రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
రాజన్న సిరిసిల్ల(నేటి ధాత్రి):
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు విరుద్ధంగా జిల్లాలో మైక్రో ఫైనాన్స్ లోన్ రికవరీ లో వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మైక్రో ఫైనాన్స్ కంపెనీలను హెచ్చరిస్తూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
జిల్లాలో మైక్రో ఫైనాన్స్ కంపెనీ వారు, వడ్డీ వ్యాపారులు , లోన్ యాప్ సంబంధిత వర్గాలు కిస్తిల చెల్లింపులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాల్సి ఉంటుందని, లోన్ రికవరీ కోసం వేధింపులకు గురి చేయడం, ఇంటి దగ్గరికి వెళ్లి అవమానించడం, ఇష్ట రాజ్యాంగ వ్యవహరించడం లాంటివి మానివేయాలని లేనిపక్షంలో చట్ట ప్రకారం పోలీస్ కేసులు, కఠిన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.
మైక్రో ఫైనాన్స్ వాళ్ళు డబ్బులు చెల్లించాలని వేధిస్తే బాధితులు నేరుగా తనను కలవాలని, వేధింపు దారుల నుంచి రక్షణ కల్పిస్తామని, అప్పుల బాధతో ఆత్మహత్యలకు పాల్పడటం సరైన నిర్ణయం కాదని, మీపై ఆధారపడి ఉన్న కుటుంబం ఏమైపోతుందో ఆలోచించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.