టపరమైన హక్కులు మరియు రక్షణ అందించడం జరుగుతుందన్నారు.
ఈ సంధర్భంగా శ్రీమతి ఇందిరా దేవి మాట్లాడుతూ పిల్లల హక్కులను కాపాడేందుకు పోలీసు విభాగం మరియు ఇతర విభాగాలు కలిసి బృందాలుగా ఏర్పడి రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ఫ్యాక్టరీలు, వాణిజ్య సంస్థలు, మరియు ఇతర ప్రదేశాలను సందర్శించి బాల కార్మికులుగా పని చేస్తున్న పిల్లలను గుర్తించేందుకు చర్యలు చేపడరని తెలిపారు. గల్లంతైన మరియు బాల కార్మికులుగా బాధపడుతున్న పిల్లలను రక్షించడం సమాజ పునాదులను బలోపేతం చేయడంలో కీలకమైన చర్య అని, “పిల్లల భవిష్యత్తును రక్షించడం ద్వారా సమాజంలో ఒక శక్తివంతమైన మార్పును తీసుకురావచ్చు” అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం పిల్లల హక్కులను కాపాడుతూ, వారి భవిష్యత్తు మెరుగ్గా తీర్చిదిద్దే దిశగా ముందడుగు వేస్తోందని పేర్కొన్నారు.
చైల్డ్ లైన్ 1098, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, మరియు స్వచ్ఛంద సంస్థల సహకారంతో పిల్లలకు తక్షణ సాయం అందించబడుతుంది. పిల్లల పేర్లు, సమాచారం, కుటుంబ కట్టుబాట్ల గురించి పూర్తి వివరాలు సేకరించి వారిని వారి కుటుంబాలకు తిరిగి చేర్చేందుకు చర్యలు తీసుకుంటారు.
ఈ కార్యక్రమములో అదనపు ఎస్పీ రాములు, సి డబ్ల్యూ సి చైర్మెన్ నయీముద్దీన్, జేజేబి చైర్పర్సన్ శ్రీమతి గ్రెస్స్ మరియు పోలీసు అధికారులు పాల్గొన్నారు..