భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75వ సంవత్సరాల భారతదేశ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. బ్రిటిష్ పరిపాలన, సంకేళ్ళ నుండి భారతమాత 1947 ఆగస్టు 15 స్వతంత్రం పొందినది. 1950 జనవరి 26 నుండి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. 1949 సంవత్సరం జనవరి 26న రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించినది. 1930 జనవరి 26న భారత జాతీయ కాంగ్రెస్ వలస పాలన నుండి భారతదేశంను “పూర్ణ స్వరాజ్”గా ప్రకటించింది. భారతదేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ తొలి గణతంత్ర దినోత్సవ త్రివర్ణ పతాకం ఎర్రకోటపై ఆవిష్కరించినారు.
ఈసారి అతిథి: ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విదేశీ ప్రధానమంత్రులు లేదా అధ్యక్షులను అతిథిలుగా ఆహ్వానిస్తాం. 2024 సంవత్సరానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేల్ మక్రాన్ పాల్గొనబోతున్నారం.
ఈ సంవత్సరం థీమ్ ఏమిటి: 2024 సంవత్సరంలో భారత రిపబ్లిక్ డే థీమ్ ను “వీక్షిత్ భారత్” (భారత్ అభివృద్ధి చెందిన దేశం) అనే నినాదించినారు. గణతంత్ర దినోత్సవం రోజున దేశం కోసం ప్రాణాలర్పించిన సాయుద దళల వారిని స్మరించుకుంటూ భారత ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఇండియా గేటు వద్ద పుష్పగుచ్చం సమర్పించి అనంతరం గణతంత్ర దినోత్సవం వేడుకలు ప్రారంభమవుతాయి. జాతీయ గీతాలాపనతో పాటు 21 తుపాకులతో గౌరవ వందనం ఉంటుంది. భారతదేశం వివిధ రాష్ట్రాల ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, సంగీతం, నృత్యం, వివిధ రాష్ట్రల, శాఖల, సంస్థల శకటాల ప్రదర్శనతో పాటు, త్రివిధ దళాలు ఎన్.సి.సి, ఎన్ఎస్ఎస్, స్కౌట్ అండ్ గైడ్స్ ల కవాతు కార్యక్రమాలు భారతీయత ఉట్టిపడేలా ప్రదర్శిస్తారు. భారతదేశ ఆయుధ, సైనిక ప్రదర్శనలు కనువిందు చేస్తాయి.
భారత రాజ్యాంగం రచన -దాని చరిత్ర: 1946 జులై-ఆగస్టులో రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ పరిషత్తులో మొత్తం 389 మంది సభ్యులు కలరు. బ్రిటిష్ ఇండియా నుండి 292 మంది ప్రతినిధులు, స్వదేశీ సంస్థలు నుండి 93 మంది ప్రతినిధులు, నలుగురు 4 చీఫ్ కమిషనర్ ప్రాంతాల ప్రతినిధులు ఇందులో కలరు. రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన ప్రముఖులు ముస్లిం వర్గాల నుండి మౌలానా అబుల్ కలాం ఆజాద్, సయ్యద్ సదుల్లా, సిక్కుల నుండి సర్దార్ బలదేవ్ సింగ్ మైనార్టీల నుండి హెచ్సి ముఖర్జీ, యూరోపియన్ల నుండి ఫ్రాంక్ ఆందోని, షెడ్యూల్ కులాల నుండి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, కార్మిక వర్గాల నుండి బాబు జగ్జీవరామ్, పార్సీల నుండి హెచ్.పి మోడీ అలాగే భారత మహిళా సమైక్య నుండి ఆన్సా మెహతా, హిందూ మహాసభ నుండి డాక్టర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఎం.ఆర్ జయకార్ కలరు. ఈ రాజ్యాంగ పరిషత్తు కమిటీలు డ్రాఫ్ట్ లను తయారు చేసినవది. రాజ్యాంగ ముసాయిదాను 1948 ఫిబ్రవరి 21న ప్రచురించారు. ఇందులో 315 ప్రకరణలు, 08 షెడ్యూలు కలవు. ఈ ప్రతిపై 7635 సవరణలు ప్రతిపాదించగా అందులో 2,473 చర్చకు వచ్చాయి. 114 రోజుల్లో వీటిని పరిశీలించి రాజ్యాంగ రూపకల్పన కోసం 2సంవత్సరాల 11 నెలలు 18 రోజుల సమయంలో 11 సమావేశాలు నిర్వహించినారు. అలాగే 1950 జనవరి 26 నుండి మన రాజ్యాంగం అమలులోనికి వచ్చింది.
ప్రవేశిక:
భారత రాజ్యాంగ గొప్పతనం ప్రవేశికలో గొప్ప భావజాలం కలదు. “భారత ప్రజలమైన మేము” తో ప్రారంభమవుతుంది. ప్రజలే రాజకీయ అధికారానికి మూలం ప్రజల చేత రాజ్యాంగం రచించుకోబడినదని అర్థం.
