జమ్మికుంట: నేటిధాత్రి
*పట్టించుకోని అధికారులు
ఆందోళనలో రైతన్నలు
మండలం లోని తనుగుల గ్రామ అంకుశావళి చెరువు కట్ట గత సంవత్సరం కోతకు గురైంది. కట్ట అక్కడక్కడ నెర్రెలు బారింది. గత వర్షాకాలంలో చెరువు పూర్తిగా నిండి కట్ట పైనుండి నీళ్లు రావడంతో కట్ట తెగి చెరువు ఆయకట్టుతో సంబంధం ఉన్న సుమారు 800 ఎకరాల పంట పొలాలకు నష్టం వాటిల్లుతుందని, తనుగుల , గండ్రపల్లి, శంభునిపల్లి, పాపక్కపల్లి,గోపాలపూర్,వావిలాల గ్రామాల రైతులు, ప్రజలు ఆందోళన చెందారు.
కానీ
పరిస్థితి ఇలా ఉంటే సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం వర్షా కాలంలో చెరువులోకి నీరు చేరితే కట్ట తెగే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు రైతులు పలుమార్లు విన్నవించుకున్నా చెరువు కట్టకు మరమ్మతులు చేస్తామని చెప్పిన పనులు జరగడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వర్షాకాలం లో చెరువు లోకి నీరు చేరితే కట్ట తెగి పొలాలన్ని కోతకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా వెంటనే సంబంధిత అధికారులు స్పందించి చెరువు కట్టకు మరమ్మతులు చేసి కట్ట కోతకు గురికాకుండా చూడాలని ఆయా గ్రామాల రైతులు,ప్రజలు కోరుతున్నారు.