తోటమల్ల బాలయోగి ,
నెహ్రూ కప్ వ్యవస్థాపకులు
భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలంలో ప్రతి ఏటా నిర్వహించే నెహ్రూ కప్ చారిత్రాత్మకమైందని నెహ్రూ కప్ వ్యవస్థాపకులు తోటమల్ల బాలయోగి వ్యాఖ్యానించారు. భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నెహ్రూ కప్ మూడు దశాబ్దాలుగా ఏజెన్సీలో సుందర స్వప్నంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక భారత దేశంలోనే భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారి పేరు మీదుగా 29 సంవత్సరాల పాటు టోర్నమెంట్ నిర్వహించిన దాఖలాలు లేవన్నారు. ఇందుకు కారణం భద్రాచలం క్రికెట్ ప్రేమికులే అన్నారు. నెహ్రు కప్ నిర్వహణ ద్వారా ఎంతోమంది యువతి, యువకులు తమ క్రికెట్ నైపుణ్యాన్ని పెంపొందించుకొని ఉన్నత స్థానాలను అధిరోహించారని తెలిపారు. ప్రస్తుతం భారత మహిళ అండర్ 19 జట్టులో ఆడుతున్న గొంగడి త్రిష కూడా నెహ్రూ కప్ నుంచి స్ఫూర్తి పొందిందని వెల్లడించారు. అదేవిధంగా ఇటీవల హైదరాబాద్ హెచ్.సి.ఏ జట్టుకు ఎంపికైన విద్వాన్ తదితరులకు కూడా నెహ్రూ కప్ స్ఫూర్తిదాయకమన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో నెహ్రూ కప్పు ది ఒక పెద్ద రికార్డు అని, ఇన్నాళ్లపాటు ఈ టోర్నమెంట్ జరగటానికి స్థానికుల సహాయ సహకారాలు మరువలేనివి అని అన్నారు.
నెహ్రూ కప్ ను విజయవంతం చేయండి :
ఎస్.కె అజీమ్, నెహ్రూ కప్ గౌరవ సలహాదారులు
భద్రాచలం పుణ్యక్షేత్రానికి మరింత శోభను తెచ్చిన నెహ్రు కప్ విజయవంతానికి అందరూ కృషి చేయాలని నెహ్రూ కప్ గౌరవ సలహాదారులు ఎస్కే అజీమ్ కోరారు. నెహ్రూ కప్ స్నేహత్వానికి, క్రమశిక్షణకు నిదర్శనంగా నిలిచిందన్నారు. ఈ టోర్నమెంట్ లో ఆడటం ద్వారా ఎంతో మంది క్రీడాకారులు వెలుగులోకి రావడం జరిగిందని వెల్లడించారు. నెహ్రూ కప్ మ్యాచ్ లను చూసేందుకు పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు భద్రాచలం తరలిరావాలని కోరారు.
ఆదివారం నుంచి క్రికెట్ పోటీలు : దాట్ల శ్రీనివాసరాజు, నెహ్రూ కప్ ప్రధాన కార్యదర్శి
డిసెంబర్ 29 నుంచి జనవరి 5 వరకు ఈ ఏడాది నెహ్రూకప్ అంతర్రాష్ట్ర క్రికెట్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని నెహ్రు కప్ ప్రధాన కార్యదర్శి దాట్ల శ్రీనివాసరాజు తెలిపారు. ఈనెల 27 నుంచి టోర్నమెంట్ జరగాల్సి ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో 29వ తేదీకి మార్చడం జరిగిందన్నారు. ఎప్పట్లాగానే నెహ్రూ కప్ నిర్వహణకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. భద్రాచలం ఏజెన్సీకి వన్నెతెచ్చిన టోర్నమెంటు నెహ్రూ కప్ అని వ్యాఖ్యానించారు
రసవత్తరంగా నెహ్రూ కప్ క్రికెట్ పోటీలు : ఎస్ కే సలీం, నెహ్రూ కప్ కన్వీనర్
నెహ్రూ కప్ క్రికెట్ టోర్నమెంట్ లో తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, సమీప ఛత్తీస్గడ్ నుంచి రాష్ట్రం నుంచి కూడా పేరుందిన క్రికెట్ జట్లు ఈసారి టోర్నమెంట్లో పాల్గొంటున్నాయని నెహ్రూ కప్ కన్వీనర్ ఎస్ కే సలీం తెలిపారు. ఈ ఏడాది 21 టీములకు అవకాశం కల్పించామని పేర్కొన్నారు. టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఇప్పటికే మైదానాన్ని సిద్ధం చేశామని తుది ఏర్పాట్లపై నిమగ్నమైనట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో నెహ్రూ కప్ క్రికెట్ టోర్నమెంట్ అధ్యక్షులు అట్లూరి శ్రీధర్, ఉపాధ్యక్షులు గుమ్ములూరు శ్రీనివాసరావు, కోశాధికారి కుంచాల సదానందం (సిద్దు) సహాయ కార్యదర్శి మడిపల్లి నాగార్జున, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు తోటమల్ల సురేష్ బాబు, విద్యాసాగర్, పూణెం ప్రదీప్ కుమార్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు