ఆటో వారికి అండగా ఉంటాం…
హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..
నేటిధాత్రి కమలాపూర్ (హన్మకొండ)కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లు గురించి ఆలోచించకుండా, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించడంతో కొన్ని లక్షల మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయని,వారికి బిఆర్ఎస్ పార్టీ తప్పక అండగా ఉంటుందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం ఆటో దారులకు మద్దతుగా కౌశిక్ రెడ్డి అసెంబ్లీకి ఆటోలో వచ్చిన సందర్భంగా ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్లో బుర్ర కరుణాకర్ అనే ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడం హృదయాన్ని కలిచివేసింది అన్నారు. తాను ఆటోలో వస్తున్నప్పుడు ఉచిత ప్రయాణం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్వయంగా డ్రైవర్లే తనతో చెప్పారని అన్నారు. కుటుంబ పోషణ కూడా చాలా ఇబ్బందిగా ఉందని తన దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. ఆటో దారులకు మద్దతుగా అసెంబ్లీకి వచ్చిన తర్వాత కూడా ఆటోని అసెంబ్లీకి అనుమతించలేదని, ఆటో వారిపై ప్రభుత్వానికి ఇంత చిన్నచూపు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లు కూడా ఓటు వేస్తేనే ఈ ప్రభుత్వం ఏర్పడింది అనే విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సమస్యపై దృష్టి పెట్టాలని అన్నారు. ఆటో డ్రైవర్ ఎవరు అధైర్య పడి ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆటో డ్రైవర్ల సమస్యలపై కూడా తప్పక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని తెలిపాడు.