రైతులకు అవసరమైన మేర ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

వేములవాడలోని పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో ఆకస్మిక తనిఖీ

వేములవాడ నేటిధాత్రి

జిల్లాలోని రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత విత్తన, ఎరువుల దుకాణ దారులు, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం వేములవాడ టౌన్ లో గల మన గ్రోమోర్ సెంటర్, శ్రీ లక్ష్మి ఎరువుల విత్తనాలు దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, విక్రయాల నిర్వహణను, రిజిస్టర్ లను ,స్టాక్ వివరాలు కలెక్టర్ పరిశీలించారు.

వానాకాలం 2024 పంటలకు జిల్లాలో అవసరమైన మేర ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు గానే స్టాక్ పెట్టుకుని రైతులకు సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నదని, మన జిల్లాలో సైతం ఎరువుల నిల్వలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వ్యవసాయ శాఖ ఉన్నత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడా కొరత రాకుండా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన మేర ఎరువుల నిలువలు అందుబాటులో ఉంచుకోవాలని, ఎరువుల కొరత రాకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ సూచించారు.

దుకాణాల్లో నకిలీ విత్తనాలు అమ్మకూడదనీ, అమ్మినచో కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రైతులకు సరిపోయే పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచాలని, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తే PD చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, ఏఓ సాయి కిరణ్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!