సార్వభౌమత్వం: అనగా సర్వోన్నత అధికారం అని అర్థం. విదేశీ, దౌత్య విధానాల్లో స్వేచ్ఛను కలిగి ఉంటుంది.ఏ బాహ్యా శక్తి మన విదేశంగా విధానాన్ని నియంత్రించలేదు.
సామ్యవాదం: ఈ పదం 1976, 42వ రాజ్యాంగ సవరణతో చేర్చారు. సామ్యవాదం అంటే సమాసమాజ స్థాపన ప్రజల మధ్య ఆర్థిక అంతరాలను తగ్గించి ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడము. సామ్యవాదానికి వివిధ రూపాలు అవి కమ్యూనిజం, మావోయిజం, సిండికాలిజం, గిల్డ్ సోషలిజం, ఫెబియనిజం, స్టేట్ సోషలిజం వివిధ దేశల్లో అమలలో కలవు.
లౌకిక తత్వం: దీన్ని 1976- 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చారు. లౌకికం అనగా మత ప్రమేయం లేని రాజ్యమని అర్థం.
ప్రజాస్వామ్యం: ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వలన ఏర్పడిన ప్రభుత్వం అని అర్థం. భారతదేశంలో పరోక్ష ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం అమలులో కలదు.
గణతంత్రం : గణం అంటే ప్రజలు తంత్రం అంటే పాలన ప్రజాపాలన అని అర్థం. వారసత్వ లేదా అధికార హోదా గణతంత్ర రాజ్యంలో ఉండవు.
భారత రాజ్యాంగం- సరికొత్త సవాళ్లు:
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 74 సంవత్సరాలు పూర్తి అయి 75 సంవత్సరాలలో అడుగెడుతున్న సందర్భంగా ప్రస్తుతం రాజ్యాంగాన్ని 105 సార్లు పర్యాయాలు సవరించారు. ఇందులో చాలావరకు అనవసరమైనవి కేవలం అధికార పార్టీ రాజకీయ అవసరార్థం చేసుకున్నవే ఎక్కువ.
అత్యవసర అధికారాల దుర్వినియోగం: ఈ ప్రత్యేక అధికారాలు దేశ ఐక్యత, సమగ్రత, రక్షణ అవసరార్థం ఉపయోగించాలి. కాని ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాలకు దుర్వినియోగం చేస్తున్నాయి. 356 ప్రకరణ ప్రకారం రాష్ట్రల్లో ప్రజా ప్రభుత్వాలను దుర్వినియోగం చేస్తున్నాయి.
మితిమీరిన అధికార కేంద్రీకరణ: నేడు ప్రభుత్వం అంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అనే అభిప్రాయం కలదు. మంత్రి మండలికి విలువలేదు.
చట్టసభల ప్రమాణాలు క్షీనత-ఆర్డినెన్స్: అధికారంలో ఉన్న ప్రభుత్వం చట్టసభలను బైపాస్ చేసేందుకు ముఖ్యంశాలను ఆర్డినెన్స్ తీసుకొస్తున్నాయి. ప్రత్యేక పరిస్థితుల్లో ఇది ఒక వెసులుబాటు మాత్రమే ఆర్డినెన్స్ స్పూర్తికి విఘాతం కలిగిస్తున్నాయి.
రాజ్యాంగ మౌలిక సూత్రాలైన సామ్యవాదానికి గ్రహణం: 1990 సం,లో ప్రపంచీకరణలో భాగంగా ప్రైవేటీకరణ ద్వారా సామ్యవాదాన్ని కొంత ప్రాముఖ్యత తగ్గింది అని చెప్పవచ్చు. కేంద్ర, రాష్ట్రాలు ప్రవేటికరణ కొరకు ప్రాముఖ్యతనిస్తున్నాయి. “డి నేషనల్లైజేషన్”, “డి ఇన్వెస్ట్మెంట్”, “డి రేగ్యులేషన్’, ”డి కంట్రోల్” అనే పేర్లతో ప్రభుత్వ పాత్ర తగ్గించుకుంటున్నాయి. అలాగే నేరమయ రాజకీయాలు, ప్రాంతీయతత్వం, మితిమీరిన రాజకీయం జోక్యం, ట్రిబునలిజం- న్యాయవ్యవస్థకు సమాంతర వ్యవస్థ, సన్నగిల్లుతున్న సామాన్య ప్రజల విశ్వాసం, సంకుచిత భావజాలం-కుల, మత తత్వాలు, ప్రాంతీయవాదం అస్తిత్వాలు వేర్పాటు వాదాలు, జాతీయ భావం లోపించడం, కేంద్రీకృత సమైక్య వ్యవస్థకు దారితీస్తున్న పరిస్థితులు, విధాన నిర్ణయాలలో నిరంతర స్థిరత్వం లేకపోవడం, ప్రపంచీకరణ బహుళ సంబంధాల సంస్థల ప్రభావం-రాజ్యాంగం ఉనికికే ప్రమాదం అనే చెప్పవచ్చు.
వ్యాస రచయిత:
డా.తూము విజయ్ కుమార్,
చరవాణి: 9492700653